Site icon NTV Telugu

Off The Record : నామినేటెడ్ పోస్టులపై తెలంగాణ కాంగ్రెస్ ఆశావహుల్లో నిర్వేదం

Congress

Congress

అదిగో ఇదిగో అంటున్నారు. అంతలోనే వాయిదా వేస్తున్నారు. ఎందుకు పోస్ట్‌పోన్ చేస్తున్నారో…అసలు పదవులు వస్తాయో ..లేదో కూడా అర్థంకాని పరిస్థితి. ఇంతకీ పదవుల పంపకాలు ఎక్కడ ఆగుతున్నాయి..ఎందుకు ఆపుతున్నారు.. !? నామినేటెడ్ పదవులు ఆశించిన చాలామంది నేతలు ఇప్పుడు నిర్వేదంలో ఉన్నారు. అదిగో ఇదిగో అని చెప్పడమే తప్పితే పదవులు వచ్చేది లేదు పోయేది లేదు అంటూ చెప్పుకుంటున్నారు. పార్టీ నాయకత్వం వారం పది రోజుల్లో అంటూ రెండేళ్లు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ పార్టీ నేతలు చెబుతున్న గడువు వారం.. పది రోజులు. జాబితా అంతా సిద్ధం చేసినా ఎందుకు ఆగుతోందో…ఎక్కడ ఆగుతోందో అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. ఇప్పటికే పదవులు భర్తీ చేసివుంటే రెండేళ్ల టర్మ్ కూడా ముగిసేది.

పార్టీ సమావేశాల్లోనే బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి…నామినేటెడ్ పదవులు భర్తీ చేద్దాం…పార్టీ నుంచి జాబితా పంపించండి అంటూ స్టేట్మెంట్ చేశారు. ఆ తర్వాత పార్టీ నాయకత్వం ఇన్చార్జిలను నియమించి జిల్లాల వారీగా జాబితాలను కూడా సిద్ధం చేసింది. కానీ ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్లోనే కొనసాగుతోంది. ఎందుకు..? ఏమిటి ? అనేది ఎవరికీ బోధపడ్డం లేదు. ఇటీవల పార్టీ కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్లను భర్తీ చేస్తామని చెప్పుకుంటూ వచ్చింది. 16 నుంచి 17 పోస్టులను భర్తీ చేస్తామంటూ స్పష్టం చేశారు. చెప్పి నెల గడిచినా అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు కొత్త గడువు.. వారం పది రోజులకు వచ్చింది. పదవులు ఇచ్చే ఆలోచన లేదా..? భర్తీ చేస్తే నాయకులకు నష్టమేంటని నేతలు విసుక్కునేదాకా సాగదీత వ్యవహారం వెళ్తోంది.

నామినేటెడ్ పోస్టులు అనేక దశల్లో ఫిల్టర్ అవుతూ కొలిక్కి వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించిన తర్వాత పేర్లు ఫైనల్ అవుతున్నాయని తెలుస్తోంది. రెండు, మూడు పర్యాయాలు వీళ్లంతా సమావేశం కూడా అయ్యారు. అయితే ఈ కమిటీలో సమన్వయం లేకపోవడం వల్లనే వాయిదా పడుతుందన్న చర్చ కూడా నడుస్తోంది. పార్టీ చేసిన ప్రతిపాదనలో ఒకరికి నచ్చితే… ఇంకొకరికి నచ్చటం లేదని వాదన ఉంది. ఎమ్మెల్యేకు నచ్చితే మంత్రికి నచ్చడం లేదు…ఇద్దరికీ నచ్చిన వాళ్ళు నామినేటెడ్ పదవులను ఫైనల్ చేసే వాళ్లకు నచ్చటం లేదని అభిప్రాయం ఆశావాల్లో నెలకొని ఉంది. నిజంగానే నాయకుల మధ్య సమన్వయం ఉంటే ఇన్నాళ్లు ఇది వాయిదా పడుతూ వచ్చేది కాదు అనేది ఓపెన్ టాక్.

ఇప్పటి వరకు 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. ఆ కార్పొరేషన్లలో డైరెక్టర్లను భర్తీ చేసినా చాలామంది నాయకులు సంతోషపడేవారు. వాటిని కూడా భర్తీ చేయడం లేదు.. ఒకట్రెండు నెలల్లో ఆ కార్పొరేషన్ చైర్మన్ల పదవి కూడా ముగుస్తుంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ కూడా కొంత అసంతృప్తితో కనపడుతోంది. పనులు అవ్వడం లేదన్న ఆగ్రహంతో వుంది. మరోవైపు నాయకులకేమో పదవులు రాక బీపీ రైజ్ అవుతోంది. ఎదురుచూసి..ఎదురుచూసి…విసుగు చెందిన తర్వాత పదవి వచ్చినా…సదరు నాయకుల్లో ఆ జోష్ సగం సచ్చిపోయి ఉంటుంది. ఇప్పటికైనా నామినేటెడ్ పోస్టుల భర్తీ గందరగోళానికి పార్టీ నాయకత్వం ఎప్పుడు ఫుల్‌స్టాప్ పెడుతుందో చూడాలి.

Exit mobile version