రౌండ్ టేబుల్ మీటింగ్ రచ్చ పెడుతోందా? కాఫీ టేబుల్.. పొలిటికల్ కాక పుట్టిస్తోందా? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ అనుకున్నాంగానీ… ఆ కప్పు చుట్టూ ఇంత రాజకీయం గుప్పుగుప్పుమంటుందని అనుకోలేదని ఆ ఎమ్మెల్యేలు ఫీలైపోతున్నారా? మసాలా దోశ తిన్న పాపానికి ఇంత పొలిటికల్ మసాలా కలిపేస్తారా అంటున్న శాసనసభ్యులు ఎవరు? ఏంటా కాఫీ కహానీ? తెలంగాణ అసెంబ్లీలో సెంట్రల్ హాల్ని సోమవారం ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ సందర్భంగా వివిధ పార్టీల ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బీజేపీ సభ్యులు కొందరు కూడా అటెండ్ అయ్యారు. ప్రారంభోత్సవం అయ్యాక… సహజంగానే..అంతా కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసేశారు. కానీ… ఆ తర్వాతే కాఫీ టేబుల్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. ఆ బ్రేక్ఫాస్ట్లో కిచిడీ ఉందో లేదోగానీ…. దాదాపు అదే స్టైల్ రచ్చ మాత్రం మొదలైపోయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు అల్పాహారం చేయడంపై రాజకీయ విమర్శలు మొదలైపోయాయి. ఇక్కడే ఇతర పార్టీల సభ్యులు ఉన్నా… ఫోకస్ మొత్తం కాషాయ దళం మీదికే మళ్లింది. బయట ఆందోళనలు జరుగుతుంటే పట్టించుకోకుండా… బీజేపీ సభ్యులు కాంగ్రెస్తో కుమ్మక్కు అయిపోయి… సీఎంతో కలిసి ఛాయ్ తాగి బిస్కెట్స్ తింటున్నారంటూ… ఈకలు పీకడం మొదలుపెట్టారట సోషల్ వీరులు. ప్రజా సమస్యలపై నిలదీయాల్సింది పోయి కలిసి ఛాయ్ తాగుతారా అంటూ సోషల్ మీడియాలో చెలరేగిపోవడం పార్టీగా బీజేపీకి కూడా ఇబ్బందికరంగా మారిందట. కొందరైతే… డైరెక్ట్ బీజేపీ ముఖ్యులకు బ్రేక్ఫాస్ట్ ఫోటోలు పంపి ఇదేందని అడుగుతున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీతో అంటకాగుతున్నారా అని ప్రశ్నిస్తుంటడంతో ఏం సమాధానం చెప్పాలో అర్ధంగాక స్టేట్ లీడర్స్ తలలు పట్టుకుంటున్నారట.
ఆ ప్రోగ్రామ్కు BRS వాళ్లు పోలేదు, మరి మీ వాళ్ళు ఎందుకు వెళ్లారని నిలదీయడమేగాక… పోకుండా ఉండాల్సింది అంటూ సలహాలు కూడా ఇస్తుండటంతో… కమలం లీడర్స్కు ఏ మాట్లాడాలో పాలుపోవడం లేదని చెప్పుకుంటున్నారు. ఆ రోజు అసెంబ్లీ లోపల, బయట తాము చేసిన ఆందోళనలు పక్కకు పోయి… కేవలం ఛాయ్ బిస్కెట్ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందంటూ తెలంగాణ బీజేపీ ముఖ్యులు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే… అదే సమయంలో ఈ బ్రేక్ ఫాస్ట్కు అటెండ్ అయిన బీజేపీ సభ్యులు మాత్రం… మాకు మానవ సంబంధాలు ఉండకూడదా అని ప్రశ్నిస్తున్నారట. రాజకీయం రాజకీయమేగానీ… ప్రారంభోత్సవం సందర్భంగా, అదీకూడా అసెంబ్లీ సెంట్రల్ హాల్ అయినందునే వెళ్ళామని, ఆ సందర్భంగా అక్కడే ఇచ్చిన విందును తిరస్కరించి రావడం సంస్కారమేనా అని అడుగుతున్నట్టు తెలిసింది. అసలు బయట ఆందోళన మొదలు కాకముందే బ్రేక్ ఫాస్ట్ అయిందని, సెంట్రల్ హాల్లో కుర్చీలు లేక పోవడం వల్లే సీఎం టేబుల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందని వివరణ ఇస్తున్నారట. అది కూడా మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేస్తేనే వెళ్ళామని, అప్పుడు కూడా మా మెడలో పార్టీ కండువాలు తీయలేదు కదా ….అంటూ లాజికల్గా మాట్లాడుతున్నారట. ఇదంతా… BRS ఒక పద్ధతి ప్రకారం కావాలనే సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ అని అంటున్నారు బీజేపీ శాసనసభ్యులు. మొత్తం మీద కారణం ఏదైనా, ఎవరి ఉద్దేశ్యం ఎలాఉన్నా… వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ దగ్గరే ఆగిపోవాల్సిన ఎపిసోడ్ ఖాళీ కప్పులు, టిఫిన్ ప్లేట్స్ చుట్టూ తిరుగుతూ ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సోషల్ మీడియా యుగంలో నాయకులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతం మరోసారి గుర్తు చేసిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

