R Ashwin’s India Playing XI vs Sri Lanka 1st Test: శ్రీలంకతో శనివారం నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలో పెరిగింది. ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ప్లేయింగ్ ఎలెవన్ను వెల్లడించాడు. అయితే యాష్ జట్టులో ఊహించని మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను అశ్విన్ తుది జట్టులోకి తీసుకోకపోవడం అందరి షాక్కు గురిచేసింది. సాయి సుదర్శన్ గాయం కారణంగా సర్ఫరాజ్ ఖాన్ తిరిగి భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. దీంతో నంబర్-6 స్థానంపై ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ మధ్య పోటీ నెలకొంది. అయితే అశ్విన్ మాత్రం సర్ఫరాజ్ కంటే జురెల్నే ఎంపిక చేశాడు. ఉపఖండ పరిస్థితుల్లో సర్ఫరాజ్కు ఉన్న అనుభవం, స్పిన్ను ఎదుర్కొనే నైపుణ్యం ఉన్నప్పటికీ.. తుది జట్టులో జురెల్కు ప్రాధాన్యం ఇచ్చాడు.
ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ను ఆర్ అశ్విన్ ఎంచుకున్నాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ స్థానాన్ని దేవదత్ పడిక్కల్తో భర్తీ చేశాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. రిషభ్ పంత్ ఐదో స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడనుండగా.. ధ్రువ్ జురెల్ ఆరో స్థానంలో స్పెషలిస్ట్ బ్యాటర్గా బరిలోకి దిగుతాడని అశ్విన్ చెప్పాడు. పంత్, జురెల్ ఇద్దరికీ యాష్ ఒకేసారి తుది జట్టులోకి చోటిచ్చాడు.
సర్ఫరాజ్ ఖాన్ చాలా కాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ.. తొలి టెస్టులో అతడికి చోటు ఇవ్వలేదు ఆర్ అశ్విన్. ధ్రువ్ జురెల్ ఇటీవలి ఫామ్పై ప్రశ్నలు ఉన్నప్పటికీ.. అతడి వికెట్ కీపింగ్ సామర్థ్యం, బ్యాటింగ్లో ఉన్న అవకాశాలను దృష్టిలో పెట్టుకుని జట్టులోకి తీసుకోవచ్చని చెప్పాడు. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్లను స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా.. కుల్దీప్ యాదవ్ను స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఎంపిక చేశాడు. గాలే పిచ్ టెస్ట్ మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని అశ్విన్ భావించాడు.
అశ్విన్ జట్టులో బిగ్ సర్ప్రైజ్ గుర్నూర్ బ్రార్ ఎంపిక. సీనియర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు బదులుగా గుర్నూర్ను తుది జట్టులోకి తీసుకున్నాడు. శ్రీలంకతో జరిగే తొలి టెస్టులో గుర్నూర్ టెస్టు అరంగేట్రం చేయవచ్చని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. మహ్మద్ సిరాజ్తో కలిసి గుర్నూర్ కొత్త బంతిని పంచుకోనున్నాడని చెప్పాడు. వార్మప్ మ్యాచ్లో తన వేగం, బౌన్స్తో శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన గుర్నూర్. తొలి టెస్టులో మరింత ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తాడని యాష్ పేర్కొన్నాడు.
అశ్విన్ ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

