Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్‌లో ఏం జరిగింది?

Akunuri

Akunuri

ఆ మాజీ అధికారి తన పదవికి ఉన్న పళంగా ఎందుకు రాజీనామా చేశారు? ముఖ్య నేత సీరియస్‌ అవడమే కారణమా? లేక ప్రభుత్వం తన సిఫారసులను పట్టించుకోవడం లేదని ఆయనే అసహనానికి గురయ్యారా? ముఖ్య నేత సీరియస్‌ అవడమే కారణం అయితే… ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరా ఎక్స్ ఆఫీసర్‌? ఏంటా రిజైన్‌ స్టోరీ? ఆకునూరి మురళి…. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్. ఉరుములేని పిడుగులా…. ఉన్నట్టుండి శుక్రవారంనాడు పదవికి రాజీనామా చేసి.. ఆ లేఖను సీఎస్‌కు పంపారాయన. ప్రభుత్వం అప్పగించిన పని పూర్తి అవడంతోనే రిజైన్‌ చేశానని చెప్పారు మురళి. కానీ… ఆయన పదవీ కాలం ఇంకో నాలుగు నెలలుంది. అంతలోపే రాజీనామా చేయడం అటు ప్రభుత్వంలో, ఇటు విద్యా శాఖలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌ హోదాలో…. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలని భావించారాయన. అందుకోసం అత్యుత్తమ విద్య అందిస్తున్న దేశాలు, రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక తయారు చేశారు. ఇటీవల విద్యా కమిషన్ తన సిఫార్సుల రిపోర్ట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించింది. కానీ… దీనిపై ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యావేత్తల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో… విద్యా కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించలేదు. అలాగే సలహాదారు కె.కేశవరావు అధ్యక్షతన ఉన్న తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కమిటీ తుది నివేదికకు లోబడే మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు ఇటీవల జరిగిన నీట్ పేపర్‌ లీక్‌కు సంబంధించి…. ఓ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పోస్ట్‌ చేశారు ఆకునూరి మురళి. ఆ మెసేజ్‌లు రెండు వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మెసేజ్ పెట్టడం ఏంటంటూ… ముఖ్య నేత సీరియస్ అయినట్లు తెలిసింది. అదే ఊపులో… ప్రతిపక్షాలు, వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత రాకముందే మురళిని పదవి నుంచి వైదొలగాలని ఆదేశించినట్టు కొందరు చెప్పుకుంటున్నారు. ముఖ్య నేత నుంచి ఆదేశాలు రావడంతో… ఇక చేసేదేం ఆయన రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో మరో వెర్షన్‌ కూడా వినిపిస్తోంది. మురళికి త్వరలోనే మరో కీలక పదవిని ప్రభుత్వం ఇవ్వబోతోందని, అందుకోసమే విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయించారని ఆయన్ని అభిమానించే వ్యక్తులు అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో భూపాలపల్లి కలెక్టర్‌గా ఉన్నప్పుడు మురళి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. దీంతో అప్పట్లో ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత వీఆర్‌ఎస్‌ తీసుకుని ఏపీ ప్రభుత్వ విద్యా సలహాదారుగా పని చేశారాయన. సుమారు రెండేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పని చేసి ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు, ఎన్జీవోలతో కలిసి బస్సు యాత్ర చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కొద్ది రోజుల పాటు మంచిగానే సాగిన ప్రయాణం… నూతన విద్యా విధానం సిఫార్సులతో ఒడిదుడుకుల మయం అయినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని అంటున్నారు. విద్యా వ్యవస్థలో మార్పు కోసం తాను చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా పాత సిఫార్సులను కొనసాగించడంపై మురళీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలా ఒకదానితో మరొకటి కలగలిసి ప్రభుత్వానికి – విద్యా కమిషన్ చైర్మన్ కు గ్యాప్ ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఎదురు చూసిన మురళికి నిరాశ ఎదురు కావడంతో శుక్రవారం రాత్రి
రాజీనామా చేశారని అంటున్నారు.