ఆ మాజీ ఎమ్మెల్యేను కారులోనే ఉంచుతారా….? లేక డోర్స్ ఓపెన్ చేసి ఖాళీ లేదు, దిగి వెళ్లి పొమ్మంటారా? పార్టీ అధిష్టానం ఇచ్చిన షో కాజ్ నోటీసులకు ఇంత వరకు ఆయన సమాధానం ఇవ్వకపోవడాన్ని ఎలా చూడాలి? అదే సమయంలో ఆయన కుటుంబానికి చెందిన వ్యక్తికే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం వెనక అర్ధం ఏంటి? ఇంతకు ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటా కథ? వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్లో కీలక మార్పులు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం పార్టీకి ఇరకాటంగా మారినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన్ని ఏం చేయాలన్న విషయమై తీవ్ర తర్జనభర్జనలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. గత మార్చిలో మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్పై దాడి చేసిన పోలీసులు డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువుర్ని అరెస్ట్ చేశారు. ఫామ్హౌజ్ యజమాని కూడా అయిన పైలట్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడ జరిగిన పార్టీలో మాజీ ఎమ్మెల్యే కూడా డ్రగ్స్ వాడినట్టు తేలిందని ప్రకటించారు పోలీసులు. దానికి సంబంధించి పైలట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. తన మీద వచ్చిన ఆరోపణలకు వారం రోజుల్లోగా స్పష్టంగా, లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ ఇవ్వకుంటే పార్టీ నియమావళి ప్రకారం వేటు వేస్తామని కూడా హెచ్చరించారు. ఆ మేరకు మార్చి 16న షోకాజ్ నోటీస్ జారీ అయింది. బీఆర్ఎస్ బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీ అని, చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగి ఉందంటూ రోహిత్ రెడ్డికి పంపిన నోటీసుల్లో స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాల వినియోగం, వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండటాన్నీ బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని కూడా అందులో తెలిపారు. ఈ సంఘటనలో పైలట్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టాయని… అలాగే పార్టీ ప్రతిష్ట, విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశాలు కల్పించాయని కూడా నోటీస్లో ఆందోళన వ్యక్తం చేసింది అధిష్టానం. వ్యవహారం తేలేదాకా…పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశించింది బీఆర్ఎస్ అధిష్టానం.
నోటీస్ అందిన రోజు నుంచి వారంలోపు స్పష్టంగా వివరణ ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు స్పందించలేదు రోహిత్రెడ్డి. పైగా… అప్పుడు జైల్లో ఉన్నారని అనుకున్నా… బెయిల్ మీద విడుదలయ్యాక కూడా నో రియాక్షన్. కానీ… ఇంతవరకు ఆయన మీద ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోలేదు. దానికి సంబంధించిన చర్చ కూడా జరగడం లేదు. కానీ…రోహిత్ రెడ్డి జైల్లో ఉండగానే… తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా ఆయన కుటుంబీకుడు పంజాగుల శ్రీశైల్ రెడ్డిని నియమించింది పార్టీ. ఇటీవల సర్ పై పార్టీ అధిష్టానంతో జరిగిన సమీక్షా సమావేశానికి కూడా తాండూరు ఇన్ఛార్జ్ హోదాలో శ్రీశైల్ రెడ్డి హాజరయ్యారు. దీంతో డైరెక్ట్ యాక్షన్ లేకున్నా… పార్టీ అధిష్టానం పైలట్ను పక్కకు పెట్టినట్టేనా అన్న చర్చలు మొదలయ్యాయి. అదే సమయంలో ఆయన కుటుంబీకుడికే ఇన్ఛార్జ్ పోస్ట్ ఇవ్వడాన్ని చూస్తే… కేసు తేలేదాకా ఇలాగే కొనసాగిస్తారా అన్న డౌట్స్ సైతం ఉన్నాయి చాలామందికి. మరోవైపు ఇటీవల జైలు నుంచి విడుదలైన రోహిత్రెడ్డి….తన అనుచరులు, కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకున్నారు. దీంతో తాండూరు గులాబీ పార్టీలో పరిణామాలు ఎలా మారబోతున్నాయన్న ఉత్కంఠ పెరగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. ఈరోజు వరకు పార్టీ నోటీసులకు పైలెట్ సమాధానం ఇవ్వకపోవడంతో…. ఆయనకు టేకాఫ్ ఉంటుందా? లేక పర్మినెంట్ ల్యాండింగేనా అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి వికారాబాద్ జిల్లాలో.
