Kailasa Temple Ellora: భారతీయ వాస్తుశిల్ప కళా వైభవానికి నిలువుటద్దం, మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో వెలసిన ‘కైలాసనాథ ఆలయం’. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా (రాతితో చెక్కబడిన) నిర్మాణంగా గుర్తింపు పొందిన ఈ ఆలయ విశేషాలు, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన చారిత్రక గాథలను ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. సంభాజీ నగర్ జిల్లాలోని ఎల్లోరా గుహల్లో (గుహ సంఖ్య 16) ఉన్న ఈ కైలాస ఆలయం, ఒకే కొండను పై నుంచి కిందికి చెక్కుకుంటూ వచ్చి నిర్మించిన బృహత్ శిల. ఇక్కడ గర్భగుడిపై ఉన్న శిఖరం భూమి కంటే 32.6 మీటర్ల (107 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో పల్లవ, చాళుక్య వాస్తు శైలుల స్పష్టమైన జాడలు కనిపిస్తాయి. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే.. భారతీయ వాస్తుశిల్ప చరిత్రలో ‘రాతితో చెక్కిన దశకు పరాకాష్ట’గా దీనిని పురావస్తు శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు.
READ ALSO: TGPSC: శుభవార్త చెప్పిన టీజీపీఎస్సీ(TGPSC).. ఏప్రిల్ 10 చివరి తేదీ..
రాష్ట్రకూట రాజుల నిర్మాణ కౌశలం..
కైలాస దేవాలయంలో నేరుగా ఎలాంటి శాసనాలు లేకపోయినా, చారిత్రక ఆధారాల ప్రకారం దీనిని ఎనిమిదవ శతాబ్దపు రాష్ట్రకూట రాజు కృష్ణ-I (క్రీ.శ. 756–773) నిర్మించినట్లు చరిత్రకారులు నమ్ముతున్నారు. క్రీ.శ. 812 నాటి వడోదర రాగి ఫలక శాసనం ప్రకారం, ఏలాపుర (ఎల్లోరా)లో శివాలయాన్ని నిర్మించిన కృష్ణరాజు భక్తిని, ఆ ఆలయ వైభవాన్ని దేవతలు సైతం చూసి ఆశ్చర్యపోయారని పేర్కొన్నారు. కడబా మంజూరు శాసనం కూడా ఆలయ నిర్మాణ ఘనతను కృష్ణరాజుకే ఆపాదించింది.
వారంలోనే శిఖర నిర్మాణం.. ఆసక్తికరమైన మరాఠీ గాథ
ఈ ఆలయ నిర్మాణం వెనుక ‘కథా-కల్పతరు’ గ్రంథంలో ఒక అద్భుతమైన జానపద గాథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు ఏలాపుర రాజు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు, అతని భార్య ఘృష్ణేశ్వరుడిని ప్రార్థించింది. రాజుకు నయం అయితే ఆలయాన్ని నిర్మిస్తానని, ఆ ఆలయ శిఖరాన్ని చూసే వరకు ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. తర్వాత రాజు కోలుకున్నాడు. తర్వాత రాణి మొక్కు గురించి తెలుసుకొని, దేశంలోనే ప్రముఖ వాస్తుశిల్పిగా పేరుగాంచిన ‘కోకస’ అనే వాస్తు శిల్పికి కబురు చేశాడు. విషయం తెలుసుకున్న ఆయన నెలల తరబడి ఉపవాసం ఉండటం రాణికి కష్టమని భావించి.. ఒక వినూత్న ఆలోచన చేశాడు. సాధారణంగా ఆలయాలను కింద నుంచి పైకి నిర్మిస్తారు, కానీ కోకస మాత్రం కొండ పైభాగం నుంచి కిందికి చెక్కడం ప్రారంభించి, కేవలం వారం రోజుల్లోనే శిఖరాన్ని పూర్తి చేసి రాణి ఉపవాసాన్ని విరమింపజేశాడట. అందుకే ఈ ఆలయం పై నుంచి కిందికి చెక్కబడిన ఏకైక అద్భుతంగా నిలిచిపోయింది.
