OTR : తెలంగాణ కాంగ్రెస్‌లో కప్పల తక్కెడలా గ్రూప్ వార్? రేవంత్ రెడ్డికి కొత్త సవాల్

Congress

Congress

తెలంగాణ కాంగ్రెస్ కప్పల తక్కెడలా తయారైందా..? నిన్న పాలకుర్తి.. మొన్న కామారెడ్డి.. ఇప్పుడు తుంగతుర్తి. ఏ నియోజకవర్గంలో చూసినా ఒకటే సీన్. నేతల మధ్య పంచాయితీలు కేడర్‌కు తలనొప్పి తెప్పిస్తున్నాయట. అధికారంలో ఉన్నామనే ఆనందం కంటే… ఆధిపత్య పోరు అసలు సవాల్‌గా పరిణమించిందనే భావన కార్యకర్తల్లో వ్యక్తమవుతోందట. అసలు కాంగ్రెస్ టాప్ లీడర్స్ మధ్య ఏం జరుగుతోంది..? క్రమశిక్షణా కమిటి నోటీసులు ఇస్తున్నా నేతలు తగ్గడం లేదా..? పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామన్న ఆనందం కాంగ్రెస్ పార్టీలో ఎంతోకాలం నిలువలేదు. కాంగ్రెస్‌ పార్టీ కలహాలమయం అయిపోయింది. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పార్టీ గ్రాఫ్‌ను దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఆధిపత్య పోరు గాంధీభవన్‌ సాక్షిగా బయటపడటమే అందుకు సాక్ష్యం. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు రోడ్డుపైకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇటీవల నూతన మండల అధ్యక్షులను నియమిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తర్వులు జారీ చేయడమే ఈ రచ్చకు కారణమనే మాట వినిపిస్తోంది. పీసీసీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఛలో గాంధీభవన్ కార్యక్రమం చేపట్టారు. అదే సమయంలో ఎమ్మెల్యే మందుల శామ్యూల్‌ను కలవడానికి వచ్చిన మరో వర్గం అర్వపల్లి మీదుగా హైదరాబాద్ బయలుదేరింది. ఇరువర్గాలు ముఖాముఖి ఎదురుపడటంతో అర్వపల్లి రణరంగంగా మారింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలు ధ్వంసం చేశారు. కేవలం తుంగతుర్తి మాత్రమే కాదు.. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉందట.

ఒకటో రెండో జిల్లాల్లో కాదు.. మెజారిటీ జిల్లాల్లో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన కోల్డ్ వార్ నడుస్తోందట. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, స్థానిక సీనియర్ నేతలకు అస్సలు పడటంలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఈ వివాదం ఇప్పటికే క్రమశిక్షణా కమిటీ ముందుకు చేరింది. అటు కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి, పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. దీనిపై కూడా క్రమశిక్షణా కమిటీ విచారణ జరిపింది. ప్రతీ నియోజకవర్గంలోనూ పాత నేతలు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లోపించిందనే మాట వినిపిస్తోంది. దీనికితోడు కొందరు నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నాయట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖల మధ్య గొడవ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఎంతమందికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నా.. నేతలు మాత్రం తగ్గడం లేదట. నేతలను పిలిచి వివరణ తీసుకోవడమే సరిపోతోంది కానీ, క్షేత్రస్థాయిలో గొడవలు మాత్రం సర్దుమణిగినట్లు కనిపించడంలేదనే మాట కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. అధికారం చెలాయిస్తున్నామన్న సంతోషం కంటే… సొంత పార్టీ నేతల కుమ్ములాటలు చూసి కాంగ్రెస్ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. ఈ రచ్చతో పార్టీకి తీరని నష్టం జరుగుతోందని, భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని గ్రూపు గొడవలకు చెక్ పెట్టాలని, పార్టీ లైన్ దాటినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు