భారత టీ20 క్రికెట్ ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకుంది. అనుభవం, యువత, దూకుడు.. ఈ మూడింటి అద్భుత సమ్మేళనంగా భారత జట్టు ఉంది. ఒక్కో ఆటగాడు ఒక్కో మ్యాచ్ను ఒంటిచేత్తో తిప్పేయగల సత్తా ఉన్నవాళ్లే ఈ జాబితాలో ఉండటం విశేషం. టీ20 వరల్డ్కప్ 2026 ముందు ప్రస్తుత జట్టు కాంబినేషన్పై ప్రస్తుతం అభిమానుల్లో భారీ చర్చ నడుస్తోంది. 11 మంది మ్యాచ్ విన్నర్స్, భారత గ్రేటెస్ట్ టీ20 జట్టు సిద్ధం అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
టాప్ ఆర్డర్లో అబిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి దూకుడు ఓపెనర్లు భారత జట్టులో ఉన్నారు. పవర్ప్లేలోనే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేసి.. మ్యాచ్ను భారత్ వైపు తిప్పే సామర్థ్యం వీరిది. ఇద్దరిలో ఒక్కరు చెలరేగినా భారీ స్కోర్ ఖాయం. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాటర్లు ఉండటం జట్టుకు పెద్ద బలం. పరిస్థితిని బట్టి ఆటను మార్చుకునే నైపుణ్యం వీరి సొంతం. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్ లాంటి ఆటగాళ్లు జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నారు. అవసరమైనప్పుడు భారీ షాట్లతో మ్యాచ్ను ముగించడమే కాదు, బంతితోనూ కీలక ఓవర్లలో ప్రభావం చూపగల సత్తా వీరిలో ఉంది. ముఖ్యంగా రింకూ సింగ్ ఫినిషర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉండటం ప్రత్యర్థులకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. డెత్ ఓవర్లలో బుమ్రా ఖచ్చితత్వం, పవర్ప్లేలో అర్ష్దీప్ స్వింగ్, మధ్య ఓవర్లలో వరుణ్ మాయాజాలం మ్యాచ్ ఫలితాన్ని మార్చగల ఆయుధాలుగా మారాయి. మొత్తానికి ఈ 11 మంది ఆటగాళ్లను చూస్తే.. ఒక్కోరు ఒక్కో మ్యాచ్ విన్నర్ అనే చెప్పాలి. బ్యాటింగ్లో లోతు, బౌలింగ్లో వైవిధ్యం, ఫీల్డింగ్లో చురుకుదనం.. అన్ని కలిసిన ఈ జట్టును ‘గ్రేటెస్ట్ టీ20 జట్టు’గా అభిమానులు అభివర్ణిస్తున్నారు. ఈ జట్టు టీ20 వరల్డ్కప్ 2026ను కచ్చితంగా కొడుతుందని టీమిండియా ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా మెగా టోర్నీ ఆరంభం కానుంది. సొంతగడ్డపై టోర్నీ జరుగుతుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.
