OTR: వరంగల్ ఎయిర్ పోర్ట్ పై కాంగ్రెస్, బీజేపీ క్రెడిట్ వార్..

  • తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య జోరుగా క్రెడిట్‌ వార్‌
  • సింగరేణికి తాడిచర్ల కోల్‌బ్లాక్‌ కేటాయింపుపై మాటల తూటాలు
  • తాజాగా వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ విషయంలోనూ సేమ్‌ టు సేమ్‌
  • కేంద్ర మంత్రిని కలిసి పనులు మొదలుపెట్టమని కోరిన సీఎం
  • 2028 జూన్ 2కల్లా నిర్మాణం పూర్తి చేయమని విజ్ఞప్తి
  • సీఎం, ప్రధానికి కృతజ్ఞతలు చెబితే బాగుండేదన్న బీజేపీ
Warangal Airport

Warangal Airport

ఎయిర్‌పోర్ట్‌ చుట్టూ ఏం జరుగుతోంది? వరంగల్‌లో విమానాశ్రయం నిర్మాణం దిశగా అడుగు ముందుకు పడటానికి కారకులు ఎవరు? కాంగ్రెస్‌, బీజేపీ మధ్య జరుగుతున్న క్రెడిట్‌ వార్‌ ఏంటి? మధ్యలో ఎంటరైన బీఆర్‌ఎస్‌ వాదన ఎలా ఉంది? తెలంగాణలో క్రెడిట్‌ వార్‌ కొత్త పుంతలు తొక్కుతోంది. మరీ ముఖ్యంగా… రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, రావాలనుకుంటున్న బీజేపీ మధ్య ఇటీవలి కాలంలో కీలకమైన ప్రతి విషయంలోనూ ఇలాంటి వాదోపవాదనలు పెరిగిపోతున్నాయి. కేంద్రం సహకారం గురించి బీజేపీ మాట్లాడుతుంటే.. అంత లేదమ్మా.. రావాల్సినవే ఇస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేతలు రాగాలు తీస్తున్నారు.

ఇటీవల తాడిచర్ల కోల్‌బ్లాక్‌ను సింగరేణికి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఆక్షన్‌ లేకుండా కేటాయించడానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గట్టిగా కృషి చేశారంటూ బాగానే ప్రచారం చేసుకున్నారు బీజేపీ నాయకులు. అయితే… అందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌ నుంచి కౌంటర్స్‌ పడ్డాయి. గతంలోని యూపీఏ హయాంలోనే బ్లాక్‌ను కేటాయించారని చెప్పారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. దీంతో ఆ విషయంపై రెండు పార్టీల మధ్య క్రెడిట్ పంచాయతీ నడిచింది. అదలా ఉండగానే… ఇప్పుడు వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ వంతొచ్చింది.

మామునూరు ఎయిర్‌పోర్ట్‌ విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తయింది కాబట్టి వెంటనే పనులు మొదలుపెట్టమని కోరారు. 2028 జూన్ 2కల్లా వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ని పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం. అందుకు స్పందించిన పౌర విమానయాన శాఖ మంత్రి రెండేళ్ళలో వరంగల్‌లో విమానాలు దిగుతాయని హామీ ఇచ్చారు. ఇక ఆ తర్వాతి నుంచి దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. ఘనత తమదేనంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి కృతజ్ఞతలు చెబితే బాగుండేదని, అలా చేయకుండా… మొత్తం క్రెడిట్ తానే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు.

యూపీఏ హయాంలోనే ఈ ఎయిర్‌పోర్ట్‌ వ్యవహారం పడకేసిందని, శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో ఇంకో ఎయిర్ పోర్ట్ ఉండకూడదన్న ఒప్పందం వల్లనే సమస్య వచ్చిందని ఆరోపిస్తున్నారు కమలం లీడర్స్‌. దేశంలో ఎన్నో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు వచ్చినా… వరంగల్‌కి మాత్రం రాకపోవడానికి కారణం నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేనన్నది బీజేపీ వాదన. ముఖ్యమంత్రి ఆ విషయాల గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. ప్రధాని మోడీ చొరవ వల్లే ఇప్పుడు వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయంటున్నారు.

ఆ రకంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో పవరున్న బీజేపీ… మామునూరు రన్‌వే మీద క్రెడిట్‌ వార్‌లో కత్తులు దూస్తున్నాయి. వరంగల్ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపిస్తుందన్న లెక్కలతో ఎవరికి వారు తమ వాదనలకు పదును పెడుతున్నారు. మరోవైపు ఈ రేస్‌లో మేమేం తక్కువ తినలేదంటున్నారు బీఆర్‌ఎస్‌ నాయకులు. తాము అధికారంలో ఉన్నప్పుడే భూ సేకరణ పూర్తయిందని, ఇంత త్వరగా పనులు మొదలవబోతుండటానికి అదే కారణమని అంటున్నారు. మొత్తం మీద ఆ రకంగా విమానాశ్రయం చుట్టూ పొలిటికల్‌ మాటల తూటాలు పేలుతున్నాయి.