గడువు దగ్గర పడుతోంది. కానీ… పదవుల్ని మాత్రం భర్తీ చేయలేదు. అధికారంలో ఉన్నాసరే… పార్టీకి పూర్తి స్థాయి కమిటీని నియమించుకునే దిక్కు లేకుండా పోయింది. తెలంగాణ పీసీసీ కమిటీ విషయంలో ఎక్కడ తేడా కొడుతోంది? ఈక్వేషన్స్ కలవడం లేదా..? లేక నాయకులు సరిగా వర్కౌట్ చేయడం లేదా? ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా… ఓ స్త్రీ రేపు రా…. అన్నట్టుగానే ఎందుకు మారిపోతోంది వ్యవహారం? వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం ఎన్నడు? తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్గౌడ్ బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర పూర్తయిపోయింది. కానీ… ఇంతవరకు పూర్తి స్థాయిలో పార్టీ కమిటీ మాత్రం ఏర్పాటు కాలేదు. పీసీసీ అధ్యక్ష నియామకం తర్వాత చాలా రోజులకు ఆఫీస్ బేరర్స్ని, అదీకూడా కొంత మందినే నియమించారు. కానీ ప్రచార కమిటీ ఛైర్మన్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ పోస్టుల భర్తీ మాత్రం జరగలేదు. ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తున్నాం అన్న మాట తప్ప… ఆ కసరత్తు ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీ లేదు. అంటే… ఎంత కసరత్తు చేసినా…. అది కొలిక్కి రావడం లేదా..? లేక కూర్పు సక్రమంగా జరగడం లేదా..? అన్న అనుమానాలు పార్టీలోనే పెరిగిపోతున్నాయి. అదే సమయంలో మరికొందరి మనసులో మరో రకమైన సందేహాలు మెదులుతున్నాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి నచ్చని పేర్లు తెర మీదకు రావడమే అసలు సమస్యా అన్నది వాళ్ళ క్వశ్చన్.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయింది. అయినా… పార్టీ పరంగా ఎందుకు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్నది ఎక్కువ మంది సందేహం. పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ తన వరకు యాక్టివ్గా వర్కౌట్ చేస్తున్నా… టీం ఏర్పాటు విషయంలో వెనుకబడుతున్నారా అన్న చర్చ సైతం నడుస్తోంది పార్టీ వర్గాల్లో. సీఎం రేవంత్రెడ్డిని గతంలో పీసీసీ అధ్యక్షుడిగా నియమించినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్స్.. ప్రచార కమిటీతో సహా అన్ని కమిటీల్ని చకచకా వేసేశారు. కానీ… ఇప్పుడు మాత్రం అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉన్నాయా..? లేవా..? అనే డౌట్ కూడా వస్తోంది చాలామందికి. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇటీవలే ముఖ్యమంత్రి నివాసంలో పార్టీ కమిటీల మీద కూడా చర్చ జరిగింది. వీలైనంత త్వరగా వాటిని భర్తీ చేయాలనే అభిప్రాయానికి అయితే వచ్చారుగానీ….. ఆ తర్వాత అడుగు ముందుకు పడక ఇప్పటి వరకు వాయిదాల పర్వమే నడుస్తోంది. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్స్ని నియమించకపోగా…. పాతవాళ్ళు… అంటే రేవంత్ రెడ్డి టీమ్లోని వాళ్ళయినా కొనసాగుతున్నారా అన్న విషయంలో స్పష్టత లేదు. దీంతో…అత్యంత కీలకమైన కార్యనిర్వాహక అధ్యక్షులు లేక పార్టీ వ్యవహారాలు సక్రమంగా నడవడం లేదన్న ఆందోళన మాత్రం కాంగ్రెస్ సర్కిల్స్లో ఉంది. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ను సాధారణంగా ఎన్నికల సమయంలో నియమిస్తారు. కానీ గతంలో ఈ ఆనవాయితీ తప్పించింది ఏఐసీసీ. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్స్తో పాటు ఒకేసారి ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కూడా భర్తీ చేస్తారన్న చర్చ నడుస్తోంది. దానికి సీనియర్ లీడర్ జగ్గారెడ్డి పేరును ప్రధానంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. ఎవర్నినియమిస్తారన్న సంగతి అలా ఉంచితే…అటు వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఇటు ప్రచార కమిటీ చైర్మన్ నియామకం విషయంలో వాయిదాల పద్ధతికి ఎప్పుడు చెక్ పడుతుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి గాంధీభవన్ వర్గాలు.
