OTR: గత ఎన్నికల్లో ఎక్కడ చేజారిందో.. తిరిగి అక్కడి నుంచే మొదలుపెట్టాలని వైసీపీ చూస్తోందా..? సామాజిక సమీకరణల మీద ఫ్యాన్ అధిష్టానం స్పెషల్ ఫోకస్ చేస్తోందా? కాపు మంత్రం పఠించడం అందులో భాగమేనా? సాయికృష్ణ కస్టోడియల్ డెత్ నుంచి.. జగన్ ముద్రగడ పద్మనాభం పాడె మోయడం వరకు ప్రతి దానికీ ఓ లెక్కుందా? ఏంటా లెక్క? పక్కా ప్లానింగ్ ఎలా జరుగుతోంది?
2024 అసెంబ్లీ ఎన్నికల టైంలో కారణాలు ఏవైనప్పటికీ కాపుల నాడి పట్టుకోలేక పోయింది వైసీపీ. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు పార్టీ కీలక కాపు నేతలు ఉన్నప్పటికీ ఆ సామాజికవర్గ ఓటు బ్యాంక్ను ఆకట్టుకోలేకపోయింది. అదే టైంలో కూటమి లాక్కెళ్లిపోయిందన్న లెక్కలు కూడా ఉన్నాయి. దీంతో.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మార్చాలని, ఎక్కడ పోయిందో అక్కడి నుంచే మొదలుపెట్టాలన్న టార్గెట్తో సైలెంట్గా వర్కౌట్ చేస్తోంది వైసీపీ అధిష్టానం. అందుకే ఆ కోణంలో అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా వాడేస్తున్నట్టు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.
విజయవాడ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఎపిసోడ్ నుంచి తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాడెను జగన్ మోయటం వరకూ ప్రతి ఒక్క చర్య ఇందులో భాగమేనన్న అంచనాలు సైతం రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ టైం ఉన్నా… ఇప్పటి నుంచే సామాజిక సమీకరణాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల రాజకీయాలే అధికార మార్పిడిలో కీలకమనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. అందుకే… ఆ ప్రాంతాల్లో పూర్వ వైభవం సాధించాలనే లక్ష్యంతో పార్టీ అడుగులు వేస్తోందట. అందులో భాగంగానే ప్రజల్లో చర్చకు వచ్చిన ప్రతి అంశాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు.
ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి జగన్ నివాళులర్పించడం, పాడె మోయడంతో పాటు అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. భౌతిక కాయానికి నివాళులు అర్పించడం వరకు ఓకేగానీ.. ఆ తర్వాతి పరిణామాలనే నిశితంగా చూడాలని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అదే సమయంలో నిబద్దత ఉన్న నాయకుడిగా ముద్రగడ మరణం వైసీపీకి కూడా తీరని లోటన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఇక అంతకు ముందు విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కస్టోడియల్ డెత్ ఎపిసోడ్పై వైసీపీ నాయకత్వం వేగంగా స్పందించింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కొన్ని వివరాలు బయటపెట్టడం… తర్వాత జగన్ స్వయంగా ఆ కుటుంబాన్ని పరామర్శించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించడం, సీఎం చంద్రబాబు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడడం, సంబంధిత పోలీసు అధికారులపై చర్యల్లాంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతల సమావేశం మరింత చర్చనీయాంశమైంది. అదే సమావేశంలో సాయికృష్ణ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించి అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఆ సాయం అందించారు. దీంతో కాపు నేతల మీటింగ్ కేవలం సామాజిక సమావేశమా.? లేక రాజకీయ వ్యూహమా.? అన్న చర్చ కూడా జరిగింది.
మరోవైపు కాపు సామాజిక వర్గ సమస్యల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరిగా స్పందించడం లేదంటూ వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచిన కాపులకు ఇప్పుడు న్యాయం జరగడం లేదన్నది వైసీపీ వాయిస్. ఈ అంశాన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే వరుస ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
గోదావరి జిల్లాల తర్వాత ఇప్పుడు ఉత్తరాంధ్రపై దృష్టి పెడుతోందట వైసీపీ అధిష్టానం. విశాఖ వేదికగా కాపు నేతల సమావేశానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. విశాఖ, విజయనగరం, ఉభయగోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టితో ఈ సమావేశం ఉండబోతోందంటున్నారు. 2024 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తూర్పు కాపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కొత్త వ్యూహంతో ముందుకెళ్ళవచ్చని అంటున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ… గతంలో దూరమైన సామాజిక వర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తోందని చెబుతున్నాయి తాజా పరిణామాలు.

