మైండ్ ఏమనిపిస్తే బ్లైండ్గా అదే మాట్లాడుతున్నానని ఆ ఎమ్మెల్సీ అనుకుంటున్నారుగానీ…. పార్టీ నేతలకు మాత్రం ఎక్కడో…. కాలిపోతోందట. అసలు ఆయన ఏమనుకుంటున్నారు? ఉండాలనుకుంటున్నారా? లేక వేరే ఆలోచనలు ఉన్నాయా అంటూ వైసీపీ ముఖ్యులు కొందరు సీరియస్ అవుతున్నారట. ఎవరా శాసనమండలి సభ్యుడు? సొంత పార్టీని ఇరుకున పెట్టేలా ఏం మాట్లాడుతున్నారు? పోలీస్ టర్న్డ్ పొలిటీషియన్ చంద్రగిరి ఏసురత్నం. వైసీపీ ఎమ్మెల్సీ. బీసీ సామాజికవర్గానికి చెందిన ఏసురత్నం 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా… గుంటూరు పశ్చిమలో మాత్రం ఓడిపోవడం ఆయన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే పార్టీ అధినేత జగన్ ఏసురత్నంకు మంచి ప్రాధాన్యత ఇచ్చి గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్గా రెండుసార్లు అవకాశం కల్పించారు. తర్వాత ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు. కానీ… ప్రస్తుతం ఆయన వ్యవహారశైలి ఇబ్బందికరంగా మారుతోందన్నది పార్టీ టాక్. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ తీరు తేడాగా కనిపిస్తోందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్న ఏసురత్నం కౌన్సిల్ సమావేశాలకు వెళ్లినప్పుడు అధికారపార్టీ నేతలతో సన్నిహితంగా ఉండడం, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను పొగడడం లాంటివి విపక్షంలో గందరగోళానికి దారి తీశాయి. ఇక మేయర్ పదవి దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నం చేసినప్పుడు కూడా అధికార పక్షాన్ని తప్పుపట్టకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తరచూ అధికారపార్టీ నేతలను పొగుడుతున్న వైసీపీ ఎమ్మెల్సీ…పార్టీ మారతారన్న ప్రచారం కూడా సాగింది. మరోవైపు నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు వరికపూడిసెల ప్రాజెక్టుకోసం ఎంతో కృషి చేశారంటూ చేసిన కామెంట్స్ కూడా వైసీపీలో కొంతమందికి ఇబ్బందికరంగా మరాయట. తర్వాత కూడా చంద్రగిరి ఏసురత్నం కామెంట్స్ తరచూ వైసీపీలో కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరు అద్బుతంగా ఉందటూ ప్రశంసించి అందరికీ షాక్ ఇచ్చారాయన.
తర్వాత వెల్దుర్తి మండలం గుండ్లపాడులో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విషయంపై ప్రభుత్వం బిల్లు పెట్టింది. దీన్ని మండలిలో వైసీపీ నేతలు వ్యతిరేకించారు. ఆ సమయంలో యేసురత్నం మాత్రం పార్టీ నిర్ణయానికి భిన్నంగా మాట్లాడారు. చంద్రయ్య కొడుక్కి ఉద్యోగం ఇవ్వడం సమంజసమేనని, పల్నాడు వాసిగా ఆ బిల్లుకు తాను మద్దతు ఇస్తానని చెప్పడంతో వైసీపీ ఇరుకున పడింది. ఇక తాజాగా…. పార్టీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర పర్యటన సందర్బంగా ఓ మహిళా ఎస్సైతో కొంతమంది వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తించారన్న ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. అయితే వైసీపీ మాత్రం….తమ నేతలే ఎస్సైకి సహాయం చేశారంటూ కవర్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో… అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఏసురత్నం మాత్రం విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సైతో వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు సరికాదంటూ తప్పుపట్టారు. మహిళా ఎస్సైపై దాడి చెయ్యడం అమానుషమన్నారు. పోలీస్ అధికారిగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు కర్రలు, రాళ్లదెబ్బలు తగులుతుండటం సహజమని, కానీ…. అల్లరి మూకలు చుట్టుముట్టి దాడి చెయ్యడం తనను కలిచివేసిందన్నారాయన. ఈ విషయంలో పోలీసుశాఖకు తాను సంఘీబావం ప్రకటిస్తున్నానని చెప్పారు. తాను మాజీ పోలీస్ అధికారినంటూ గుర్తు చేశారాయన. సరిగ్గా ఇక్కడే వైసీపీ ఇరుకున పడుతోందట. మహిళా ఎస్సైతో పార్టీ నేతల తీరు తీవ్ర వివాదాస్పదం అవుతున్న టైంలో… అధికార పక్షం వాదనకు మద్దతుగా సొంత నేతే మాట్లాడ్డం ఏంటంటూ వైసీపీ పెద్దలు అసహనంగా ఉన్నారట. ఇలా తరచూ పార్టీ స్టాండ్ తెలుసుకోకుండా… యేసురత్నం మాట్లాడడంపై వైసీపీలో చర్చ జరుగుతోందట.

