OTR : ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక ఆందోళనలు

Uddanam

Uddanam

ఉద్ధరించేస్తాం…. అభివృద్ధి చేసేస్తాం…. మిమ్మల్మి ఎక్కడికో….. తీసుకెళ్తాం అని పాలకులు అంటుంటే…. వాళ్లు మాత్రం ఎక్కడికీ వద్దు మమ్మల్ని ఇక్కడే ఉండనివ్వండని అంటున్నారు. మీకు, మీ డెవలప్‌మెంట్‌కు ఓ దండం సామీ. మా జోలికి మాత్రం రావద్దంటూ కేంద్ర మంత్రికి మొరపెట్టుకుంటున్నారు. ఏ ప్రాజెక్ట్‌ విషయంలో అలా జరుగుతోంది? ఎవరా కేంద్ర మంత్రి? దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? సిక్కోలు పాలిటిక్స్‌ని కార్గో ఎయిర్‌పోర్ట్‌ కుదిపేస్తోంది. వెనుకబడ్డ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగడానికి ఉపయోగపడుతుందని సర్కార్‌ అంటుంటే… ఆ పేరుతో ల్యాండ్‌ బ్యాంక్‌ని పెంచుకుంటామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు స్థానికులు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు వైఖరి చర్చనీయాంశంగా మారింది. తమ ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్ట్ వద్దంటూ కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు ఉద్దానం వాసులు. తమ ప్రాంతంలోని వందల ఎకరాల్లో ఉన్న కొబ్బరి, మామిడి, జీడి తోటలను తొలగించి కార్గోఎయిర్ పోర్ట్ కడతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ తెగేసి చెబుతున్నారు. పెద్దగా ఉపాధి అవకాశాలు దొరకని కార్గో ఎయిర్ పోర్ట్ తమ ప్రాంతంలో వద్దంటూ పోరాటం మొదలుపెట్టారు కూడా. మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లోని 22 గ్రామాల్లో సుమారు 1200 ఎకరాలు సమీకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కానీ… అడుగు ముందుకు పడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నది స్థానికుల మాట. పచ్చని తోటలు సహా మూడు కొండలు, సీఆర్‌జడ్‌ ప్రాంతాన్ని కలిపి వేల ఎకరాలు భూ బ్యాంక్ తయారు చేసి బడా బాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు ఇక్కడి రైతులు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష, ఎంపీ…, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నారని, కానీ… వాస్తవం వేరు అన్నది కార్గో ఎయిర్ పోర్ట్ వ్యతిరేక కమిటీ వాదన. ప్రతిపాదిత ప్రాంతానికి 20 కిలోమీటర్లలోనే మూలపేట పోర్ట్‌ కోసం సేకరించిన వేల ఎకరాల భూమి ఉందని, అందులో నుంచి 500 ఎకరాలు తీసుకుని కార్గో ఎయిర్ పోర్ట్‌ కోసం వాడుకోవచ్చుకదా అన్న కమిటీ ప్రశఅన.

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పూర్తయిందన్న కారణంతో విశాఖలో ఇప్పుడున్న విమానాశ్రయాన్ని మూసివేస్తామంటున్న ప్రభుత్వ పెద్దలు…. అదే భోగాపురానికి 80 కిలోమీటర్ల దూరంలో మరో ఎయిర్‌పోర్ట్ అవసరమా అని ప్రశ్నిస్తే… ఎందుకు సమాధానం చెప్పడం లేదంటూ నిలదీస్తున్నారు. ఒడిశా సరిహద్దు పట్టణం గోపాల్‌పూర్‌లో ఎయిర్ పోర్ట్ ఉందని, ఈ మధ్య ప్రాంతంలో కార్గో పేరుతో మరో ఎయిర్‌పోర్ట్ అంటే భూములు కొట్టేయాలనే ఆలోచన తప్ప మరో పాయింట్‌ లేదని ఆరోపిస్తోంది పోరాట కమిటీ. కానీ… ఆ వాదనతో సంబంధం లేకుండా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వరుస మీటింగ్‌ పెట్టడం, భూ సేకరణ ఉంటుంది… మీకేం కావాలో చెప్పండని అధికారులు అడగడం ఏంటంటూ మండి పడుతున్నారు స్థానికులు. తమ భూములు లాక్కోవద్దని, ఎలాంటి ఉపాధి అవకాశాలు సృష్టించని కార్గో ఎయిర్ పోర్ట్ వద్దే వద్దని అంటున్నారు. ఉడాన్ పథకంలో భాగంగా ప్రాజెక్ట్ తీసుకువస్తున్నామని, కేంద్ర ప్రభుత్వమే రెండేళ్ళు నిర్వహణ చూసుకుంటుందని, ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు అధికారులు, ప్రజా ప్రతినిధులు. ఎయిర్ పోర్ట్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరుతున్నారు కూటమి నేతలు. ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళతాం అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెబుతుండటంపై కార్గో వ్యతిరేక పోరాట కమిటీ మండిపడుతోంది. గతంలో ఉద్దానం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం , కాకరాపల్లి పవర్ ప్లాంట్ నిర్మాణం వ్యతిరేక పోరాటాల్లో ప్రాణాలు కోల్పోయారని, అంత చేసి అప్పుడు భూములు లాక్కున్నా… ఇప్పటికీ అవి బీడుపడే ఉన్నాయని చెబుతున్నారు. తమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీలు నిర్మిస్తే సహకరిస్తాంగానీ… ఇలాంటి వాటికి సహకరించే ప్రసక్తే లేదన్నది లోకల్ వాయిస్‌. మంత్రి గారూ…. మా మొర ఆలకించండని ఓ వైపు వేడుకుంటూనే… మరోవైపు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న క్రమంలో ఈ ఎపిసోడ్‌ ఏ మలుపు తీసుకుంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.