Site icon NTV Telugu

Off The Record : రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి కాంగ్రెస్ కు తలనొప్పిగా మారారా?

Vijashanti

Vijashanti

ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు సొంత… కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారారా..? రాక రాక సభకు వచ్చి రచ్చ చేశారా..? ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్టు… ఉభయ సభల సాక్షిగా సొంత ప్రభుత్వానికే బుల్లెట్లు దింపారా? పార్టీ పరంగా వాళ్ళకు కట్టడి లేదా….? లేక కావాలని వదిలేస్తున్నారా..!? ఎవరా ఇద్దరు? ఏంటా మాటల తూటాలు? ఇద్దరూ ఇద్దరే…. ఇద్దరూ సీనియర్సే…. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి, పార్టీగా కాంగ్రెస్‌కు వీళ్ళిద్దరూ తలనొప్పిగా మారారన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఇన్నాళ్లు క్షేత్ర స్థాయిలో కామెంట్లు చేయడం ఒక ఎత్తయితే…. ఇప్పుడు ఏకంగా శాసనసభ, శాసనమండలిలో సొంత పార్టీనే తప్పుపడుతూ కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. ఈసారి జరిగిన అసెంబ్లీ సెషన్‌లో మునుగోడు MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు ఎమ్మెల్సీ విజయశాంతి తీరు హాట్‌ టాపిక్‌ అవుతోంది.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి తాజాగా శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. సభలో ఆమె మాట్లాడిన మాటలు సొంత కాంగ్రెస్‌ పార్టీనే ఇరకాటంలో పెట్టేలా మారాయి. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదంటూ మండలిలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారామె. ప్రభుత్వ హామీలపై ఇప్పటికే ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. సోషల్ మీడియాలో దాడి నుడస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో…. ఇప్పుడు ఎమ్మెల్సీ విజయశాంతి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌లో చర్చకు దారితీసింది. అధిష్టానం ఆండదండలతో ఆమె ఎమ్మెల్సీగా వచ్చారని, కానీ… తన వ్యవహార శైలి కూడా పార్టీకి నష్టం చేసేలా ఉందని భావిస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కొందరు విషయాన్ని ఢిల్లీ పెద్దల చెవిన వేసే పనిలో ఉన్నారట. ఇక శాసనమండలిలోనే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఉన్నారు. విజయశాంతి వ్యాఖ్యలపై ఇటు పీసీసీ, అటు ఏఐసీసీ ఎలా రియాక్ట్‌ అవుతాయన్నది చూడాలి. మరోవైపు అసెంబ్లీ విషయానికి వస్తే…. కాంట్రాక్టర్లకు బిల్లుల అంశాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిక్కచ్చిగానే ప్రశ్నించారు. ఉన్న సమస్యను ఉన్నట్టుగా చెప్పాలన్న ఉద్దేశ్యంతోనే ఆయన సభలో ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు లేకుంటే మంత్రులు, ముఖ్యమంత్రులు ఎక్కడినుంచి వచ్చారు..? వాళ్ళ నియోజకవర్గాల్లో పనులు చేసే కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తున్నారు తప్ప మిగతా చోట్ల బిల్లులు ఇవ్వడం లేదంటూ సభలోనే అన్నారు రాజగోపాల్‌రెడ్డి.

మునుగోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అధికార పక్షం నుంచి రియాక్షన్‌లేకపోయినా….. సమస్య తీవ్రతను మాత్రం ఆయన సభలో చెప్పేసినట్టయిందని అంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో రచ్చ జరగలేదుగానీ….ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయన అన్న మాటలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలాగా మారాయని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇలాంటి చురకలు ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తలనొప్పేనని మాట్లాడుకుంటున్నారు. అయితే అధిష్టానం దీన్ని ఎలా చూస్తుందన్నదే ఇక్కడ ముఖ్యం. నాయకులను పిలిచి మాట్లాడతారా..? లేక కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువ… ఎవరైనా, ఏదైనా మాట్లాడొచ్చని వదిలేస్తారా..? అనేది చూడాలి. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం అప్పర్ హ్యాండ్ సాధించే ప్రయత్నం చేసింది. అక్రమ మైనింగ్ ఎపిసోడ్‌తో ప్రతిపక్షాన్ని కొంత ఇరుకున పెట్టగలిగినట్టు అభిప్రాయపడుతున్నా… సొంత పార్టీ నాయకుల వ్యాఖ్యలతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని కాంగ్రెస్‌ పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి.

Exit mobile version