Off The Record : జగనన్న టెకోఫోర్స్ పేరుతో కొత్త కార్యక్రమం.. డిజిటల్ మీడియాలో నెక్స్ట్ లెవల్కు వైసీపీ ప్లాన్స్

  • డిజిటల్ మీడియాలో నెక్స్ట్‌ లెవల్‌కు వైసీపీ ప్లాన్స్‌
  • కార్యక్రమాలకు ఆశించిన మైలేజ్‌ రావడం లేదన్న అభిప్రాయం
  • ప్రత్యర్థులు ఇతర అంశాలతో బైపాస్‌ చేస్తున్నారన్న అభిప్రాయం
  • జగనన్న టెక్‌ఫోర్స్‌ పేరుతో వైసీపీ కొత్త కార్యక్రమం
Ycp

Ycp

సోష‌ల్ మీడియాలో మ‌రికాస్త స్ట్రాంగ్ బేస్ కోసం వైసీపీ కొత్త వ్యూహాలు రూపొందిస్తోందా? సరికొత్త టీమ్స్‌ రంగంలోకి దిగుతున్నాయా? ఇన్నాళ్ళు సోష‌ల్ మీడియాను ఒక వైపు నుంచే చూసిన వైసీపీ… ఇక నుంచి రెండోలైపు కూడా చూడాలనుకుంటోందా? రాబోయేది అత్యంత కీలకమైన టైం అన్న ఉద్దేశ్యంతో… ఇప్పటి నుంచే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటోందా? అసలేంటా వ్యూహం? ఏవా అస్త్రాలు? సామాజిక మాధ్యమాల్లో వైసీపీ యాక్టివిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా సోషల్‌ మీడియాను గట్టిగానే వాడుతూ ఉంటుంది పార్టీ. అయితే… ప్రజల మీద దాని ప్రభావం దృష్ట్యా ఇక నుంచి నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట అధిష్టానం. జగన్ చేస్తున్న రైతు పరామర్శ యాత్రలు, పీపీపీపై పోరుబాట, పార్టీ పరంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలు సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో ఉంటున్నా… వాటికి ఇంకా మైలేజ్‌ రావాల్సి ఉందని, ఆశించిన మేర రాలేదన్న అభిప్రాయం వైసీపీ పెద్దల్లో ఉందట.

ఇత‌ర అంశాలు త‌మ పార్టీ ట్రెండ్స్‌ను బైపాస్ చేస్తున్నాయ‌న్న అభిప్రాయానికి వ‌చ్చినట్టు తెలిసింది. రాజకీయ ప్రత్యర్థులు కావాలనే వేరే అంశాలను స్ట్రీమ్‌లైన్‌లోకి తీసుకువచ్చి త‌మ‌కు రావాల్సిన మైలేజ్‌ను త‌గ్గిస్తున్నారన్న క్లారిటీకి వచ్చింది ఫ్యాన్‌ అధినాయకత్వం. అందుకే ఇక కేవలం సభలు, సమావేశాలతోనే సరిపెట్టకుండా…. టెక్నాలజీ స‌పోర్ట్‌తో సరికొత్త గేమ్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. దానిపేరే…. జగనన్న టెక్‌ఫోర్స్ ప్రోగ్రాం. సాధారణ పార్టీ కార్యకర్తలు, పార్టీకి కోర్ సింప‌తైజ‌ర్స్‌గా ఉంటే ఐటీ ప్రొఫెషనల్స్‌ను ఒకే తాటిపైకి తీసుకురావడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డిజిటల్ నిపుణులను ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించి వారి నైపుణ్యాన్ని పార్టీ కోసం వాడుకునేలా పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.

దానిద్వారా సోషల్‌ మీడియాలో పార్టీ ప్రజెన్స్‌ను పెంచడమే కాకుండా…. ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పికొట్టడం, అదే టైంలో… వైసీపీ ప్రభుత్వ హ‌యాంలో చేసిన మంచి పనుల్ని కూడా జనంలోకి తీసుకువెళ్ళాలన్న బహుళ లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు తెలుస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే… వైసీపీని డిజిటల్‌గా మరింత బలోపేతం చేయాట‌మే జగనన్న టెక్‌ఫోర్స్ లక్ష్యం. దానికి సంబంధించి ఎలాంటి ముందస్తు హడావిడి చేయకూడదని నిర్ణయించుకున్నారట. స్టార్ట్ అయినప్పటికంటే….రిజ‌ల్ట్ వ‌చ్చిన‌ప్పుడు ప్రోగ్రాం పేరు బ‌య‌ట‌కు రావాల‌నే కాన్సెప్ట్‌తో సైలెంట్ మోడ్‌లో ఆప‌రేష‌న్ మొదలుపెట్టినట్టు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఫీల్డ్ లెవల్‌లో ప్రతి మండలానికి ఒక టెక్ వాలంటీర్‌ను నియమించి.. గ్రౌండ్ నుంచి కేడర్‌కు డిజిటల్ సపోర్ట్ అందించేలా ప్లాన్ సిద్ధం చేశారు. ఆన్ లైన్ రిప్యుటేష‌న్ మేనేజ్మెంట్…. ORM ద్వారా సోషల్ మీడియాలో పార్టీ ఇమేజ్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేష‌న్ చేసి వైసీపీకి సంబంధించిన పాజిటివ్ నేరేటివ్ అందరి కంటే ముందు ఉండేలా ప్లాన్ చేయడం ఈ ప్రోగ్రాం ప్రధాన అజెండా. అందుకే ప్రతి మండలం నుంచి యాక్టివ్‌గా ఉండేలా సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్స్‌ను కార్యక్రమంలో భాగ‌స్వాముల్ని చేయాల‌ని భావిస్తోంది వైసీపీ.

ఈ ప్రోగ్రాంకు సంబంధించి క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఇప్పటికే వెబ్‌సైట్లు, క్యూఆర్ కోడ్‌ల ద్వారా భారీ సంఖ్యలో టెక్ వారియర్లను ఆన్‌బోర్డ్ చేస్తోంది.. క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ఈ టెక్ ఫోర్స్ రియాక్ట్ అయ్యి వారికి డిజిటల్ సపోర్ట్ అందిస్తుందట. ఒకవైపు గ్రౌండ్‌ ఫోర్స్ పని చేస్తుంటే.. మరోవైపు ఈ టెక్నో వారియర్స్ ఆన్‌లైన్‌లో పార్టీకి మద్దతుగా పోరాడతారు. డిజిటల్ యుగంలో మారుతున్న రాజకీయ సమీకరణలకు అనుగుణంగా వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో గేమ్‌ ఛేంజర్‌ అవుతుందా? సోషల్‌ మీడియాలో పట్టు పెరుగుతుందా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయవర్గాల్లో.