అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షం పోరు కాస్తా… అక్కడ వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టు మారిపోయిందా? టీడీపీలోని ఒక విభాగమే పరోక్షంగా ప్రతిపక్ష నేతల మధ్య మంటపెట్టిందా? ఆ మంట ఏ మాత్రం చల్లారకుండా…. ఫ్యాన్ లీడర్స్ పెట్రోల్ చల్లుతున్నారా? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? వైసీపీలో అంతర్గ లొల్లి ఏంది? కర్నూలు వైసీపీలో అంతర్గత పోరు వీధికెక్కుతోంది. అక్కడా ఇక్కడా కాకుండా… ఏకంగా సోషల్ మీడియా వేదికగా నాయకులు దుమ్మెత్తి పోసుకోవడం హాట్ టాపిక్ అయింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ మధ్య…. సోషల్ మీడియా వార్ ఒక రేంజ్లో నడుస్తోంది. వారం క్రితం కర్నూలు వేదికగా…. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎస్వీ మోహన్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మధ్య మాటలు మంటలు చెలరేగాయి. అవి అలా.. చల్లారాయో లేదో… ఇప్పుడు వైసీపీలో అంతర్గత పోరు కాక రేపుతోంది. పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ ఐ టీడీపీ జిల్లా అధ్యక్షుడితో… ఎస్వీ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫోన్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు బయటికి వచ్చాయి. వాయిస్ రికార్డ్ చేసిన ఐ టీడీపీ ప్రతినిధి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అంతకు ముందు కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి, జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన ఆదోళన గురించి ప్రస్తావించిన అహ్మద్ ఖాన్…. ఆ విషయంలో ఎస్వీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. ఆయన వైసీపీలో వెనుకబడ్డారని, దాన్ని నిలబెట్టుకోడానికి నానా తంటాలు పడుతున్నాడని ఆ కాల్లో అన్నారు అహ్మద్ ఖాన్. కానీ… ఆ ఆందోళనలో జక్కంపూడి, సిద్ధార్థ రెడ్డి మాత్రమే హైలైట్ అయ్యారంటూ ఐ టిడిపి ప్రతినిధితో కామెంట్ చేశారు వైసీపీ నగర అధ్యక్షుడు. ఎస్వీ మోహన్ రెడ్డి వన్ మ్యాన్ షో చేస్తున్నారంటూ సొంతపార్టీ నేతపై నెగెటివ్ కామెంట్స్ చేశారాయన. సరిగ్గా ఈ పాయింట్స్నే తనకు అనుకూలంగా మార్చుకోవడంతో పాటు… వైసీపీలో అంతర్గత విభేదాలు గట్టిగా ఉన్నాయని ప్రొజెక్ట్ చేస్తూ…. ఆడియో రికార్డ్ను పోస్ట్ చేసింది టీడీపీ సోషల్ మీడియా విభాగం.
అదే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో మంట పుట్టిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడికి వ్యతిరేకంగా కర్నూల్ నగర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల గురించి లోకల్ ఫ్యాన్ కేడర్లో కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అటు ఎస్వీకి చెందిన సోషల్ మీడియా టీమ్ కూడా… అహ్మద్ పేరు ప్రస్తావించకుండా కొన్ని పోస్ట్లు పెట్టడం కలకలం రేపుతోంది. మరికొందరు సోషల్ మీడియాలోనే… అహ్మద్ అలీఖాన్ పై ప్రశ్నలు సంధిస్తున్నారు. “పార్టీ జెండా భుజాన వేసుకొని ప్రత్యర్థులతో గుసగుసలు పెట్టడం నాయకత్వం కాదు..”, పార్టీ నాయకత్వంపై టీడీపీ వాళ్ళతో మాట్లాడితే కార్యకర్తల గుండెల్లో మంటలు రావడం సహజం”, “పదవి ఇచ్చిన పార్టీని వెనుక నుంచి పొడిచే రాజకీయాలను కర్నూలు ప్రజలు ఎన్నటికీ మన్నించరు”, అంటూ పెట్టిన సోషల్ పోస్ట్లు అహ్మద్ అలీఖాన్ను ఉద్దేశించేననిచెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఆయన మీద వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయట. అటు ఖాన్ సైతం నేనేం తక్కువ తినలేదన్నట్టు రివర్స్ కౌంటర్స్ వేయడం ఇంకా కాక రేపుతోంది. తాను ఐ టీడీపీ వాళ్ళతో మాట్లాడిన మాటల కన్నా ఎక్కువగా… వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో ప్రచారం చేశారని, అంటే… కర్నూల్ వైసీపీ నేతలు టీడీపీతో కుమ్మక్కు అయ్యారా అంటూ ఎదురు ప్రశ్నించారాయన. తనను, తన కుటుంబాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని, కనీసం నాతో వివరణ తీసుకున్నారా అని నిలదీస్తున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డికి నేను ఫోన్ చేశానని, ఆయన రెస్పాండ్ అవలేదని వివరణ ఇచ్చారు ఖాన్. అసలు ఐ టీడీపీ, ఎస్వీ సోషల్ మీడియా కలిసే నా పైన కుట్ర చేసి ఫోన్లో మాట్లాడించారంటూ ఆరోపించారు అహ్మద్ అలీఖాన్. కాల్లో నేను మాట్లాడింది వేరే, ప్రచారం అవుతున్నది వేరే అంటూ వివరణ ఇచ్చుకుంటున్నారాయన. ఆ విధంగా…. టీడీపీ, వైసీపీ మధ్య పోరాటం కాస్తా వైసీపీలో వర్గపోరు వైపు మళ్ళడం చర్చకు దారితీసింది. ఇప్పటికే కర్నూలు వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నగర అధ్యక్షుడు అహ్మద్ అలీఖాన్ వర్గాలు ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు హఫీజ్ ఖాన్, ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఇపుడు ప్రతిపక్షంలో వున్నా పోరు మాత్రం ఆగడం లేదు.
