Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఏమనొద్దు.. బీసీసీఐకి జింబాబ్వే కెప్టెన్ రిక్వెస్ట్!

  • జూలై 23 నుంచి భారత్, జింబాబ్వే టీ20 సిరీస్
  • వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ రజా ప్రశంసల వర్షం
  • వైభవ్ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్
Vaibhav Sooryavanshi, Sikandar Raza

Vaibhav Sooryavanshi, Sikandar Raza

Sikandar Raza Praises Vaibhav Sooryavanshi Talent: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అని పేర్కొన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన బుడ్డోడిపై విమర్శలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. వైభవ్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, సరైన మార్గదర్శకత్వం చేస్తే.. ప్రపంచ క్రికెట్‌లో ఒక తరం గుర్తుంచుకునే స్థాయి ఆటగాడిగా ఎదుగుతాడని సికందర్ రజా జోస్యం చెప్పాడు.

విమర్శించడం సరికాదు:

జూలై 23 నుంచి హరారే వేదికగా భారత్, జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో తొలి మూడు మ్యాచ్‌లల్లో వరుసగా 14, 13, 15 పరుగులే చేశాడు. ఇంగ్లండ్‌పై నిరాశపర్చిన బుడ్డోడు.. జింబాబ్వే పర్యటనలో రాణించాలని చూస్తున్నాడు. మొదటి టీ20 ముందు జియోహాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సికందర్ రజా మాట్లాడుతూ.. ‘వైభవ్ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్. 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఓ కుర్రాడిని 2-3 మ్యాచ్‌ల ప్రదర్శనతో విమర్శించడం సరైంది కాదు. అతని చుట్టూ సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. వారు సరైన మార్గనిర్ధేశం చేస్తే.. వైభవ్ ఒక తరం గుర్తుంచుకునే స్థాయి ఆటగాడిగా ఎదుగుతాడు’ అని పేర్కొన్నాడు.

ఈ రోజుల్లో ఇలాంటి టాలెంట్ అరుదు:

వైభవ్ ఇప్పటికే అండర్-19 క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తన ప్రతిభను చాటాడని రజా కొనియాడాడు. ’15 ఏళ్ల వయసులోనే భారత అండర్-19 జట్టుకు ఆడుతో అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఆ వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం చిన్న విషయం కాదు. ఇలాంటి ప్లేయర్, టాలెంట్ ఈ రోజుల్లో చాలా అరుదు. అందుకే వైభవ్ చాలా ప్రత్యేకమైన ఆటగాడు అని అంటున్నా. వైభవ్‌ను భారత జట్టు ఎలా చూసుకుంటుందన్న దానిపై అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అని చెప్పాడు.

జింబాబ్వే గడ్డపై 175 పరుగులు:

వైభవ్‌కు జింబాబ్వే గడ్డపై మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులు బాదిన వైభవ్.. భారత జట్టుకు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే దేశంలో మరోసారి తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ పర్యటనలో సీనియర్ సంజు శాంసన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో.. వైభవ్ మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ ఆడనున్నాడు. అయితే జింబాబ్వే పేసర్లు బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ నగరవాలు షార్ట్‌పిచ్ బంతులతో అతడిని పరీక్షించే అవకాశం ఉంది. విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వాలని వైభవ్ పట్టుదలగా ఉన్నాడు.