KL Rahul: రాహుల్‌ను ల్యాబ్‌లో ఎలుకలా వాడుకుంటున్నారు.. అభిమానుల ఆగ్రహ జ్వాలలు..

Kl Rahul

Kl Rahul

చెన్నైలోని చేపాక్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను భారత జట్టు తుది ఎంపిక (ప్లేయింగ్ XI) నుండి మినహాయించడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు ‘జస్టిస్ ఫర్ కేఎల్ రాహుల్’ అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ ప్రయోగాల కోసం రాహుల్‌ను మాత్రమే ఎందుకు బలిపశువును చేస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులో మూడు మార్పులు చేసినట్లు ప్రకటించాడు. కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌ల స్థానాల్లో హర్ష్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణలకు జట్టులో అవకాశం కల్పించారు. అయితే, రాహుల్‌కు విశ్రాంతినిచ్చారా లేదా జట్టు నుండి తొలగించారా అనే విషయాన్ని గిల్ స్పష్టం చేయలేదు. తదుపరి జరగబోయే టీ20 సిరీస్‌లలో రాహుల్ ఆడటం లేదని, అలాంటప్పుడు వన్డే జట్టులో ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టకుండా రాహుల్‌ను ఎందుకు దూరం పెట్టారని అభిమానులు నిలదీస్తున్నారు.

ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్‌ను పదే పదే మార్చడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. మొదటి వన్డేలో ఐదో స్థానంలో ఆడిన రాహుల్‌ను, రెండో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కోసం మరో స్థానానికి మార్చారు. ఇప్పుడు ఏకంగా జట్టు నుంచే తొలగించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ఒక అభిమాని స్పందిస్తూ.. “టీమ్ ఇండియా యాజమాన్యం కేఎల్ రాహుల్‌ను ప్రయోగశాలలోని ఎలుకలా (ల్యాబ్ రాట్) వాడుకుంటోంది. ఏ ప్రయోగం చేయాలన్నా మొదట అతడినే పక్కన పెడుతున్నారు, ఇది చాలా అన్యాయం” అని మండిపడ్డాడు. మరికొందరు రాహుల్‌ను ఒక ఈజీ టార్గెట్‌గా మార్చేశారని వాపోయారు.