ఆయన మనసు మార్చుకున్నారా? కాషాయ జెండానే తన అజెండా అని చెబుతూ దూకుడు ప్రదర్శించి.. ఇంతలోనే మారు మనసు పొందారా? సొంత పార్టీతో రాజీపడ్డారా లేక.. అప్పుడే తొందరపడటం ఎందుకునుకున్నారా? ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న ఆయన ఒక్కసారిగా ఎందుకు పురివిప్పారు? దారిలోకి వస్తున్నారని అనుకుంటున్న సమయంలో మరో బాంబ్ పేల్చారు? ఇది వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా?
రాజగోపాల్రెడ్డి యాక్టివ్ అయ్యారా?
రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఏం చేసినా హల్చలే. నల్గొండ పాలిటిక్స్లో సోదరుల రూటు సెపరేట్. గడిచిన కొంతకాలంగా.. తెలంగాణ కాంగ్రెస్లో బ్రదర్స్పై చర్చ లేకుండా నడిచిన రోజులు లేవు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కాంగ్రెస్పై అలక మీదుంటే.. ఇప్పుడు సడెన్గా చర్చల్లోకి వచ్చారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఒక్కసారిగా తమ్ముడు యాక్టివ్ కావడం చర్చగా మారింది.
Read: ఆంధ్రాలో థియేటర్స్ రీఓపెన్… రిలీజ్ కు సిద్ధంగా సినిమాలు
బీజేపీలోకి వెళ్తున్నట్టు గతంలో ప్రకటన
ఎమ్మెల్యే వైఖరిలో మార్పు వచ్చిందా?
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పని ఖతమైపోయిందని.. తనదారి కాషాయదారేనని ప్రకటించారు రాజగోపాల్రెడ్డి. దీనిపై కాంగ్రెస్లో పెద్ద చర్చే జరిగింది. షోకాజ్ నోటీసులు వరకు వ్యవహారం వెళ్లింది. రాజగోపాల్రెడ్డి ప్రకటిస్తే ఆ బాటలోనే వెళ్తారని అనుచరులు అనుకుంటారు. బీజేపీలోకి వెళ్లడం ఖాయమని ఆయన చెప్పిన తర్వాత ఎమ్మెల్యే టీమ్తోపాటు.. రాజగోపాల్రెడ్డి కూడా కాంగ్రెస్ జెండాలకు దూరంగా ఉన్నారు. సోషల్ మీడియా.. వాట్సాప్ స్టేటస్ల్లో కూడా బీజేపీకి అనుకూలంగానే పోస్ట్లు పెట్టేవారు ఎమ్మెల్యే అనుచరులు. అయితే గడిచిన కొద్దిరోజులుగా రాజగోపాల్రెడ్డి వ్యవహారశైలి మారినట్టు కనిపిస్తోందట.
రాజగోపాల్కు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన!
తెలంగాణకు కొత్త పీసీసీని ప్రకటించిన తర్వాత రాజగోపాల్ రెడ్డి వరసగా కామెంట్స్ చేస్తూ వచ్చారు. పీసీసీతోపాటు, అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలపై స్పందించడానికి ఏముంది అని ఆయన లైట్ తీసుకున్నారు. తనకు నచ్చకపోతేనే ఆయన కామెంట్స్ చేస్తుంటారు. కానీ.. ఇటీవల కొన్ని పరిణామాలపై మౌనం దాల్చి ఆశ్చర్య పరుస్తున్నారు ఈ ఎమ్మెల్యే. అకస్మాతుగా నియోజకవర్గంలో హడావుడి మొదలుపెట్టారు. ఇన్నాళ్లు అంటీ ముట్టనట్టు ఉంటూ.. పొలిటికల్గా యాక్టివ్ అయ్యారు. ప్రొటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని ఆందోళనకు దిగడంతో.. సందిగ్ధంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ రాజగోపాల్ రెడ్డికి మద్దతు పలికారు. ఆందోళనకు దిగారు.
మంత్రి జగదీష్రెడ్డి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య జరిగిన వివాదంతో క్యాడర్కి కొంత క్లారిటీ వచ్చిందట. బీజేపీ కండువా ఎప్పుడు కప్పుకొంటారో అని ఎదురు చూసిన వాళ్లకు భలే ట్విస్ట్ ఇచ్చారని చర్చ మొదలైంది. అంతేకాదు.. రాజగోపాల్రెడ్డి మనసు మార్చుకున్నారా? సొంత పార్టీతో రాజీపడ్డారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే చండూరు మండలం పుల్లెంల గ్రామంలో YS షర్మిల చేస్తున్న దీక్షా శిబిరానికి మద్దతుగా రాజగోపాల్రెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తి కలిగిస్తున్నాయి. దీక్షకు సంఘీభావం ప్రకటించడంతోపాటు.. తన మద్దతు ఉంటుందని చెప్పారాయన. ఒకవైపు షర్మిలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంటే.. ఇటు అదే పార్టికి చెందిన ఎమ్మెల్యే వెల్కమ్ చెప్పడం కాంగ్రెస్ కేడర్ను గందరగోళంలోకి నెడుతోంది. ఇంతకీ రాజగోపాల్ దారెటో?
