వైసీపీ అధిష్టానం చేసిన విఫల ప్రయోగం ఫలితం అక్కడ పార్టీని ఇప్పటికీ వెంటాడుతోందా? గత ఎన్నికల్లో కంచుకోట బద్దలైపోగా…. ఇప్పుడు కనీసం రిపేర్ వర్క్స్ కూడా జరగడం లేదా? పార్టీ పెద్దలే పరోక్షంగా గ్రూప్ వార్ని ప్రోత్సహించినట్టు అయిందా? ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే ఉప్పు నిప్పులా ఉన్న ఆ నియోజకవర్గం ఏది? రాజకీయ పరిణామాలు ఎలా మారిపోతున్నాయి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం వైసిపికి కంచుకోట. అంతకు ముందు వరుస విజయాలు సాధించిన కంబాల జోగులును గత ఎన్నికల్లో పాయకరావు పేటకు మార్చేసింది పార్టీ అధిష్టానం. రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన డాక్టర్ తలే రాజేష్తో చేసిన ప్రయోగం వికటించింది. ఇక రెండు చోట్ల ఓడిపోవడం ఒక విషాదం అయితే…. ఇద్దరూ కలిసి ఇప్పుడు రాజాం మీదే ఫోకస్ పెట్టడం ఆధిపత్యం పోరుకు దారి తీస్తోంది. ఈ క్రమంలో గడిచిన రెండేళ్ళ నుంచి రాజాం వైసీపీ బలహీనపడుతున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఇక టీడీపీ పరంగా చూస్తే… ఇక్కడ హేమాహేమీలు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోండ్రు మురళి వర్గంతో పాటు మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావ్, కావలి ప్రతిభా భారతి వర్గాలు ఉన్నాయి. కానీ.. ఎక్కడా వర్గ విభేదాలు లేవు. మిగతా నేతలు ఇద్దరి అనుచరగణం ఎమ్మెల్యే కోండ్రు వెంటే నడవడం అధికార పార్టీకి బలంగా మారింది. కూటమిలో అడపా దడపా చిన్న చిన్న విభేదాలు బయటపడుతున్నా….అవి ఐక్యతను బలహీనపరిచే స్థాయికి కాదు. అదే సమయంలో మా పరిస్థితి మాత్రం చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉందని వైసీపీ కార్యకర్తలే చెబుతున్నారు. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో రెండేళ్ళ తర్వాత కూడా అంతర్గత విభేదాలను సరిదిద్దలేకపోతోంది ఫ్యాన్ పార్టీ.
సమస్యకు మూలం కూడా ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయమేనని, అయినా సరిదిద్దేందుకు పెద్దలు ఎవరూ చొరవ తీసుకోకపోవడంతోనే పెరుగుతోందన్నది లోకల్ పార్టీ టాక్. ఇన్ఛార్జ్ తలే రాజేష్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్యాడర్తో మమేకం అవలేకపోతున్నారట. రాజకీయాల్లో ఈయన రూటే సపరేటు…..వీఐపీ పొలిటీషియన్ అని పార్టీ నాయకులే చెబుతున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమం ఏదైనాసరే… వచ్చామా, పాల్గొన్నామా, వెళ్ళామా అన్నట్టే ఉంటుంది తప్ప… పది మందితో కలిసి మాట్లాడ్డం, చొరవ తీసుకోవడం లాంటివి ఏవీ ఉండవని అంటున్నారు. తలే తీరుతో క్యాడర్ విసిగిపోతోందట. ఇదే విషయాన్ని ఇప్పటికే అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్టు సమాచారం. పార్టీ రిపేర్ కోసం విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీను ప్రయత్నిస్తున్నా… అంతగా సెట్ కావడంలేదట. కొన్ని మండలాల్లో వైసీపీ పరిస్థితి నావికుడు లేని నావలా తయారైందన్న మాటలు వినిపిస్తున్నాయి. కింది స్థాయిలో నేతలు పక్కచూపులు చూస్తున్నా.. ఇన్ఛార్జ్ మాత్రం నాకేం పట్టదన్నట్టే ఉంటున్నారన్న అసంతృప్తి పెరుగుతోంది. రాజాంలో టీడీపీ బలం కంటే వైసీపీ బలహీనతలే ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, తలే రాజేశ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు అంతకంతకూ పెరుగుతోంది. ఇది ఇలాగే కొనపాగితే రాజాం, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, వంగర మండలాల్లో కేడర్ చేజారిపోతుందన్న భయాలు సైతం పెరుగుతున్నాయి కట్టర్ వైసీపీ కార్యకర్తల్లో. ఇటు తలే, అటు కంబాల వర్గాలు పరస్పరం ఆధిపత్య పోరు చేసుకుంటున్నాయేగానీ… పార్టీ పటిష్టత కోసం ఎవ్వరూ పని చేయడం లేదని అంటున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు మినహా వేరే ఏ ప్రోగ్రామ్స్ చేయడం లేదట ఇన్ఛార్జ్ రాజేష్. అలాగే… మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు పాయకరావు పేట కంటే ఎక్కువగా తనకు పరిచయాలు ఉన్న రాజాంలో పట్టు కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకోసం తన రాజకీయ గురువు పాలవలస కుటుంబాన్ని నమ్ముకున్నారట. కూటమి నేతలు దూకుడుగా వ్యవహరిస్తుండటం, వైసీపీలో ఆ స్పీడ్ కరవవడంతో పాటు గిల్లికజ్జాలు ఇబ్బందిగా మారుతున్నాయని అంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఐక్యంగా ఎదుర్కోనాల్సిన కీలక నేతలు ఆ పని చేయకపోగా….. అనుచరులను బ్యాకెండ్లో ప్రోత్సహిస్తున్నారట. ఈ పరిస్థితుల్లో రాజాం వైసీపీలో చరిత్ర రిపీట్ అవ్వాలంటే రిపేర్ వర్క్ పక్కాగా జరగాలన్నది కార్యకర్తల అభిప్రాయం.

