బీఆర్ఎస్కు ఆ మాజీ ఎమ్మెల్యే గుదిబండలా మారారా? వీలైనంత త్వరగా ఆయన్ని వదిలించుకుంటేనే బెటర్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నారా? ఆ దిశగా ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయిపోయిందా? అతన్ని తక్షణం కారు నుంచి కిందికి దించేయకుంటే… ఘోరమైన డ్యామేజ్ తప్పదని ఫిక్స్ అయిపోయినట్టేనా? ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? పార్టీకి అంతలా ఏం నష్టం చేస్తున్నారు? మొయినాబాద్ ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ పార్టీ ప్రకంపనలు రెండు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ ఈవెంట్లో సిట్టింగ్, మాజీ ప్రజాప్రతినిధులు ఉండటంతో సమ్మర్ హీట్తో పోటీ పడుతున్నాయి పొలిటికల్ సెగలు. ఇందులో పాల్గొన్న ఎంపీ పుట్టా మీద ఇప్పటికే పార్టీ పరమైన దర్యాప్తునకు ఆదేశించింది టీడీపీ. ఇక ఫామ్హౌస్ ఓనర్, తమ పార్టీ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది బీఆర్ఎస్. అయితే… ఆయన వ్యవహారాన్ని అక్కడితో వదిలేయాలని అనుకోవడం లేదట గులాబీ అధిష్టానం. పైలెట్ రోహిత్ రెడ్డి వరుస వివాదాలకు కేరాఫ్గా మారడాన్ని సీరియస్గా తీసుకుంటున్నట్టు సమాచారం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన రోహిత్రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇక 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ ఇదే ఫామ్ హౌస్లో జరిగింది. అందులో పైలెట్ ప్రధాన ఫిర్యాదుదారుగా ఉన్నారు. పార్టీ మారాలంటూ తనను ప్రలోభపెట్టారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రోహిత్ రెడ్డిని పలుమార్లు విచారించింది. ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
అటు ఇటీవల జరిగిన తాండూరు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలోనూ వివాదంలో చిక్కుకున్నారు రోహిత్. కౌంటింగ్ సెంటర్లోకి నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించారనే ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే…. బెంగళూరు డ్రగ్స్ కేసుతో లింకులు ఉన్నాయనే ఆరోపణలతో అంతకు ముందు ఈడీ రోహిత్ రెడ్డిని విచారించింది. ఇక తనకు ప్రభుత్వ కేటాయించిన భద్రతా సిబ్బందితో కలిసి సినిమా స్టైల్లో రీల్స్ చేయడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడిక ఆయనకే చెందిన ఫాంహౌస్లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలంతో పాటు మాజీ ఎమ్మెల్యేకు కూడా డ్రగ్ టెస్ట్ పాజిటివ్ రావడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ క్రమంలో…. రోహిత్రెడ్డిని ఇలాగే వదిలేస్తే… పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తోందట బీఆర్ఎస్ అధిష్టానం. డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా…మాజీ ఎమ్మెల్యే మీద చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ముందుగా షోకాజ్ నోటీసు ఇచ్చారు. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని, అది సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకుంటామని కూడా నోటీస్లో పేర్కొన్నారు.
అయితే సరిగ్గా ఇక్కడే పార్టీ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. పైలట్ రోహిత్రెడ్డికి నోటీస్ అన్నది ఫార్మాలిటీ మాత్రమేనని, వారం రోజుల తర్వాతైనా ఆయన్ని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీకి లాయల్గానే ఉంటున్నా… ప్రతిసారి ఏదో ఒక వివాదంతో రచ్చ అవుతోందని, వాటన్నిటికీ మించి ఈ డ్రగ్స్, కాల్పుల ఎపిసోడ్తో పార్టీకి బాగా డ్యామేజ్ అవుతుందన్నది గులాబీ పెద్దల అభిప్రాయం అట. ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి దొరికిన తర్వాత… పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మీద కూడా…విమర్శలు చేశారు రాజకీయ ప్రత్యర్థులు. ఆ దెబ్బకు పార్టీ కూడా గట్టిగా కౌంటర్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్. దీంతో డ్రగ్స్ పార్టీలో పాల్గొనడమే కాకుండా .. దాన్ని నిర్వహించిన పైలెట్ రోహిత్ రెడ్డి విషయంలో కఠినంగానే ఉండాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వెంటనే సస్పెండ్ చేయకుండా ప్రొసీజర్ ప్రకారం షోకాజ్ నోటీస్, వారం రోజుల గడువు కూడా ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ నోటీస్కు పైలెట్ వివరణ ఇస్తారో లేదోగానీ… బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు నేతలు.
