Sourav Ganguly: మహిళల జట్టుపై గంగూలీ చేసిన ట్వీట్ మిస్ ఫైర్.. ఆడుకుంటున్న నెటిజన్‌లు

Sourav Ganguly

Sourav Ganguly

Sourav Ganguly Tweet Misfire: బర్మింగ్ హామ్ వేదికగా ఇటీవల ముగిసిన కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుపై 9 పరుగుల తేడాతో ఓటమి చెందడంతో స్వర్ణ పతకం దూరమైంది. అయితే సునాయాసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను మహిళల జట్టు గెలవలేకపోయింది. ఒత్తిడి కారణంగా 12 బంతుల్లో 17 పరుగులు చేయలేక చతికిలపడింది. ఇదే విషయాన్ని బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ఓ ట్వీట్ ద్వారా ప్రస్తావించాడు. కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించిన మహిళల జట్టుకు అభినందనలు తెలుపుతూనే.. గెలవాల్సిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఓడారని, దానికి వారు చింతిస్తారని గంగూలీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ‘సిల్వర్‌ మెడల్ గెలిచినందుకు భారత మహిళా క్రికెట్ ​జట్టుకు అభినందనలు‌. అయితే వాళ్లు మాత్రం స్వదేశానికి అసంతృప్తిగానే వస్తారు. ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యారు. దాదాపు మ్యాచ్ వాళ్ల చేతులోని ఉన్నట్లు అనిపించింది’ అంటూ గంగూలీ ట్వీట్‌ చేశాడు.

Read Also: Heart Attack : ఫ్రెండ్స్‌తో క్రికెట్‌ ఆడుతున్నాడు.. అంతలోనే గ్రౌండ్‌లోనే కుప్పకూలి..

అయితే గంగూలీ చేసిన ట్వీట్ మిస్ ఫైర్ అయ్యింది. దీంతో సోషల్ మీడియాలో గంగూలీని నెటిజన్‌లు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి దాదాపు స్వర్ణం గెలిచినంత పని చేసినందుకు మహిళల జట్టును అభినందించాల్సింది పోయి హేళన చేసేలా మాట్లాడతావా అంటూ గంగూలీపై నెటిజన్‌లు మండిపడుతున్నారు. గంగూలీ చేసిన ట్వీటే తమకు అతిపెద్ద అసంతృప్తి కలిగిస్తోందని పలువురు కామెంట్ చేస్తున్నారు. గంగూలీ లాంటి వ్యక్తి బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉండటం దురదృష్టకరమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మహిళల క్రికెట్ అభివృద్ధి కోసం గంగూలీ ఎలాంటి చర్యలు తీసుకున్నాడని పలువురు ప్రశ్నిస్తున్నారు.