Ajinkya Rahane Unbeaten Test Captain Record: టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా గురువారం జింక్స్ ప్రకటించాడు. తన సుదీర్ఘ కెరీర్లో భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రహానే.. మూడు ఫార్మాట్లలో కలిపి 8,000కు పైగా పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్రవేసిన అతడు 5,077 పరుగులు చేయగా.. 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నిశ్శబ్ద స్వభావం, క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతాయుతమైన బ్యాటింగ్, ఒత్తిడిని తట్టుకునే నాయకత్వంతో జింక్స్ భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అంతేకాదు రహానే ఖాతాలో ఓ అన్బీటెన్ రికార్డు కూడా ఉంది.
అత్యుత్తమ విజయాల్లో ఒకటి:
2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అజింక్య రహానే కెరీర్లో అత్యంత గొప్ప అధ్యాయంగా నిలిచింది. అడిలైడ్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌట్ కావడంతో పాటు ఘోర పరాజయం చవిచూసింది. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి రావడంతో జట్టు బాధ్యతలు రహానే భుజాన పడ్డాయి. మెల్బోర్న్ టెస్టులో అద్భుతమైన సెంచరీతో భారత్కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన రహానే.. సిడ్నీ టెస్టును డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. గబ్బా వేదికగా 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
టెస్టు కెప్టెన్గా అజేయుడు:
పూర్తిస్థాయి కెప్టెన్గా ఎక్కువ అవకాశాలు రాకపోయినా.. వచ్చిన ప్రతి అవకాశాన్ని రహానే రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. మొత్తం ఆరు టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించిన జింక్స్.. ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. నాలుగు విజయాలు, రెండు డ్రాలతో తన టెస్టు కెప్టెన్సీ ప్రయాణాన్ని అజేయంగా ముగించాడు. కనీసం ఐదు టెస్టులకు నాయకత్వం వహించిన భారత కెప్టెన్లలో అత్యధిక విజయశాతాన్ని నమోదు చేసిన సారథిగా రహానే ప్రత్యేక స్థానం సంపాదించాడు. సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి విజయవంతమైన కెప్టెన్లకు కూడా ఈ అజేయ రికార్డు సాధ్యం కాలేదు.
వన్డేలు, టీ20ల్లోనూ సక్సెస్:
2017లో జింబాబ్వే పర్యటనలో మూడు వన్డేలకు కెప్టెన్గా వ్యవహరించిన రహానే.. మూడింట్లోనూ భారత జట్టును విజయపథంలో నడిపించాడు. అదే పర్యటనలో రెండు టీ20 మ్యాచ్లకు సారథ్యం వహించగా.. ఒక మ్యాచ్లో విజయం, మరో మ్యాచ్లో ఓటమి ఎదురైంది. 2017లో ధర్మశాల టెస్టులో ఆస్ట్రేలియాపై, 2018లో అఫ్గానిస్థాన్తో జరిగిన చారిత్రాత్మక టెస్టులో కూడా విజయాలు అందించి తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నాడు.
జెంటిల్మన్ గేమ్కు అసలైన ప్రతిరూపం:
మొత్తంగా 11 అంతర్జాతీయ మ్యాచ్ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించిన రహానే కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓటమిని చవిచూశాడు. టెస్టులు, వన్డేల్లో ఒక్క పరాజయం కూడా లేకుండా తన కెప్టెన్సీని ముగించడం అతని గొప్పతనాన్ని చాటుతోంది. మైదానంలో ప్రత్యర్థులతో వివాదాలకు దూరంగా ఉంటూ.. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా రహానే పేరు సంపాదించాడు. ఆటగాడిగా మాత్రమే కాకుండా, వ్యక్తిత్వంతోనూ అభిమానుల గౌరవాన్ని పొందిన రహానే భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ తాత్కాలిక కెప్టెన్లలో ఒకరిగా ఎప్పటికీ గుర్తుండిపోతాడు.

