Shahid Afridi’s criticism sparks debate ahead of IND vs WI Match: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. లీగ్, సూపర్-8లో టీమిండియా సాధించిన విజయాలు.. అసలు విజయాలేనా అని విమర్శించాడు. చిన్న జట్లపైనే టీమిండియా ప్రతాపం చూపిస్తుందని, పెద్ద జట్లపై తేలిపోతుందని ఎద్దవా చేశాడు. వరల్డ్ కప్ 2026లో భారత్కు సెమీస్ చేరే అర్హత లేదన్నాడు. టోర్నీలో భారత్ కంటే వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శన చేసిందని, సెమీఫైనల్ చేరేందుకు కరేబియన్లకే 100 శాతం అర్హత ఉందని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఆఫ్రిది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ… ‘భారత్ చిన్న జట్లను మాత్రమే ఓడించి టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్కు చేరడం టోర్నమెంట్ స్థాయిని దిగజార్చినట్లే. ఈ పోటీ నిష్పక్షపాతంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. బలమైన జట్లను ఎదుర్కొన్నప్పుడు భారత్ అస్థిరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో పూర్తిగా ఆధిపత్యం కోల్పోయింది. అమెరికాపై సూర్యకుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అలాగే పాకిస్తాన్తో మ్యాచ్లో కొన్ని కీలక పరిణామాలు జరిగి ఉంటే భారత్ ఓడిపోయే అవకాశం కూడా ఉండేది. టోర్నీలో భారత్ కంటే వెస్టిండీస్ మెరుగైన ప్రదర్శన చేసింది. సెమీఫైనల్ చేరేందుకు భారత్కు అర్హత లేదు. విండీస్ టీమ్ సెమీస్కు అర్హత గల టీమ్’ అని అన్నాడు.
Also Read: Vijay-Rashmika Love Journey: పరిచయం, ప్రేమ, ప్రచారం, సినీ ప్రయాణం.. విజయ్-రష్మిక లవ్ జర్నీ ఇదే!
బలమైన జట్లపై విజయాలు సాధించకపోతే సెమీఫైనల్ అర్హత విలువ తగ్గిపోతుందని షాహిద్ ఆఫ్రిది అంటున్నాడు. ఆఫ్రిది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు ఆఫ్రిది విశ్లేషణను సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం భారత్ సాధించిన విజయాలను ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నాడని విమర్శిస్తున్నారు. సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓడి సెమీస్ అవకాశాలను భారత్ సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. జింబాబ్వేపై గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకొంది. ఇక వెస్టిండీస్పై గెలిచి సెమీస్ చేరాలని చూస్తోంది. మార్చి 1న వెస్టిండీస్తో భారత్ తలపడనుంది.
