Site icon NTV Telugu

Off The Record : రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ, జోరుగా లాబీయింగ్

Rajyasabha

Rajyasabha

తెలంగాణ నుంచి రాజ్యసభ రేస్‌లో ఉన్న నాయకులు ఎవరు? ఉన్న రెండు సీట్లలో ఒకటి ఆల్రెడీ రిజర్వ్‌ అయిపోయిందన్నది నిజమేనా? అదే నిజమైతే…. ఎవరి కోసం రిజర్వ్‌ చేశారు? మిగిలి ఉన్న ఒక్క సీటు కోసం ఎంతమంది పోటీ పడుతున్నారు? ఎవరి అడ్వాంటేజ్‌ ఏంటి? అసలు ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది? తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. సహజంగానే….. ఆశావహుల ట్రయల్స్‌ మొదలైపోయాయి. కాంగ్రెస్‌ నేతలు ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ మొదలెట్టేశారట. అధిష్టానం దగ్గర ఇటీవల జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో కూడా రాజ్యసభ ఎన్నికలపై చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతం ఖాళీ అయిన రెండు సీట్లలో ఒకటి కచ్చితంగా అధిష్టానం కోటాలోకి వెళ్తుంది. ఆ లెక్కన చూస్తే….ప్రస్తుతం ఎంపీగా ఉన్న పార్టీ సీనియర్‌ అభిషేక్ మనుసింఘ్వినే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక కేసుల విషయంలో ఆయన అవసరం చాలా ఉన్నట్టు చెబుతున్నారు. పైగా… హైకమాండ్‌కు ఆయన చాలా దగ్గర వ్యక్తి. అందుకే సింఘ్విని కొనసాగించేందుకు ఢిల్లీ పెద్దలు కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నిక జరిగే రెండిటిలో ఇక ఒక సీటే మిగులుతుంది. దాని కోసం రేస్‌లో చాలామందే ఉన్నారు.

దీంతో… ఎంపిక ఏ ప్రాతిపదికన జరుగుతుందన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. పార్టీ కోసం లాయలిస్టులుగా ఉన్న వాళ్లకు అవకాశం ఇస్తారా..? అధిష్టానం ఏం నిర్ణయిస్తే అదే ఫైనలా లేక స్టేట్‌ ప్రయారిటీస్‌ ఉంటాయా లాంటి రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఎంపిక ప్రక్రియపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు మొదలుపెట్టిన క్రమంలో….పార్టీ వర్గాల్లో రకరకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మొదటి వరుసలో ఉన్నారు పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు. రాజ్యసభ సీటు విషయమై సీఎం రేవంత్ రెడ్డి ఆనకు మాట ఇచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. వీహెచ్‌కే రాజ్యసభ టికెట్ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీని కోరేందుకు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పార్టీకి లాయల్.. పార్టీ కోసం ఈ వయస్సులో కూడా పని చేస్తున్న విహెచ్‌కు గౌరవం దక్కాల్సిందేనంటూ వత్తిడి పెంచే పనిలో ఉన్నారు జగ్గారెడ్డి. బీసీ కోటాలో హనుమంతరావుకు అవకాశం ఇస్తే పార్టీ ఇప్పుడు అందుకున్న బీసీ నినాదానికి మరింత బలం చేకూర్చినట్టు అవుతుందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే బీసీ కోటాలో మరో సీనియర్ నేత మధు యాష్కీ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

సీఎంని కలిసి మద్దతు కోరే ప్రయత్నాల్లో ఉన్నారాయన. ఇక రెడ్లకు ఇవ్వాల్సి వస్తే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి రేస్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో కూడా ఇలాంటి చర్చే జరిగిందిగానీ… వర్కౌట్‌ అవలేదు. కానీ… ఈ సారి పార్టీతో పాటు కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆయన పేరు సూచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీనియర్ నేత కోదండ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. ఇక ఎస్టీ కోటాలో బెల్లయ్య నాయక్ కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్స్‌ ఆశలు పెట్టుకున్నా ఏవీ దక్కలేదు. అందుకే ఈ సారైనా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు బెల్లయ్య నాయక్‌. కమ్మ సామాజిక వర్గం కోటాలో తన మిత్రుడు జెట్టి కుసుమ కుమార్‌కి అవకాశం ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు జగ్గారెడ్డి. అయితే వీహెచ్‌, లేదంటే జెట్టికి ఇవ్వాలంటూ వత్తిడి చేసేందుకు హస్తిన రైలెక్కారు జగ్గన్న. రాబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఈ అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రాజ్య సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ లో రేసు మొదలైంది. టికెట్ ఎవరిని వరిస్తుంది..! అధిష్టానం మనసులో ఎవరున్నారు అనేది చూడాలి.

 

 

Exit mobile version