Off The Record: విశాఖలో గూగుల్కు భూ కేటాయింపు కొత్త మలుపు తిరగబోతోందా? అస్సలు ఊహించని అభ్యంతరాలు తెర మీదికి వస్తున్నాయా? మేటర్ మతం రంగు పులుముకుంటోందా? ఊ… అంటే ఏమవుతుందో, ఉహూ… అంటే ఏమవుతుందో అర్ధంగాక బీజేపీ తల బాదుకుంటోందా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్కు ఎదురవుతున్న కొత్త అడ్డంకులేంటి? దాంతో కాషాయ దళానికున్న సంబంధం ఏంటి?
Read Also: PM Modi: SIR చొరబాటుదారుల్ని ఏరేస్తుంటే, దేశద్రోహులు వారిని రక్షిస్తున్నారు..
డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీ ప్రగతి ప్రయాణం బుల్లెట్ రైల్కంటే వేగంగా దూసుకుపోతున్నట్టు ఘనంగా ప్రచారం చేసుకుంటోంది ప్రభుత్వం. అందులోనూ… విశాఖకు గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్ని తీసుకువస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. విపక్షం విమర్శలు, విశ్లేషకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా… గూగుల్ డేటా సెంటర్ని మాత్రం బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. అయితే ఆ సంస్థకు కేటాయించిన భూముల విషయంలో ఇప్పుడో కొత్త ట్విస్ట్ ఆసక్తి రేపుతోంది. ఇందులోకి మతం, మనోభావాల సమస్యలు ఎంట్రీ ఇవ్వడం ఇంకా ఉత్కంఠ కలిగిస్తోంది. రాను రాను ఇది ఏ టర్న్ తీసుకుంటుందో, కూటమిలోని మిగతా రెండు పక్షాల సంగతి ఎలా ఉన్నా… బీజేపీ ఈ ఇరకాటం నుంచి ఎలా బయటపడుతుందోనన్న డిస్కషన్ మొదలైంది విశాఖ రాజకీయవర్గాల్లో. గూగుల్ డేటా సెంటర్కు విశాఖలో నాలుగు చోట్ల మొత్తం 400 ఎకరాల భూమి కేటాయించింది ప్రభుత్వం.
అయితే అందులో ఒక చోట ఇచ్చిన 150 ఎకరాలు సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానానికి సంబంధించినవి కావడమే వివాదానికి అసలు కారణం. మీరు పెట్టుబడులు తీసుకొస్తే తీసుకురండి, కంపెనీలు పెట్టించండి. అభివృద్ధికి మేం ఏ మాత్రం వ్యతిరేకం కాదు. అదే సమయంలో అప్పన్న భూముల్ని అప్పనంగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదంటూ తాజాగా వీహెచ్పీ ప్రభుత్వానికి లేఖ రాయడం కలకలం రేపుతోంది. అదీకూడా డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ను ఉద్దేశిస్తూ రాయడం ఇంకా ఇంట్రస్టింగ్గా మారిపోయింది. ఆ 150 ఎకరాల్లో పండించే పంటలు, వచ్చే ఆదాయాన్ని స్వామివారి కైంకర్యాలకు మాత్రమే వాడాలని, అంతేతప్ప ధర్మ వ్యతిరేకంగా గూగుల్కు ఇస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నది వీహెచ్పీ వాయిస్. ఇది న్యాయస్ధానాల తీర్పులకు విరుద్ధం కనుక ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది విశ్వహిందూ పరిషత్. ఇక్కడే బీజేపీ కూడా ఇరుకున పడుతోందట. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి భూ కేటాయింపు నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, ఇటు హిందూ ధర్మం ప్రకారం వీహెచ్పీని కాదనలేక కాషాయ పార్టీ నేతలు సతమతం అవుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు, పెట్టుబడులు వస్తున్నా… ఆ విషయాన్ని ప్రచారం చేసుకోవడంతో బాగా వెనకబడ్డారని ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో… ఏపీ కమలం లీడర్స్కు వీహెచ్పీ లేఖ మూలిగే నక్క మీద తాడిపండు పడ్డట్టయిందని అంటున్నారు. ముడసర్లోవ దగ్గర బీఆర్టీఎస్కు ఆనుకుని సర్వేనెంబర్ 275లో సుమారు 150ఎకరాల దేవస్ధానం భూములు వున్నాయి.
Read Also: PM Modi: SIR చొరబాటుదారుల్ని ఏరేస్తుంటే, దేశద్రోహులు వారిని రక్షిస్తున్నారు..
ప్రస్తుతం వీటి విలువ వందల కోట్లలో ఉంటుంది. ఇక్కడ ఖరీదు ఒక లెక్కకాగా… అంతకు మించి సెంటిమెంట్ తెర మీదికి వస్తోంది. అప్పన్న స్వామి ఆస్తులను ధారాదత్తం చేయడం అంటే ఖచ్చితంగా నష్టం చేయడం తప్ప మరొకటి కాదనేది వీహెచ్పీ వాయిస్. దేవస్ధానానికి చెందిన గజం భూమిని కూడా పరాయిపాలు చేయకూడదన్న నిబంధనలున్నాయని, ఆ సంగతి తెలిసి కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటే సహించేది లేదని అంటున్నారు విశ్వహిందూపరిషత్ నాయకులు. అదే సమయంలో ‘హైందవ’ శాంఖారావం తీర్మానం గుర్తులేదా అంటూ డైరెక్ట్గా బీజేపీని ప్రశ్నిస్తోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో దేవాలయ భూములను అభివృద్ధి అవసరాల కోసం విని యోగించుకుంటే అందుకు ప్రతిఫలంగా కేటాయించే ల్యాండ్ సైతం అదే స్థాయి ప్రయోజనకరంగా ఉండాలి తప్ప… పనికిరాని భూముల్ని ఇస్తామంటే కుదరదని కూడా క్లారిటీగా చెప్పేస్తోంది విహెచ్పీ. ఇటు సింహాచలం భూముల్ని తీసుకుంటే… ప్రత్యామ్నాయంగా చూపాలనుకుంటున్న ల్యాండ్ అంత ప్రయోజనకరమైంది కాదని బీజేపీలోనే ఓ వర్గం వాదిస్తోందట. ల్యాండ్ టు ల్యాండ్ విధానం ద్వారా అత్యంత ఖరీదైన, సస్యశ్యామలంగా వుండే భూముల్ని ప్రైవేట్ సంస్ధలకు కట్టబెట్టి అభివృద్ధికి ఎలాంటి ఆస్కారం లేని వాటిని ఇవ్వడమంటే స్వామి ఆస్తులకు నష్టం కలిగించమేనని వాదిస్తున్నాయి హిందూ సంఘాలు. ఈ పరిస్థితుల్లో… గూగుల్ ల్యాండ్ వ్యవహారం కూటమికి, ప్రత్యేకించి బీజేపీకి ఇరకాటం కావచ్చని అంటున్నారు. పైగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విశాఖకు చెందిన వారే కావడంతో ఈ వ్యవహారం పార్టీకి ముందు నుయ్యి-వెనుక గొయ్యి అన్నట్టుగా మారినట్టు చెప్పుకుంటున్నారు.
