Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!

Asian Games 2026

Asian Games 2026

Asian Games 2026 : ఆసియా ఖండపు అతిపెద్ద క్రీడా సంబరం మొదలైంది. జపాన్‌లోని నగోయా నగరం వేదికగా 2026 ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు అత్యాధునిక సాంకేతిక హంగులతో, రంగులమయంగా ఆరంభమయ్యాయి. మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో జపాన్ చక్రవర్తి నరుహిటో, సామ్రాజ్ఞి మసాకో, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC), ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) ప్రముఖుల సమక్షంలో క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. అయితే, ఇంతటి ప్రతిష్టాత్మక మెగా ఈవెంట్‌లో ఆరంభమే ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసే దృశ్యాలు కనిపించాయి. భారీ హంగామా నడుమ వేడుకలు మొదలైనా.. స్టేడియంలోని స్టాండ్స్ మాత్రం ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి.

అట్టహాసం సరే.. ప్రేక్షకులు ఏరీ

సాధారణంగా ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలంటే కిటకిటలాడే గ్యాలరీలు, అభిమానుల కేరింతలు, ఉర్రూతలూగించే సందడి కనిపిస్తుంది. కానీ నగోయా వేదికపై సాంకేతిక మెరుపులు ఉన్నప్పటికీ, స్టేడియంలో ఎక్కువ శాతం సీట్లు ఖాళీగా దర్శనమివ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఖాళీగా ఉన్న కుర్చీలు, వెలవెలబోయిన స్టాండ్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇంత పెద్ద అంతర్జాతీయ క్రీడా వేదికకు ప్రేక్షకుల నుంచి ఇంతటి నీరసమైన స్పందన రావడమేంటన్న ప్రశ్నలు అంతటా వెల్లువెత్తుతున్నాయి.

త్రివర్ణ పతాకంతో మను భాకర్, పవన్ సెహ్రావత్.. ఆఖరి నిమిషంలో ఊహించని ట్విస్ట్
ఈ వేడుకల్లో 45 దేశాలు, OCA శరణార్థుల బృందంతో కలిపి మొత్తం 46 జట్లు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా ఈ కవాతులో భాగమవ్వగా, 800 మందికి పైగా అథ్లెట్లతో చైనా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక 501 మంది సభ్యులతో కూడిన భారత జట్టు తరఫున పారిస్ ఒలింపిక్ డబుల్ పతక విజేత మను భాకర్, ఏషియన్ గేమ్స్ స్టార్ కబడ్డీ ప్లేయర్ పవన్ సెహ్రావత్ సాంప్రదాయ దుస్తుల్లో భారత జాతీయ పతాకాన్ని సగర్వంగా చేతబూని ముందుండి నడిపించారు. అయితే భారత పతాకధారుల విషయంలో తెరవెనుక ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం స్టార్ అథ్లెట్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ భారత జెండాను మోయాల్సి ఉంది. కానీ అధికారిక కిట్ సమయానికి ఆయనకు అందకపోవడంతో ప్రారంభోత్సవంలో పాల్గొనలేకపోయారు. దీంతో చివరి నిమిషంలో కబడ్డీ కెప్టెన్ పవన్ సెహ్రావత్‌కు ఈ గౌరవం దక్కింది.

హాంగ్‌జౌ రికార్డులపై భారత్ గురి.. అప్పుడే జోరు!
2023లో జరిగిన హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత్ 28 స్వర్ణాలతో సహా మొత్తం 106 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచి చారిత్రక రికార్డు సృష్టించింది. ఈసారి ఆ రికార్డులను బద్దలు కొట్టే దిశగా టీమ్ ఇండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. ప్రారంభోత్సవానికి ముందే జరిగిన పలు పోటీల్లో భారత క్రీడాకారులు తమ సత్తా చాటారు. మహిళల క్రికెట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఆతిథ్య జపాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి దర్జాగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అటు ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘టెక్బాల్’ క్రీడలో సెమీఫైనల్‌లో ఓడినప్పటికీ భారత ప్లేయర్ క్విమ్సీ డిసౌజా కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు దాదాపు 16 రోజుల పాటు సాగే ఈ మహా క్రీడా ఉత్సవంలో 11 వేల మంది అథ్లెట్లు 43 క్రీడల్లోని 469 స్వర్ణ పతకాల కోసం తలపడనున్నారు. వెలవెలబోయిన స్టేడియం విమర్శలకు తావిచ్చినప్పటికీ, భారత అథ్లెట్లు మాత్రం పతకాల వేటలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు.