భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి వడోదరలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. 2024లో సొంతగడ్డపై టీమిండియాను వైట్వాష్ చేసిన కివీస్.. ఇప్పుడు మరలా భారత పర్యటనకు వచ్చింది. మరోసారి టీమిండియాపై సత్తాచాటాలని సఫారీ టీమ్ భావిస్తోంది. గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది. రెండు టీమ్స్ బలంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయం. న్యూజిలాండ్తో మొదటి వన్డే నేపథ్యంలో భారత్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో చూద్దాం.
ఫామ్ లేమితో టీ20 జట్టులో చోటు కోల్పోయిన శుభ్మన్ గిల్ వన్డేలలో కెప్టెన్గా ఉన్నాడు. రోహిత్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్ను ఆరంభించనున్నాడు. ఈ సిరీస్లో రాణించడం అత్యంత కీలకం. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో రాణించిన రోహిత్, విరాట్ కోహ్లీలు జోరు కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. పొట్ట గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్కు ఈ సిరీస్ ఎంతో కీలకం. వన్డేలో రాణిస్తే తిలక్ వర్మ స్థానంలో టీ20లు ఆడే అవకాశం వస్తుంది. ఐదవ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. కీపింగ్ బాధ్యతలు కూడా అతడే నిర్వర్తిస్తాడు.
వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయనున్నారు. కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలను మోయనున్నాడు. సుందర్, జడేజాలు స్పిన్ బాధ్యతలను పంచుకోనున్నారు. జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేడు. కాబట్టి మహమ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని నడిపించనున్నాడు. అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణాలు పేస్ బౌలింగ్ పంచుకోనున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఫిట్నెస్, ఫామ్ను చాటుకున్న శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. ప్రస్తుతం అందరి దృష్టి శ్రేయస్పైనే ఉంది. రో-కో మెరుపులు చూసేందుకు కూడా ఫాన్స్ ఆతృతగా ఉన్నారు.
భారత్ జట్టు (అంచనా):
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.