పర్యాటక ఆకర్షణగా ఎల్లోరా
రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 34 హిందూ, బౌద్ధ, జైన గుహాలయాలలో కైలాస ఆలయం అత్యంత ప్రధానమైనది. నాటి శిల్పుల అసమాన ప్రతిభకు సాక్ష్యంగా నిలిచిన ఈ ఆలయం నేటికీ ప్రపంచ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఎల్లోరా గుహలు ఛత్రపతి శంభాజీ నగర్ (పూర్వపు ఔరంగాబాద్) నగరం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీనికి అత్యంత సమీప విమానాశ్రయం ఛత్రపతి శంభాజీ నగర్ విమానాశ్రయం (IXU). ఇక్కడి నుంచి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు ఉన్నాయి. విమానాశ్రయం నుంచి టాక్సీ లేదా బస్సు ద్వారా ఒక గంటలో ఎల్లోరా చేరుకోవచ్చు.
దీనికి సమీప రైల్వే స్టేషన్ ఛత్రపతి శంభాజీ నగర్. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండి, దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. స్టేషన్ బయట నుంచి నేరుగా ఎల్లోరాకు ఆటోలు, ప్రైవేట్ టాక్సీలు, ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. బై రోడ్ రావాలని ప్లాన్ చేసుకునే వారికి మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) బస్సులు ప్రతిరోజూ ఛత్రపతి శంభాజీ నగర్ సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి ఎల్లోరాకు నడుస్తాయి. సొంత వాహనాల్లో వచ్చేవారికి రోడ్లు చాలా బాగుంటాయి.
పర్యాటకులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు
ఎల్లోరా ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం కాబట్టి, ఇక్కడ పర్యాటకుల కోసం ప్రభుత్వం, పురావస్తు శాఖ (ASI) మంచి సౌకర్యాలను కల్పించాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఎంట్రీ టికెట్లు కోసం ప్రవేశ ద్వారం వద్ద టికెట్ కౌంటర్లు ఉంటాయి. ఆన్లైన్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. నగదు రహిత చెల్లింపుల కోసం క్యూఆర్ కోడ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఆలయ చరిత్రను, శిల్పకళా వైభవాన్ని వివరించడానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన గైడ్లు కూడా అందుబాటులో ఉంటారు. వీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ భాషల్లో ఆలయ చరిత్రను వివరించగలరు. ఎల్లోరా గుహలు 2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటంతో, నడవలేని వృద్ధులు, పిల్లల కోసం తక్కువ ధరకే బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. భోజనం కోసం గుహల ప్రవేశ ద్వారం వద్దే MTDC (మహారాష్ట్ర టూరిజం) నడిపే రెస్టారెంట్, క్యాంటీన్లు ఉంటాయి. వసతి కోసం ఎల్లోరా సమీపంలో హోటళ్లు ఉన్నాయి, కానీ మెరుగైన సౌకర్యాల కోసం శంభాజీ నగర్ (ఔరంగాబాద్)లో ఉండటం ఉత్తమం. విదేశీ పర్యాటకుల కోసం మనీ ఎక్స్ఛేంజ్ మరియు ఇన్ఫర్మేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.
ఎల్లోరా గుహలు ప్రతిరోజూ ఉదయం 6:00 నుంచి సాయంత్రం 6:00 వరకు తెరిచి ఉంటాయి. సాధారణంగా మంగళవారం ఎల్లోరా గుహలకు సెలవు ఉంటుంది. కాబట్టి మీ పర్యటనను ప్లాన్ చేసుకొనేటప్పుడు దీనిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకోండి. జూన్ నుంచి మార్చి వరకు (ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం) ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఇది కరెక్ట్ టైంగా చెబుతారు.
READ ALSO: Peddi: రామ్ చరణ్ గాయంపై ‘పెద్ది’ టీమ్ అఫీషియల్ క్లారిటీ! షూటింగ్కు నో బ్రేక్..
