EMI.. ఈ రోజు భారతీయుల జీవితంలో ఇది ఓ సాధారణ పదంగా మారిపోయింది. ఇల్లు కొనాలన్నా, కారు తీసుకోవాలన్నా, మొబైల్, టీవీ, ఫ్రిజ్ వంటి గృహోపకరణాలు కొనుగోలు చేయాలన్నా చాలామంది ముందుగా గుర్తు చేసుకునేది EMIనే. అయితే ఈ EMI కల్చర్ను ఇండియాకు విస్తృతంగా పరిచయం చేసి, రిటైల్ బ్యాంకింగ్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన వ్యక్తి ఎవరో తెలుసా. నిజానికి చాలా మందికి తెలిసే అవకాశం తక్కువ. ఆయనే కేవీ కామత్ (KV Kamath). ఇంతకీ ఆయన ఎవరూ, ఆయన ఏం చేసే వారో, అసలు ఎలా ఆయన ఈ EMI వ్యవస్థను ఇండియాకు పరిచయం చేశారో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
ఐసీఐసీఐ బ్యాంక్ను దేశంలో అత్యంత శక్తివంతమైన రిటైల్ బ్యాంకింగ్ సంస్థగా తీర్చిదిద్దిన వ్యక్తి కేవీ కామత్. నిజానికి ఆయన ఇండియన్ బ్యాంకింగ్ విధానాన్నే మార్చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో, సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు సులభంగా రుణాలు అందించే విధానాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. దీంతో మన దేశంలో ఇళ్లు, కార్లు, గృహోపకరణాల కొనుగోళ్లు భారీగా పెరిగి, EMI సంస్కృతి వేగంగా విస్తరించింది. రిటైల్ ఫైనాన్స్ రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే ఐసీఐసీఐ బ్యాంక్ను మార్కెట్ లీడర్గా నిలబెట్టిన కామత్, బ్యాంకింగ్లో సాంకేతికతను కూడా సమర్థంగా వినియోగించారు. భారతదేశంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, టెలీ బ్యాంకింగ్, ఏటీఎం సేవల విస్తరణలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. అలాగే అన్ని శాఖల్లో 100 శాతం కోర్ బ్యాంకింగ్ వ్యవస్థను అమలు చేయడంతో పాటు, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్యాంకింగ్ సేవలు అందించే విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. దాదాపు 29 ఏళ్ల పాటు ఐసీఐసీఐలో సేవలందించిన కేవీ కామత్, అందులో 12 సంవత్సరాలు అత్యున్నత బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2008లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. అలాగే ఫోర్బ్స్ ఆసియా నుంచి బిజినెస్మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నారు. భారతీయుల కొనుగోలు అలవాట్లను మార్చి, EMI సంస్కృతిని ఇంటింటికీ తీసుకెళ్లిన వ్యక్తిగా కేవీ కామత్ పేరు భారత బ్యాంకింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
నిజానికి వస్తువులకు లేదా అప్పులకు స్థిరమైన, క్రమబద్ధమైన వాయిదాలలో చెల్లించే పద్ధతిని ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి సృష్టించింది కాదు. ఇది జనాల అవసరాల కారణంగా వారికే తెలియకుండా ఒక పద్ధతి ప్రకారం ప్రాచుర్యంలోకి వచ్చింది. కౌపర్థ్వైట్ అండ్ సన్స్ 1807లో న్యూయార్క్లో ఫర్నిచర్ మొట్ట మొదటి సారి వాయిదాల పద్ధతిని ప్రవేశపెట్టారు. సింగర్ కుట్టు యంత్రాల కంపెనీ ఎడ్వర్డ్ క్లార్క్ వంటి కంపెనీ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 1850లో ప్రపంచవ్యాప్త వినియోగదారుల క్రెడిట్, క్రమబద్ధమైన చెల్లింపు ప్రణాళికలను ప్రాచుర్యంలోకి తెచ్చింది. జనరల్ మోటార్స్ యాక్సెప్టెన్స్ కార్పొరేషన్ (GMAC) 1919లో నెలవారీ క్రమబద్ధమైన ఆటో రుణ ఫైనాన్సింగ్ను స్థాపించింది. ఇలా క్రమక్రమంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ EMI కల్చర్ అనేది ప్రచారంలోకి వచ్చి, నేడు సాధారణ జనాల జీవితాలతో విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకొంది.

