అధికారపార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే సడెన్గా దూకుడు పెంచారా? మాటల తూటాల వెనక మర్మం ఏంటి? గతంలో తనపై జరిగిన ప్రచారం మళ్లీ ఎదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారా? ఇంతకీ ఆయనది యాక్షనా.. రియాక్షనా? ఎవరా ఎమ్మెల్యే?
మల్కాజ్గిరిలో మైనంపల్లి వర్సెస్ బీజేపీ!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్గిరి ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. రాజకీయ రణ క్షేత్రంగా మారిపోయింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా టిఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. అది రెండోరోజూ కంటిన్యూ అవుతోంది. మల్కాజ్గిరిలో జరిగిన ఘర్షణలపై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్తోపాటు.. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి.
టీఆర్ఎస్తో మైనంపల్లికి దూరం పెరిగిందని అప్పట్లో చర్చ!
తాజా ఎపిసోడ్లో ఎమ్మెల్యే మైనంపల్లి వైఖరి చర్చగా మారింది. గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఆయన అగ్రెసివ్గా ఉండేవారని అనుకునే వారు. టీఆర్ఎస్లో చేరాక దూకుడు తగ్గిందని భావించారట. నియోజకవర్గం దాటి బయటకు వచ్చి రాజకీయాలు చేసింది లేదు. పార్టీలో కూడా రాజకీయంగా తన పాత్రను ఆయనే నిర్వచించుకున్నారని చెబుతారు. అయితే ఒకానొక సమయంలో టీఆర్ఎస్తో మైనంపల్లికి దూరం పెరిగిందని ప్రచారం జరిగింది. ఆ విషయం తెలుసుకుని పార్టీ నేతలు ఆయనతో మాట్లాడారు. యాక్టివ్గా ఉండాలని సూచించడంతో ఆ ప్రచారానికి ఫుల్స్టాప్ పడింది. కానీ.. మధ్యలో మళ్లీ చర్చల్లోకి వచ్చారు మైనంపల్లి. బీజేపీలోకి వెళ్తున్నారని అనుకున్నారు. అయితే అలాంటిది ఏమీ జరగలేదు. టీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు.
మైనంపల్లిని అందుకే చేర్చుకోలేదని బీజేపీ నేతల కామెంట్స్!
బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే మైనంపల్లి యాక్షన్!
ఇంతలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున మైనంపల్లి సీరియస్గా రియాక్ట్ కావడం చర్చగా మారింది. ఎమ్మెల్యే ఎందుకలా స్పందించారో అని రాజకీయ వర్గాలు ఆరా తీస్తున్నాయట. టీడీపీలో ఉన్నప్పుడు మైనంపల్లి ఏ విధంగా అయితే ఉండేవారో.. మళ్లీ ఆయన్ని ఇప్పుడలా చూస్తున్నామని కామెంట్స్ చేసేవారూ కనిపిస్తున్నారు. ఈ ఎపిసోడ్లో మైనంపల్లిని ఎందుకు బీజేపీలో చేర్చుకోలేదో చెబుతూ కమలనాథులు కొన్ని కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్యలు చర్చకు రావడమే కాదు.. రచ్చరచ్చగా మారాయి. దీంతో బీజేపీలో చేరేందుకు మైనంపల్లి ప్రయత్నించారన్న ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టేందుకే ఆయన యాక్షన్లోకి దిగారని అనుకుంటున్నారట. పార్టీ మారాలన్న ఆలోచన తనకు లేదన్న సంకేతాలు పంపించాలనే బీజేపీపై ఆస్థాయిలో రియాక్ట్ అయ్యారని చెప్పేవాళ్లూ ఉన్నారు.
ఎమ్మెల్యే చుట్టూనే మల్కాజ్గిరి రాజకీయ వేడి!
మొత్తానికి మల్కాజ్గిరిలో మైనంపల్లి వర్సెస్ బీజేపీ అన్నట్టు ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా హీటెక్కాయి. రెండు వర్గాలు రోడ్డెక్కితే ఘర్షణ కామనైపోయింది. ఈ విషయంలో కారణాలేవైనా.. మొత్తం పరిణామాలన్నీ ఎమ్మెల్యే చుట్టూనే తిరుగుతున్నాయి. మరి.. ఈ ఘర్షణలు ఇక్కడితో ఆగుతాయా లేక.. మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తాయో చూడాలి.
