Asia Cup 2026: పాకిస్థాన్‌తో హ్యాండ్‌షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?

India Pakistan Handshake

India Pakistan Handshake

మహిళల ఆసియా కప్‌ 2026లో దాయాది భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడే మ్యాచ్‌కు ముందే ‘హ్యాండ్‌షేక్‌’ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇండో, పాక్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ అనుసరిస్తున్న నో-హ్యాండ్‌షేక్‌ విధానాన్ని కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు టీమిండియా మహిళల ప్రధాన కోచ్‌ అమోల్ ముజుందార్ స్పందించారు. టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ప్రశ్న ఎదురుకాగా.. మైదానంలో అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే తమ దృష్టి ఉందని స్పష్టం చేశారు. మైదానం వెలుపలి విషయాలకు తాము ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబోమని, పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడే సమయం వచ్చినప్పుడు దానిపై మాట్లాడతామని చెప్పారు. ప్రస్తుతం మాత్రం తమ తొలి మ్యాచ్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టామని ముజుందార్ తెలిపారు.

‘మైదానంలో, మైదానం వెలుపల మేము ఆడాల్సిన అత్యుత్తమ క్రికెట్‌పైనే దృష్టి పెడతాం. ఆఫ్‌-ది-ఫీల్డ్‌ విషయాలపై మేం ఫోకస్‌ చేయడం లేదు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. ప్రస్తుతం రేపటి మ్యాచ్‌పైనే మా దృష్టి ఉంది. ఒక్కో మ్యాచ్‌ ఆడుతూ ముందుకు వెళ్తాం’ అని అమోల్ ముజుందార్ పేర్కొన్నారు. 2025 పురుషుల ఆసియా కప్‌ నుంచి భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్ మ్యాచ్‌ల్లో నో హ్యాండ్‌షేక్‌ కొనసాగుతోంది. ఆ తర్వాత సీనియర్‌ జట్లతో పాటు వయోపరిమితి, మహిళల క్రికెట్‌ టోర్నీల్లోనూ ఇదే విధానం కొనసాగింది.

2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో కొలంబో వేదికగా భారత్‌, పాకిస్థాన్‌ తలపడినప్పుడు కూడా భారత జట్టు ఈ విధానాన్నే అనుసరించింది. అనంతరం 2025లో జరిగిన పురుషుల రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఇదే ప్రోటోకాల్‌ను పాటించారు. 2025 డిసెంబర్‌లో అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ హ్యాండ్‌షేక్‌లు చోటుచేసుకోలేదు. 2026లో అండర్‌-19 ప్రపంచకప్‌, పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడిన సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.

ఇటీవల 2026 జూన్‌లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లోనూ హర్మన్‌ప్రీత్ కౌర్‌ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్థాన్‌ కెప్టెన్‌, ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయకుండా కొనసాగిన విధానం కూడా చర్చకు వచ్చింది. మహిళల ఆసియా కప్‌ 2026లో భారత జట్టు గ్రూప్‌-ఏలో ఉంది. దుబాయ్‌లో థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా తన టోర్నీ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అనంతరం సెప్టెంబర్‌ 3న హాంకాంగ్‌తో, సెప్టెంబర్‌ 5న పాకిస్థాన్‌తో భారత్‌ తలపడుతుంది. మహిళల ఆసియా కప్‌ చరిత్రలో భారత్‌ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటివరకు ఏడు సార్లు టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు.. ఈసారి ఎనిమిదో ట్రోఫీపై కన్నేసింది.