కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకని అక్కడి టీడీపీ కాపు నాయకులు అంటున్నారా? అస్సలు… ఏ మాత్రం మొహమాటపడకుండా…. ప్రయారిటీని బట్టే పర్ఫార్మెన్స్ అని చెప్పేస్తున్నారా? వైసీపీలోని తమ కులం నాయకులు హాటు ఘాటు కామెంట్స్ చేస్తున్నా…. వాళ్ళు అందుకే రియాక్ట్ అవడం లేదా? ఎక్కడుందా పరిస్థితి? టీడీపీ కాపు నాయకులు ఎందుకు నోరు తెరవడం లేదు? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కాపు నేతలు చాలా మందే ఉన్నారు. అందులో పొలిటికల్ పరపతి, అంగ బలం, అర్ధబలం ఉన్నవాళ్ళే ఎక్కువ. అంత మంది ఉన్నా, పార్టీకి పవరున్నా… గతానికి భిన్నంగా ఈ మధ్య కాలంలో ఎవ్వరూ పెద్దగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. దాదాపుగా మ్యూట్ మోడ్ నడుస్తోంది. వైసీపీలోని తమ సామాజిక వర్గ నేతలు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నా… నో రియాక్షన్. అదంతా మనకు సంబంధంలేని వ్యవహారం…. అయినా నాకెందుకులేమ్మా… అన్నట్టుగా ఉంటున్నారు. దాంతో వీళ్ళకేమైందంటూ చర్చ మొదలైంది. అందులో నుంచి ఓ కొత్త యాంగిల్ బయటపడి ఓ… అదా సంగతీ…. అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. వైసీపీ కాపు నాయకులు, అందులోనూ… ముద్రగడ పద్మనాభంలాంటి వాళ్ళయితే డైరెక్ట్గా టీడీపీ అధినేత చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. పరామర్శల పేరుతో రోజూ ఏదో ఒక అంశాన్ని తెర మీదకు తెస్తున్నారు. అయినప్పటికీ తూర్పు గోదావరి తమ్ముళ్ళలో చలనం ఉండడం లేదట.
ఆంధ్రప్రదేశ్లో అసలు కాపు సామాజిక వర్గం అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలే. రెండు జిల్లాల్లో ఆ సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది. అలాంటి చోట టీడీపీ కాపుల్లో నైరాశ్యం పెరిగిపోవడం హాట్ టాపిక్ అయింది. రాజకీయ ప్రత్యర్థులు ఏం మాట్లాడినాసరే…. ఎవ్వరూ రియాక్ట్ అవడం లేదు. అసలు తమ పరిధి కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలా ఎందుకంటే…. పార్టీ మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేం మాత్రం ఎగిరెగిరి దంచడం ఎందుకన్నది వాళ్ళ ప్రశ్న. ఇక్కడ కాపు కోటాలో పదవులు, ప్రయారిటీ మొత్తం జనసేనకే వెళ్తున్నప్పుడు…. ఏదన్నా మాట్లాడాల్సి వస్తే… వాళ్ళే మాట్లాడుకుంటారు. మేమెందుకు ఓవర్ యాక్షన్ చేయడం అన్నది గోదావరి కాపు తమ్మళ్ళ క్వశ్చన్ అట. ఇక్కడ కాపు కోటా నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాంతో తొలిసారి తూర్పుగోదావరి కాపు నేతలకు జిల్లా నుంచి అవకాశం లేకుండా పోయింది. ఇక అప్పటి నుంచి పార్టీ మీద గరంగరంగానే ఉన్నారట. అలాగే… ఇతర నామినేటెడ్ పదవుల్లో సైతం జనసేనలోని కాపు నాయకులకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట టీడీపీ కాపు లీడర్స్. అందుకే మా పరిధిలో మేం ఉంటే సరిపోతుందంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. మనమే ఎక్కువ ఊహించుకున్నాం…. అసలోళ్ళకి మాత్రం పార్టీలో ఉన్న కాపులతో పనిలేదంటూ అంతర్గత సమావేశాలు సైతం పెట్టుకున్నారు. అటు సామాజిక వర్గపరంగా జనరల్ రియాక్షన్స్ కూడా పెద్దగా ఉండటం లేదు. జిల్లాలో టిడిపి తరఫున పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రం అడపా దడపా కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ… కాపు నాయకులు మాత్రం టచ్ మీ నాట్ అంటున్నారు. తమ సామాజిక వర్గ కోటాలో వచ్చే పదవులన్నీ జనసేనకు కట్టబెడుతున్నప్పుడు అనవసరంగా ఓవర్ అయిపోవడం ఎందుకన్నది వాళ్ళ అభిప్రాయం. ఏదన్నా మాట్లాడి వ్యక్తిగతంగా కార్నర్ అయిపోతే ఇటు పదవి రాక, అటు ప్రత్యర్థులకు టార్గెట్ అయి రెంటికీ చెడ్డ రేవడిలా మారిపోతాం, ఏమీ లేనప్పుడు ఎగిరెగిరి పడడం ఎందుకని అంటున్నారట చాలామంది.ఎమ్మెల్యేల దగ్గర నుంచి కాపు సామాజిక వర్గ ముఖ్య నేతల వరకు అంతా సేమ్ ట్యూన్లో ఉన్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియకుండా ఇప్పుడు కెలుక్కోవడం ఎందుకన్నది వాళ్ళ వెర్షన్. అవతలోళ్ళు మనల్ని ఏకేస్తున్నారు. మీలో గతంలో ఉన్న ఫైర్ ఏమైందని లోకల్ లీడర్స్ ఎవరన్నా అడిగితే… పిండి కొద్ది రొట్టె అని సమాధానం చెబుతున్నారట. పార్టీ ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తే చాలు…. అంతకుమించి హైప్ అవ్వాల్సిన అవసరం లేదని సూటిగా చెప్పేస్తున్నట్టు తెలిసింది.
మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు తమ్ముళ్లు ప్రయారిటీని బట్టి పర్ఫామెన్స్ అంటున్నారు. ప్రతిపక్షం సొంత సామాజిక వర్గం టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నా… అందుకు కౌంటర్స్ బాధ్యత చూసుకోవడానికి మిత్రపక్షం ఉందికదా అని సెటైర్లు వేస్తున్నారు. ఇలా… కొన్ని సందర్భాలలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం డిఫెన్స్ పడుతున్నట్టే కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. తూర్పుగోదావరి కాపు తమ్ముళ్ళ లెక్కలు ఎప్పటికి, ఎలా సెట్ అవుతాయో చూడాలి.
