సిక్కోలు వైసీపీలో ఏదో…… ఏదేదో….. జరిగిపోతోందా? అంతర్గత కుమ్ములాటలు క్రమంగా వీధికెక్కుతున్నాయా? గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు కొత్తగా కులాల ప్రస్తావన ఎందుకొస్తోంది? ఒక కులాన్నే అందలం ఎక్కిస్తున్నారంటూ సీనియర్ నేత కొడుకు సభాముఖంగా ప్రకటించడం వెనక ఉద్దేశ్యం ఏంటి? జిల్లా పార్టీలో అసలేం జరుగుతోంది? స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా… శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ క్రమంలో… తాజాగా జరిగిన ఆమదాలవలస నియెజకవర్గం విస్తృత స్థాయి సమావేశం హాట్ టాపిక్ అయింది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కొంత కాలంగా పార్టీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. దీంతో… ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్…. తమ్మినేని, టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ని కలిపి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పైకి ఎన్ని చెప్పినా… చివరికి ఇద్దరు ఒకటౌతారంటూ మాట్లాడ్డంపై తమ్మినేని ఫ్యామిలీ అసహనం వ్యక్తం చేస్తోంది. తమను టార్గెట్ చేస్తూ… సొంత పార్టీలోనే ఉన్న ధర్మాన సోదరులు రాజకీయం నడుపుతున్నారన్నది సీతారామ్ ఫ్యామిలీ అభియోగం. తమ్మినేని రాజకీయ జీవితంలో కామాలు తప్ప… ఫుల్స్టాప్ ఉండబోవని చెబుతున్నారు. జిల్లా వైసీపీలో కేవలం వెలమ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగితే… రేపు ఒక్క సీటు కూడా గెలవదంటూ మాజీ స్పీకర్ కుమారుడు చిరంజీవినాగ్ అనడంపై హాట్ హాట్గా చర్చలు జరిగిపోతున్నాయి. శ్రీకాకుళం వైసీపీలో గ్రూపులు, ఆధిపత్య పోరు సహజమే అయినా…. ఇప్పుడు తమ కుటుంబం లక్ష్యంగా… జిల్లా పార్టీ నేతలు అంతా కలిసి కథ నడిపించారన్నది తమ్మినేని ఫ్యామిలీ ఆరోపణ.
కానీ… భూ కబ్జా ఎపిసోడ్, కేసుల తరువాత బయటకురాని మాజీ స్పీకర్… ఆమదాలవలసలో మాత్రం గ్రూపులకు ఆజ్యం పోస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు లోకల్ లీడర్స్. ఈ క్రమంలో వాళ్ళంతా ఆమదాలవలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్కు మద్దతుగా నిలబడుతున్నారు. అలాంటి వాళ్ళందర్నీ ధర్మాన బ్రదర్స్ సపోర్ట్ చేస్తున్నారట. ఈ వ్యవహారమే ఇప్పుడు తమ్మినేని ఫ్యామిలీకి మింగుడుపడ్డంలేదని అంటున్నారు. ఆ మధ్య మహిళా పోలీస్ ఆఫీసర్ కేసులో చింతాడ అరెస్ట్ తరువాత సీన్ మారిపోయింది. దానికి సంబంధించి పార్టీ నాయకులు వరుసగా అరెస్ట్ కావడం, జైలు, బెయిలు తర్వాత… రవికుమార్కు పార్టీలో మద్దతు పెరుగుతోందట. అందులో భాగంగానే ధర్మాన సోదరులు చింతాడకు అన్ని విధాల అండగా ఉంటున్నట్టు చెబుతున్నారు. పార్టీ మీటింగ్లో తమ్మినేని నాగ్ బరస్ట్ అయిపోవడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. ఆమదాలవలస నియెజకవర్గంపై పెత్తనం చేయడానికి ధర్మాన సోదరులు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారాయ. అందుకు బదులు వాళ్ల నియోజకవర్గాల సంగతి చూసుకుంటే బెటరని కూడా కామెంట్ చేశారు. అదే సమయంలో ధర్మాన అండ్ కో వైపు నుంచి కూడా గట్టి కౌంటరే పడుతోందట. వాళ్లని రాజకీయంగా దెబ్బతీయాల్సిన అవసరం మాకేం లేదు. భూ కబ్జా కేసులో ఇరుక్కుని డ్యామేజ్ అయిన ఇమేజిని తిరిగి సంపాదించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్ తర్వాత తమ్మినేని బయటకు రావడంలేదని, ఇప్పుడు రాజకీయంగా వాడుకుని తిరిగి బయటికి రావాలనుకుంటున్నారంటూ విశ్లేషిస్తోంది ఆ వర్గం. గ్రూపుల్ని వదిలేసి క్రియాశీలకంగా పనిచేస్తామంటే ఎవరు కాదంటారంటూముక్తాయింపునిస్తున్నారు. మాజీ స్పీకర్కు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఉంటుందని అంటున్నారు. అయితే… ఆయన కుమారుడు నాగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఏ టర్న్ తీసుకుంటాయోనన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది సిక్కోలు వైసీపీలో.

