Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!

  • 14 ఏళ్ల IT కెరీర్‌కు గుడ్‌బై..
  • మష్రూమ్ బిజినెస్‌తో నెలకు రూ.10 లక్షల లాభం
Success Story

Success Story

Success Story: ఏజీ రూమ్‌లో ఉద్యోగం.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి స్థాయి.. ఆకర్షణీయమైన జీతం.. ఈ రోజుల్లో సాధారణంగా చాలా మంది యువత కలలు కనే జీవితం ఇదే. అయితే ఒకరు మాత్రం వీటన్నింటిని వదిలి.. కార్పొరేట్‌ జీవితంలో స్థిరపడిన కెరీర్‌ కాదనుకొని తనకు నచ్చిన వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. 14 ఏళ్ల పాటు ఐటీ రంగంలో పనిచేసిన ఒడిశాకు చెందిన విక్రమ్‌దేవ్‌ మహాపాత్ర అనే వ్యక్తి తన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి మష్రూమ్‌ సాగును వ్యాపారంగా ఎంచుకున్నారు. అయితే ఆయనకు ఇప్పుడు అదే బిజినెస్‌ నెలకు లక్షల్లో ఆదాయాన్ని అందిస్తోంది. అది ఎలాగో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

విక్రమ్‌దేవ్‌ 2012లో ఒడిశాలోని బిజూ పట్నాయక్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత డిస్కవర్‌చర్‌ సొల్యూషన్స్‌, మైండ్‌ట్రీ, సెరోల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ వంటి సంస్థల్లో పనిచేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, మాడ్యూల్‌ లీడ్‌, టెక్నికల్‌ లీడ్‌, సీనియర్‌ స్పెషలిస్ట్‌ వంటి పలు హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఐటీ రంగంలో 14 ఏళ్ల అనుభవం తర్వాత కార్పొరేట్‌ ఉద్యోగానికి స్వస్తి చెప్పి స్వస్థలమైన నబరంగ్‌పూర్‌కు తిరిగి వచ్చారు. నిజానికి అంతటి హోదా.. కార్పొరేట్ లైఫ్‌ను కాదని బయటికి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. తర్వాత ఏం చేయాలి అనేది ముందే తెలిసి ఉండాలి. ఇవి ఉన్నాయి కాబట్టే విక్రమ్‌దేవ్‌ తన మనసుకు నచ్చిన బాటను నమ్ముకొని ఇంటి బాట పట్టారని చెబుతున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ‘గంగా భూమి మష్రూమ్స్‌’ సంస్థను ప్రారంభించినట్లు వెల్లడించారు. మష్రూమ్‌ సాగును పద్ధతిగా చేపట్టి తన వ్యాపారాన్ని క్రమంగా విస్తరించినట్లు వివరించారు.

ప్రస్తుతం ఈ సంస్థ రోజుకు సుమారు 500 నుంచి 600 కిలోల మష్రూమ్స్‌‌ను ఉత్పత్తి చేస్తోంది. అంటే నెలకు దాదాపు 15 నుంచి 18 టన్నుల వరకు ఈ సంస్థ ఆధ్వర్యంలో ఉత్పత్తి జరుగుతోంది. వీటిని బ్రహ్మపూర్‌, భువనేశ్వర్‌ మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. ఏడాది పొడవునా ఉత్పత్తి, అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యాపారం ద్వారా నెలకు సుమారు రూ.16 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు రెవెన్యూ వస్తున్నట్లు విక్రమ్‌దేవ్ వెల్లడించారు. కిలో మష్రూమ్స్‌ రూ.100 నుంచి రూ.110 వరకు విక్రయిస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయం సుమారు రూ.2.56 కోట్లు కాగా, ప్రభుత్వం నుంచి రూ.97 లక్షల వరకు సబ్సిడీ లభించినట్లు చెప్పుకొచ్చారు. అన్ని ఖర్చులు పోను నెలకు దాదాపు రూ.10 లక్షల లాభం మిగులుతోందని సంతోషం వ్యక్తం చేశారు. మరో విశేషం ఏమిటంటే.. ఈ వ్యాపారం ద్వారా స్థానికంగా 24 మందికి ఉపాధి లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో 18 మంది మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. దీంతో సాధారణ ఉద్యోగి నుంచి వ్యవసాయ వ్యాపారవేత్తగా మారిన విక్రమ్‌దేవ్‌ ప్రయాణం.. ఆయనే పలుగురికి ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థాయికి ఎదగడం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.