OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?

Bjp

Bjp

తెలంగాణ కమలంలో బొమ్మ క్లియరైందా? ఇక్కడేం జరుగుతోందో సీన్‌ టు సీన్‌ ఢిల్లీ నాయకత్వానికి ఐ మ్యాక్స్‌ రేంజ్‌లో కనిపిస్తోందా? తేడా సన్నివేశాల కత్తిరింపులకు రంగం సిద్ధమైందా? అందుకే… ఇప్పటికైనా మారండని అంటూ… అధినాయకత్వం ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చేసిందా? ఎమ్మెల్యేలు, ఎంపీలకు సైతం వాళ్ళ పరిధులేంటో చెప్పి… ఒళ్లు దగ్గర పెట్టుకోమని అన్నారా? ఇంతకీ బీజేపీ అధిష్టానానికి ఏం తెలిసింది? రాష్ట్ర నేతలకు ఏమని వార్నింగ్‌ ఇచ్చారు? బెంగాల్‌ గెలుపు తర్వాత నెక్స్ట్‌ టార్గెట్‌ తెలంగాణనే అని చెప్పకనే చెప్పిన బీజేపీ అధిష్టానం ఆ దిశలోనే వేగంగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ క్రమంలోనే… ముందు ఇంటిని చక్కదిద్దుకునే పని మొదలైంది. రాష్ట్ర పార్టీలో ఎడముఖం పెడ ముఖంగా ఉన్న నేతలను ఒక్క తాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. రైతు ఘోష- బీజేపీ భరోసా కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులంతా ఒకే బస్సు ఎక్కారు, కలిసి పర్యటించారు. అదంతా ఒక ఎత్తయితే… తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులు కొద్ది మంది రాష్ట్రంలోని అధికార పార్టీతో సన్నిహితంగా అంటున్నారని, ఇంకొందరైతే….. అసలు అంటకాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ నాయకత్వం దీనిమీదే ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారన్న పూర్తి సమాచారం హస్తిన బీజేపీ పెద్దల దగ్గర ఉందట. ప్రధానంగా ఐదు జిల్లాల్లో కోవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయట. మున్సిపల్ ఎన్నికల్లో సదరు నాయకులు ఇటు సొంత పార్టీ దగ్గర, అటు పక్క పార్టీలు ఇచ్చిన డబ్బులు కూడా జేబులో వేసుకొని అసలేం పని చేయకుండా గమ్మున ఉన్నట్టు నివేదికలు ఢిల్లీ చేరడంతో…. వాళ్ళను వదిలే ప్రసక్తే లేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ అంటున్నట్టు సమాచారం.

దీన్నిబట్టి చూస్తుంటే…. ఇక మీదట తెలంగాణ బీజేపీలో కోవర్ట్ రాజకీయాలు నడవవని ఢిల్లీ నాయకత్వం కరాఖండిగా చెప్పేసినట్టయిందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. కొందరు కాషాయ నేతలు అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్ని కలవడం, వేదికలు పంచుకోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తమైందట. ముఖ్యమంత్రి తమ నియోజకవర్గానికి వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు వెళ్ళడం వరకు ఓకే, అది పద్ధతిగానీ…. పక్క నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు కూడా… తగుదునమ్మా అంటూ… బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లి కలవడం ఏంటని పార్టీ పెద్దలు ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక పైన అలాంటివి నడవవు, రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలపై రాజీలేని పోరాటం చేయాల్సిందేనని తేల్చి చెప్పేసినట్టు మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో రాష్ట్ర ఇన్ఛార్జ్‌ అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. ఆ సందర్బంగానే… కొందర్ని కడిగేసినట్టు తెలిసింది. మీ తీరు సరిగా లేదు, సంబంధం లేకున్నా సీఎం మీటింగ్స్‌కు వెళ్ళడం ఏంటని నిలదీసినట్టు తెలిసింది. సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవడంలో తప్పు లేదుగానీ… సంబంధం లేని చోట వేదికలు పంచుకోవడం… ఆయన్ను రిసీవ్ చేసుకోవడం లాంటివి చేస్తే… కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయో మీరే ఆలోచించుకోమని ఇన్ఛార్జ్‌ అన్నారట. దీన్ని బట్టి చూస్తుంటే… రాష్ట్రంలో ఇక నుంచి ఎవ్వరి ఆటలు సాగవు, పై నుంచి చూస్తుంటారు, ఎక్స్‌ట్రా తోకలు కత్తిరించడం ఖాయం అంటూ కాషాయ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.