Arshdeep Singh-Tilak Varma: అర్ష్‌దీప్ సింగ్‌పై తిలక్ వర్మ ఫైర్.. డ్రెస్సింగ్ రూమ్‌లో టెన్షన్ (వీడియో)!

  • సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో అర్ష్‌దీప్-తిలక్ పేర్లు
  • టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో చిన్న ఘటన
  • అర్ష్‌దీప్ సింగ్‌పై తిలక్ వర్మ ఫైర్
Arshdeep Singh Tilak Varma

Arshdeep Singh Tilak Varma

భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ, ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో చోటుచేసుకున్న ఓ చిన్న ఘటననే ఇందుకు కారణం. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో వార్మ్‌అప్ మ్యాచ్‌ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో తిలక్ భోజనం చేస్తుండగా.. అర్షదీప్ సింగ్ అనుమతి లేకుండా వీడియో తీశాడు. ఇది భోజనం చేస్తున్న తిలక్‌కు నచ్చలేదు. దీంతో తిలక్ అసహనం వ్యక్తం చేస్తూ.. అర్షదీప్‌ను వీడియో ఆపేయాలని గట్టిగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అర్షదీప్ సింగ్ ముందుగా ఇషాన్ కిషన్‌ను వీడియో తీశాడు. ఆ సమయంలో కిషన్ చాలా సరదాగా స్పందించాడు. ఆపై తిలక్ వర్మను వీడియో తీస్తుండగా.. అతడు కాస్త ఫైర్ అయినట్లు కనిపించాడు. నా అనుమతి లేకుండా వీడియో తీయడం ఏంటి? అని ప్రశ్నించాడు. అయినా కూడా అర్షదీప్ నవ్వుకుంటూ వీడియో కంటిన్యూ చేశాడు. అయితే ఇదంతా ప్రాంక్‌ అని తెలుస్తోంది. ఎందుకంటే తిలక్, అర్షదీప్ మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇటీవల అర్షదీప్ యూట్యూబ్ వ్లాగ్‌లో కూడా తిలక్ కనిపించాడు. ఈ వీడియోలో ఇషాన్ కూడా ఉండటంతో.. ఇది స్నేహితుల మధ్య జరిగిన సరదా సంఘటన అని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: Vivo V70 Launch: 6500mAh బ్యాటరీ, 50MP+50MP కెమెరా.. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ‘వివో వీ70’ హై వోల్టేజ్ ఎంట్రీ!

దక్షిణాఫ్రికాపై తిలక్ వర్మ తన క్లాస్‌ను చూపించాడు. వార్మ్‌అప్ మ్యాచ్‌లో తిలక్ 19 బంతుల్లో 45 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో అతడి ఇన్నింగ్స్ భారత్‌కు మంచి ఊపునిచ్చింది. ముఖ్యంగా శస్త్రచికిత్స (టెస్టిక్యులర్ టార్షన్) నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రాగా.. ఈ ఇన్నింగ్స్‌కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు తిలక్ దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు తిలక్ కీలక ఆటగాడిగా మారనున్నాడు. గత ఎడిషన్‌లో బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు ఆ టైటిల్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది.