OTR: అక్కడ వైసీపీలో అంతా గజిబిజీగా మారిందట. పైకి నాయకులంతా ఒక్కటే అనేలా కనిపిస్తున్నా… లోపల మాత్రం లుకలుకలు స్పష్టంగా ఉన్నాయట. కీలక నేత పార్టీని వీడిన తర్వాత పార్టీని సరిగా నడిపించే నాయకుడే కరువయ్యాడనే టాక్ వినిపిస్తోంది. కొత్తగా వచ్చిన నాయకత్వం సెట్ అయ్యేలోపే జరుగుతున్న పరిణామాలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయట. ముఖ్య నేతల సమక్షంలో మహిళా కార్యకర్తలు సిగ పట్లు పట్టేదాకా వెళ్లిందట పరిస్థితి. ఇన్ఛార్జ్ తీరుపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఇదంతా జరుగుతున్నదెక్కడ..? అక్కడి పరిణామాలపై వైసీపీ నాయకత్వం ఏం చేయబోతోంది..? లెట్స్ వాచ్.
ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయట. వైఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్గాల విభేదాలు బయటపడ్డాయి. మహిళా కార్యకర్తల మధ్య మొదలైన వివాదం.. వారి వర్గీయులు రంగంలోకి దిగడంతో పార్టీ కార్యాలయం రణరంగాన్ని తలపించినట్టు చెబుతున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో జుట్లు పట్టుకుని… పార్టీ ప్రతిష్టను మంటగలిపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ గొడవను వైసీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుందట.
బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడిన తర్వాత ఇన్ఛార్జ్ బాధ్యతలను చుండూరి రవిబాబుకు అప్పగించింది వైసీపీ. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సూపర్ అనేలా కాకపోయినా ఏదో మమ అనిపించేలా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారట. పార్టీ నిర్ణయాల అమలు, క్రమశిక్షణ విషయంలో రవిబాబు తీరుపైనా పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్నాయట. పట్టు సాధించేందుకు పార్టీలో వర్గాలను ప్రోత్సహిస్తున్నారని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారట. రవిబాబు అభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకునే ప్రయత్నాలు జరిగాయనే చర్చ ఒకవైపు సాగుతుండగా… అలాంటిదేమీలేదని ఆయన వర్గం చెబుతోంది. ఈ పరిణామాలే నేతలు రెండు వర్గాలుగా విడిపోవడానికి కారణమయ్యాయా..? అనే చర్చ జరుగుతోంది. తన మాట విననివారిపై ఫిర్యాదులు చేయించి సస్పెండ్ చేయించటం.. తన అనుచరులతో వార్నింగులు ఇప్పించటం నుంచి చేయి చేసుకోవడం కూడా జరుగుతోందని పార్టీ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. కారణాలు పూర్తిగా బయటకు రానప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డితో టచ్లో ఉన్నారంటూ మహిళా నేతలు బడుగు ఇందిర, ప్రమీలను సస్పెండ్ చేయించారని మరో వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఫొటో చిన్నగా పెట్టారని ఆయన వర్గీయులు దాడి చేసినట్టు సమాచారం. కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా అధ్యక్షుడు సహా ఇతర ముఖ్య నేతలు కార్యాలయానికి వచ్చినా… రవిబాబు సమయానికి రాకపోవటంతో ఆయన కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులున్నాయని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారట. జిల్లా ఆఫీస్ నిర్వహణను పట్టించుకోకపోయినా తన కనుసన్నల్లోనే నడవాలనేలా ఆయన చేతలు ఉంటున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయట.
పార్టీ కార్యక్రమాల సందర్భంగా దురుసుగా ప్రవర్తించి… కార్యకర్తలపై చుండూరి రవిబాబు చేయిచేసుకోవటం వివాదాస్పదంగా మారింది. జిల్లా ఆఫీస్లో మహిళ కార్యకర్తల మధ్య గొడవ ముదిరి ఘర్షణకు దారితీయటం… పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకోవటంతో పాటు బయట కూడా మరోసారి దాడులు చేసుకునే వరకూ పరిస్దితి వెళ్లినప్పటికీ రవిబాబు తనకు పట్టనట్టు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. జరిగిన ఘటనలను జిల్లా నాయకత్వం పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్టు తెలుస్తోంది. దాంతో వైసీపీ హైకమాండ్ త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒంగోలు విషయంలో అధిష్టానం నేరుగా జోక్యం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారట. మరి ఒంగోలు వైసీపీకి అధిష్టానం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుందనేది మరికొద్దిరోజుల్లో తేలనుంది.

