Site icon NTV Telugu

Off The Record : అన్నీ కలగలిసి నారాయణపేట బీజేపీలో మూడు ముక్కలాట ?

Bjp

Bjp

తెలంగాణలో బీజేపీ గెల్చుకున్న ఏకైక మున్సిపాలిటీలో ఇంతవరకు ఛైర్‌పర్సన్‌ ఎందుకు బాధ్యతలు తీసుకోలేదు? వాస్తు, గట్టి ముహూర్తాలన్నవి ఉత్తుత్తి సాకులేనా? ఇన్‌సైడ్‌ జరుగుతున్న అసలు కథ వేరే ఉందా? కమల దళంలో ఏ రెక్కకా రెక్కగా ఉన్న పరిస్థితి ఏ మున్సిపాలిటీలో ఉంది? బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీ ఏంటి? జన్‌సంఘ్‌ నుంచే కాషాయ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం నారాయణపేట. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకున్న ఏకైక మున్సిపాలిటీ నారాయణపేటనే. పుర పోరులో హమ్ ఏక్ హై అన్నట్లు కలిసి పనిచేసిన కాషాయ శిబిరంలో ఛైర్‌పర్సన్‌ ఎంపిక తర్వాత సీన్‌మారిపోయిందట. ఒకటే అన్నది ఒట్టిమాటే, తమలో తమకు వర్గాలున్నాయని తాజా పరిణామాలతో చెప్పకనే చెబుతున్నారు లోకల్‌ లీడర్స్‌. 24 వార్డులున్న నారాయణపేట మున్సిపాలిటీలో 12 సీట్లు గెల్చుకున్న బీజేపీ… ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియో ఓటుతో పీఠాన్ని కైవసం చేసుకుంది. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన పదవిని తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలంటూ…పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ సహా…చాలా మంది డిమాండ్‌ చేశారు. వీరంతా ఐకమత్యంగానే పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరానికి చేర్చారు. ఇక గత మున్సిపల్ ఎన్నికల్లో సత్య యాదవ్ భార్య కొండ శ్వేతను ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటించింది పార్టీ. కానీ… అప్పట్లో పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడంతో బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషించింది. దాంతో….గత ఎన్నికల్లో నష్టపోయామని, ఈసారి మాత్రం అవకాశం ఇవ్వాలంటూ గట్టిగా పట్టుబట్టారు సత్య. దాంతో… అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకు తగ్గట్టే…. మార్చి 16న సత్యయాదవ్ భార్య శ్వేత ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

కానీ…. ఎన్నిక జరిగి నెలరోజులు దాటినా…. ఆమె ఎందుకు బాధ్యతలు తీసుకోలేదన్న సంగతి అర్ధంగాక కూపీలాగే పనిలో ఉన్నాయి పార్టీ వర్గాలు. ఆ క్రమంలోనే రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. బీజేపీ పెద్దల సమక్షంలో అట్టహాసంగా… పదవీ బాధ్యతలు స్వీకరించాలని వాళ్లకు ప్లాన్‌ ఉన్నా…పెద్దలు సమయం కేటాయించడం లేదని తెలుస్తోంది. అలాగే… వాస్తు ప్రకారం ఛైర్‌పర్సన్‌ ఛాంబర్‌ను రెనోవేషన్ చేస్తుండటం, బలమైన ముహూర్తం కుదరకపోవడం వంటి కారణాలు వినిపిస్తున్నాయి. కానీ… అసలు విషయం మాత్రం గ్రూప్‌ వారేనా అన్నది రాజకీయ వర్గాల అనుమానం. నారాయణపేట మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించారు ఎంపీ డీకే అరుణ. అందుకే పార్టీ నిర్ణయం మేరకు అభ్యర్థిని ఎంపిక చేద్దామనుకున్నారట ఆమె. కానీ… లోకల్‌ లీడర్స్‌ మాత్రం రెడ్డి సామాజికవర్గానికి కట్టబెట్టడానికి ఆమె ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేశారట.

క్యాంప్‌ నుంచి తరలి వచ్చే సమయానికి సత్యయాదవ్, నాగురావ్ నామాజీ ఏడుగురు కౌన్సిలర్స్‌తో గ్రూప్‌గా తయారై అధిష్టాన పెద్దలకు సైతం రాంగ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారట. పదవి తమకు ఇవ్వకపోతే కాంగ్రెస్‌ ఎగరేసుకుపోతుందని సంకేతాలిచ్చి చివరకు శ్వేతకు దక్కేలా చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఎపిసోడ్‌పై డీకే అరుణ గుర్రుగా ఉన్నట్లు సమాచారం… దీనికి తోడు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతుండటంతో బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సమయం ఇవ్వకపోవడం కూడా జాప్యానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద నారాయణ పేటలో గ్రూపు రాజకీయాలు, కీలక నేతల వ్యవహార శైలితో పురపాలిక ఎన్నికల తర్వాత పార్టీలో మూడు ముక్కలాట మొదలైందనేది చర్చ. నేతలు ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ముసలం చివరికి ఎటువైపు దారి తీస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది.

Exit mobile version