ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో భారతీయ వ్యాపారవేత్తల ప్రభావం గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఉన్న ఆరు జట్లకు భారత యజమానులే ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో కూడా ఆరు ఫ్రాంచైజీలు భారతీయుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిణామాలు గ్లోబల్ క్రికెట్ వ్యాపారంలో ఇండియన్ పెట్టుబడిదారుల ప్రభావాన్ని స్పష్టంగా చూపుతున్నాయి.
ఇంగ్లాండ్లో జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో నాలుగు జట్లు, అమెరికాలోని మేజర్ లీగ్ క్రికెట్లో కూడా నాలుగు జట్లు భారత యజమానులతో సంబంధం కలిగి ఉన్నాయి. కరీబియన్ ప్రీమియర్ లీగ్లో మూడు ఫ్రాంచైజీలకు భారత వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టారు. ఆస్ట్రేలియాలోని బీబీఎల్ ఫ్రాంచైజీల విక్రయంపై భవిష్యత్లో చర్చలు జరగవచ్చని, వచ్చే ఏడాది నాటికి అక్కడ కూడా భారత పెట్టుబడిదారులు ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే న్యూజీలాండ్లో ప్రారంభం కానున్న కొత్త లీగ్లో కూడా భారత పెట్టుబడుల దారుల ప్రభావం ఉండొచ్చని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read: Sikandar Raza: ఏదైనా జరగొచ్చు, 3 మ్యాచ్లలో 2 గెలిస్తే.. సూపర్-8కు ముందు సికందర్ రజా హెచ్చరిక!
ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో పాకిస్థాన్ ఆటగాళ్లు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) వంటి కొన్ని లీగ్ల్లోనే కనిపించే పరిస్థితి వస్తుందా? అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ప్రపంచ ఫ్రాంచైజీ క్రికెట్లో భారత్ వ్యాపారవేత్తల పెట్టుబడులు పెరుగుతుండటం వల్ల గ్లోబల్ క్రికెట్ ఆర్థిక నిర్మాణంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.
