Site icon NTV Telugu

ఎమ్మెల్సీ అయిన పదిరోజులకే కష్టాలు…!

ఆయన ఎమ్మెల్సీ అయ్యి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే ఇబ్బందులు మొదలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు అదేపనిగా ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారట. ఆ కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఇంతకీ ఎమ్మెల్సీని బెదిరిస్తున్నది ఎవరు? ఏమని వార్నింగ్‌ ఇస్తున్నారు? ఎమ్మెల్సీకి ఎవరిపై అనుమానాలు ఉన్నాయి? లెట్స్‌ వాచ్‌!

ప్రొద్దుటూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ అవుదామని రాజకీయాల్లోకి వచ్చారు!

ఏపీలో ఇటీవల గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అయిన నలుగురిలో ఆర్‌. రమేష్‌ యాదవ్‌ను ఎంపిక చేయడం పార్టీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎవరి అంచనాలకు అందలేదు. ఆయన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నాయకుడు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ప్రొద్దుటూరు ఛైర్మన్‌ సీటు ఆశించి రాజకీయాల్లోకి వచ్చారు రమేష్‌ యాదవ్‌. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందారు. హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్‌ విదేశీ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న ఆయన.. రాజకీయాలకు కొత్త. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రొద్దుటూరులో 11వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా మరోకరిని ఛైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి ప్రొద్దుటూరు వైసీపీలో పరిణామాలు ఆసక్తిగా మారాయి.

ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు తిరిగిచ్చేస్తే వెనక్కి వెళ్లిపోతానన్నారు!

రాష్ట్రస్థాయిలో నామినేటెడ్‌ పదవి ఇస్తామని రమేష్‌ యాదవ్‌ను ఎమ్మెల్యే, ఇతర నాయకులు బుజ్జగించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తామని చెప్పారట. అయితే మున్సిపల్‌ ఛైర్మన్‌ కాలేదన్న ఆవేదనలో ఉన్న రమేష్‌ యాదవ్‌.. తనకు నామినేటెడ్‌ పదవి వద్దని.. ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తే.. వచ్చిన దారినే వెళ్లిపోతానని గొడవ చేసినట్టు సమాచారం. డబ్బు ఇచ్చేస్తామని ఎమ్మెల్యే కూడా ఆయనకు హామీ ఇచ్చారట. ఈ విషయం బయటకు లీక్‌ కావడంతో విపక్షపార్టీలకు అస్త్రంగా మారింది. రాజకీయంగా రచ్చ రచ్చ చేశారు. అధికార.. విపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి.

ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడంతో అంతా ఆశ్చర్యం
‘నువ్వెంత.. నీ స్థాయి ఎంత?’ అని ఫోన్‌లో బెదిరింపులు

ఈ వివాదం నడుస్తుండగానే రమేష్ యాదవ్‌ పేరు ఒక్కసారిగా రాష్ట్రస్థాయిలో వైసీపీలో చర్చకు వచ్చింది. గవర్నర్‌ కోటాలో నామినేట్‌ చేసిన నలుగురిలో రమేష్‌ యాదవ్‌ పేరు ఉండటమే దానికి కారణం. ప్రొద్దుటూరులో అయితే పెను సంచలనంగా మారింది. సీఎం సొంత జిల్లాలో ఎంతో మంది ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తుండగా.. అసలు చర్చలోనే లేని.. రాజకీయాలకు కొత్త అయిన రమేష్‌ యాదవ్‌ను ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రమేష్‌ యాదవ్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయని సమాచారం. ఆయన ఫోన్‌కు విపరీతంగా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయట. అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసి.. ‘నువ్వెంత.. నీస్థాయి ఎంత? నువ్వు ఎమ్మెల్యేతో సరితూగే వ్యక్తివా? టీడీపీ నేత నందం సుబ్బయ్యకు పట్టిన గతే నీకు కూడా పడుతుంది’ అని ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ను బెదిరిస్తున్నారట.

ఎమ్మెల్సీని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది?
సొంత పార్టీ నేతలే రమేష్‌ను బెదిరిస్తున్నారా?

ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరిది పాతకోట బంగారు రెడ్డితో రమేష్‌యాదవ్‌కు మంచి సంబంధాలే ఉన్నాయి. తనకు ఎమ్మెల్సీ పదవి రావడం వెనక రాచమల్లు కృషి ఉందని రమేష్‌ ప్రకటించారు కూడా. మరి.. ఎమ్మెల్సీని బెదిరించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఆయనను ప్రొద్దుటూరులో శత్రువుగా భావిస్తున్నది ఎవరు అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉందట. ఈ కాల్స్‌పై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అపరిచితులను పట్టుకునే వేటలో పడ్డారు. కాకపోతే ప్రొద్దుటూరులో ఈ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ శిబిరం సొంత పార్టీ నేతలపైనే అనుమానాలను వ్యక్తం చేస్తోంది.

‘పదవిని ఎంజాయ్‌ చెయ్యి.. గ్రూపులు పెడితే సహించం’ అని వార్నింగ్‌

ఎమ్మెల్సీగా రమేష్ యాదవ్ ప్రొద్దుటూరులో రాజకీయంగా ఎదుగుతున్నారనే ఉద్దేశ్యంతోనే బెదిరింపు ఫోన్ కాల్స్ ద్వారా కట్టడి చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. అయితే రాజకీయంగా, వ్యాపార పరంగా ఎలాంటి వివాదాలు లేని రమేష్ యాదవ్‌కు ప్రస్తుతం వార్నింగ్‌ కాల్స్ ఎవరు చేస్తున్నారు? అంతగా బెదిరించాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఉంది? అనేది రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. రమేష్ యాదవ్‌కు ఎమ్మెల్సీ రావడం వైసీపీలో కొంతమందికి ఇష్టం లేదట. ఫోన్‌ చేసిన వారు కూడా.. ‘ పదవి ఇచ్చారని ప్రొద్దుటూరులో ఏదో చేయాలని చూడకు. పదవిని ఎంజాయ్‌ చేయ్యి.. అంతేకాని పదవి ఉంది కదా అని గ్రూపులు పెడితే సహించేది లేదు’ అని తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నారట. ఏదేమైనా బెదిరింపు కాల్స్‌తో రమేష్‌ యాదవ్‌కు నిద్రపట్టడం లేదట. బయటకు చెబితే ఏం జరుగుతుందో అన్న అనుమానంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. మరి..ఈ ఎపిసోడ్‌ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version