OTR: ముందు ప్రచారానికి వెళ్లొద్దనుకున్నారు. ఇప్పుడు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మేమున్నామని కేడర్కు భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్రావు సడన్గా తమ నిర్ణయం ఎందుకు మార్చుకున్నారు? మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు, ఆ తర్వాత వచ్చిన మార్పులేంటి? బీఆర్ఎస్ వ్యూహం ఎందుకు మారింది?
India vs USA: చెత్త రికార్డ్ను సొంతం చేసుకున్న అభిషేక్..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్రావు. ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో హాట్ డిబేట్కు కారణమవుతోంది. పార్టీలన్నాక ఎన్నికల్లో పోటీ చేయడం, వాటి నాయకులు ప్రచారం చేయడం కామనే కదా..? ఇందులో హాట్ హాట్గా మాట్లాడుకోవాల్సింది ఏముందన్న డౌట్ వస్తోందా..? ఎస్, డౌట్ కరెక్టేగానీ… అందుకు అంతకు ముందు జరిగిన పరిణామాల్ని ఉదహరిస్తున్నారు కొందరు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు బీఆర్ఎస్ పెద్దల ఆలోచన వేరుగా ఉందట. కేవలం తమ సొంత జిల్లాల్లో ప్రచారానికి మాత్రమే పరిమితం అవ్వాలని కేటీఆర్, హరీష్రావు నిర్ణయించుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో జరిగే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళకూడదని అనుకున్నారట. ఒకవేళ ఓడిపోతే వీళ్ళిద్దరూ కాలికి బలపం కట్టుకొని తిరిగినా గెలవలేదన్న అపవాదు వస్తుందన్న కారణంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా స్వయంగా జిల్లాల నేతలకు చెప్పారట. షెడ్యూలు విడుదల కంటే ముందే ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించిన కేటీఆర్…. తాము ప్రచారానికి రావట్లేదని ఇన్చార్జిలుగా ఉన్న మీరే అన్నీ చూసుకోవాలని చెప్పారట. కానీ… ఇప్పుడు కనిపిస్తున్నది వేరుగా ఉంది.
లాస్ట్ మినిట్లో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు గులాబీ ముఖ్యులు. మొదట హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాకు, కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిమితం అవ్వాలి అనుకున్నారు. ఆ జిల్లాల పరిధిలో ఉన్న మున్సిపాలిటీలను కార్పొరేషన్లను గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ… ఇప్పుడు మార్చుకున్న నిర్ణయం ప్రకారం మిగతా జిల్లాల్లో కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారు. కేటీఆర్ నిజామాబాద్, వరంగల్ తోపాటు ఖమ్మం జిల్లాలో కూడా ప్రచారం చేయబోతున్నారు. హరీష్ రావు ఇప్పటికే ఆదిలాబాద్లో పర్యటించగా నల్గొండ జిల్లాలో కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇక ఉమ్మడి మెదక్లో విస్తృతంగా పర్యటిస్తున్నారాయన. ఇలా ప్లాన్ మార్చుకోవడం వెనక పెద్ద కారణమే ఉందని అంటున్నారు పార్టీ నేతలు.
Cancer: దేశంలో 13% పెరిగిన రొమ్ము క్యాన్సర్ కేసులు.. ఏ క్యాన్సర్ అత్యధిక ప్రాణాలను తీస్తోంది?
తెలంగాణలోని దాదాపు 80% నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బాధ్యతలన్నిటినీ నియోజకవర్గ ఇన్చార్జిలకే అప్పగిస్తే మొదటికే మోసం వస్తుందని భావించినట్టు తెలుస్తోంది. అలాగే…రాష్ట్రమంతటా పర్యటించమని కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. కేవలం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద, రాబోయే సార్వత్రిక ఎన్నికల మీద మాత్రమే దృష్టి పెడితే కుదరదని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో రూరల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు గట్టి దెబ్బ పడ్డం వల్లే….ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయామని, అదే సమయంలో అర్బన్ నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు గెలిచామని అనాలసిస్ చేసుకుంటోంది బీఆర్ఎస్. అలాంటి అర్బన్ నియోజకవర్గాల్లో మరోసారి ఓటర్ల దగ్గరకు వెళ్లి తాము చేసిన పనులను చెప్పడం ద్వారా ఉపయోగం ఉంటుందని లెక్కలేసుకుంటున్నట్టు సమాచారం.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుతో పోటీ చేయకపోయినా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకున్నామని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలు కేవలం నియోజకవర్గం ఇన్చార్జులు, పార్టీ సమన్వయకర్తల మీదనే వదిలేస్తే…. పోటీ చేసే అభ్యర్థులు మనోధైర్యం కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకే చివరి నిమిషంలో ప్లాన్ మార్చుకున్నట్టు తెలిసింది. ఇద్దరు ముఖ్య నాయకుల ప్రచారం కేడర్లో ఉత్సాహం నింపుతుండగా… రేపు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.
