ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అడ్డగోలుగా తవ్వేసుకోవడం, ఇనప్పెట్టెల్లో పోగేసుకోవడమేనా? అదేమంటే…. వాళ్ళకు పవర్ ఉన్నప్పుడు చేయలేదా? ఇప్పుడు మేం చేస్తే… తప్పేంటని గడుసుగా ప్రశ్నిస్తున్నారా? అన్నా… ఏదన్నా పని చూపించమని అక్కడి ఎమ్మెల్యేని ఎవరైనా అడిగితే… ఓ టిప్పర్ కొనుక్కో… లైఫ్లో సెటిలైపో అంటూ కూల్గా సమాధానం చెబుతున్నారా? ఎక్కడ జరుగుతోందా తంతు? ఎవరా ఎమ్మెల్యే? కోట సాక్షిగా…. చంద్రగిరి నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు యధేచ్చగా జరిగిపోతున్నాయి. సెగ్మెంట్లోని దాదాపు 25 ప్రాంతాలను అక్రమ తవ్వకాలకు కేంద్రాలుగా మార్చేశారన్న ప్రతిపక్షం ఆరోపణలతో మట్టిలో మంటలు పుడుతున్నాయి. టీడీపీ నాయకులు ఇష్టానుసారం ప్రకృతి సంపదను చెరబడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో…. చంద్రగిరిలో ఉన్నట్టుండి పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎమ్మెల్యే పులివర్తి నాని ధనదాహానికి నియోజకవర్గంలోని కొండలు, గుట్టలు, చెరువులు, వాగులు, నదులు…. ఇలా ఒక్కటి కాదు…. ప్రతి ప్రకృతి వనరు బలైపోతున్నాయని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు. కొన్నయితే అసలు పూర్తిగా ఆనవాళ్ళు కోల్పోతున్నాయట. చంద్రగిరి సెగ్మెంట్ నుంచి కోట్ల రూపాయల విలువైన మట్టి, ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ఈ మాఫియా వెనక ఎమ్మెల్యే ఉన్నారన్నది లోకల్గా వినిపిస్తున్న ప్రధానమైన ఆరోపణ. తన దగ్గరికి వచ్చి ఉపాధి చూపించమంటే… సాధారణంగా ఏ నాయకుడైనా… చేతనైన సాయం చేస్తాడు. కుదిరితే వాళ్ళు కోరుకున్న ఉద్యోగానికి రికమండ్ చేయడమో, లేక స్వయం ఉపాధికి కావాల్సిన మార్గ నిర్దేశనం చేయడమో జరుగుతుంది. కానీ…. ఈ విషయంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని రూటే సపరేట్ అట.
ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్లి అన్నా… ఏదన్నా ఉపాధి చూపించమంటే…. ఆడో, ఈడో ఎందుకురా…. కొత్తదో, పాతదో ఓ టిప్పర్ కొనుక్కో… నీకు బ్రతుకుదెరువు నేను చూపిస్తానంటూ చిట్టి చిట్కా చెప్పినట్టు ఓ రూట్ చూపిస్తున్నారట. అదేటంటే… అసలు మేటర్ అక్కడే ఉందన్నది విపక్షాల మాట. తన దగ్గరికి వెళ్లిన వాళ్ళందరికీ టిప్పర్స్ కొనుక్కోమని సలహాలిచ్చి వాటితో… ప్రకృతి వనరుల్ని దోచే బాధ్యత అప్పగిస్తున్నట్టు ఓ రేంజ్లో విరుచుకుపడుతోంది ప్రతిపక్షం. మరీ ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్కు అత్యంత సమీపంలో ఉన్న స్వర్ణముఖి నదిలో ఇసుక, తిరుపతి రూరల్ లోని దళవాయి చెరువులో మట్టిని భారీ ఎత్తున తవ్వేస్తున్నారని, కావాలంటే స్వయంగా కలెక్టరే వెళ్ళి పరిశీలించుకోవచ్చని కూడా సవాల్ చేస్తోంది వైసీపీ. ప్రభుత్వ యంత్రాంగం చూస్తుండగానే పగలు, రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో మట్టిని తవ్వి తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని, దీని వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉందంటూ బలంగా వాదిస్తున్నారు వైసీపీ లీడర్స్.
అయితే… ఇందుకు టీడీపీ లీడర్స్ కౌంటర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. అభివృద్ధి పనుల కోసం ఇసుక, మట్టి అవసరం ఉంటుందని, దాని కోసం తవ్వకాలు జరిపితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. పాకాల-దామలచెరువు, చంద్రగిరి ,శ్రీనివాసమంగాపురం రోడ్లు, గోవిందధామం వంటి అభివృద్ధి పనుల కోసం మట్టి, ఇసుక తవ్వి సరఫరా చేస్తే అది దోపిడీ ఎలా అవుతుందన్నది వాళ్ళ క్వశ్చన్. అదే సమయంలో కాస్త గడుసు ప్రశ్నలు కూడా వేస్తున్నారట. ఏం… వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తవ్వుకోలేదా? అందుకే ఇప్పుడు మేం కూడా తవ్వుకుంటున్నామంటూ కాస్త డిఫరెంట్ వాయిస్ వినిపిస్తున్నారట నియోజకవర్గంలోని కొందరు టీడీపీ లీడర్స్. దీంతో…. ఇది తప్పా ఒప్పా అన్న చర్చ పక్కకుపోయి… అధికారంలో ఎవరుంటే వాళ్లు ఆ పని చేయవచ్చన్న వాదన తెరపైకి వస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వ్యవహారంపై వైసీపీ ఫిర్యాదుతో సమగ్ర విచారణకు ఆదేశిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలోమాత్రం వాతావరణం వేడెక్కుతోంది. అది అభివృద్ధి మంత్రమా? లేక అక్రమ దందానా అన్నది ఉన్నతాధికారులు తేల్చే లోపే… చంద్రగిరి పొలిటికల్ హీట్ సమ్మర్ సెగల్ని మరిపిస్తోంది.
