భారత ఆల్ రౌండర్ అనుకుల్ రాయ్ శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా-A జట్టులోకి ఎంపికయ్యారు. సీనియర్ భారత టెస్ట్, వన్డే జట్లకు తొలిసారి ఎంపికైన హర్ష్ దూబే స్థానంలో రాయ్ను సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు BCCI ఒక ప్రకటనలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. అనుకుల్ రాయ్ ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ , లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరఫున ఆడే ఆయన, ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018లో భారత్ గెలిచిన అండర్-19 ప్రపంచకప్లో 14 వికెట్లతో సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రాయ్ తొలిసారి వెలుగులోకి వచ్చారు.
ఈ ముక్కోణపు సిరీస్ జూన్ 9 నుంచి జూన్ 21 వరకు శ్రీలంకలోని దంబుల్లాలో జరగనుంది. ఇందులో భారత్-A తో పాటు శ్రీలంక-A, ఆఫ్ఘనిస్తాన్-A జట్లు తలపడనున్నాయి. యువ సంచలనం తిలక్ వర్మ ఈ 15 మంది సభ్యుల జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనుండగా.. రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎల్లో రాణించిన ప్రియాంశ్ ఆర్య, ఆయుష్ బదోని, ప్రభ్సిమ్రన్ సింగ్, యష్ ఠాకూర్ వంటి ప్రతిభావంతులతో పాటు టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
జట్టు వివరాలిలా..
తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, ప్రభ్సిమ్రన్ సింగ్ (కీపర్), కుమార్ కుశాగ్ర (కీపర్), విప్రాజ్ నిగమ్, యష్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్.
