అక్కడ నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేశాయా? కనీసం ఆ మంట చల్లార్చే దిక్కు లేకుండా పోయిందా? ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న సామాజికవర్గాలను వదిలేసి అగ్రవర్ణాలకే అన్ని పదవులు కట్టబెడుతున్నారన్న అసహనం పార్టీలో పెరిగిపోతోందా? ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఇక సోషల్ మీడియా యుద్ధంగా మారుతున్నాయా? ఎక్కడ జరుగుతోందా రచ్చ? అలా ఎందుకు వదిలేశారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి రాజుకుంటోంది. నామినేటెడ్ పదవుల ఆశల్లో ఉన్న సీనియర్స్ అవి దక్కక తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారట. గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీ చైర్మన్ లాంటి వాటితోపాటు… ఆఖరుకు జిల్లా, మండల పార్టీ కమిటీ పదవుల్ని కూడా… జంపింగ్ జపాంగ్లకే ఇస్తున్నారన్న అసంతృప్తి కట్టర్ కాంగ్రెస్ నేతల్లో పెరుగుతోంది. ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్న అసంతృప్తులు ఇప్పుడు వీధికెక్కి… ప్రెస్ మీట్లు పెట్టేదాకా వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో ఆవేదనల సంగతైతే చెప్పేపనేలేదు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజే…. అదే పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు గళమెత్తారు. పదవులన్నీ ఒక సామాజికవర్గానికేనా…అంటూ మీడియా ముందుకొచ్చి మరీ ప్రశ్నించారు.
ముగిగాల నర్సింగ్ తన అనుచరులు, బీసీ నాయకులతో కలిసి ఇదెక్కడి న్యాయం ..జెండా మోసేది మేము, పదవులు వాళ్లకా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జైనథ్ మార్కెట్ కమిటీ, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్ని అగ్రవర్ణాలకు ఇవ్వడం, అటు పార్టీ పదవుల్ని సైతం మారి వచ్చిన వాళ్లకే ఇవ్వడం లాంటి వాటితో రాద్ధాంతం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే…అటు బోథ్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఆడె గజేందర్ , డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మండల అధ్యక్ష పదవుల వ్యవహారం వివాదాస్పదమైంది. బోథ్ ,నేరడిగొండ మండలాల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు ఇచ్చారంటూ రచ్చ మొదలైంది. కొందరైతే…దీనికి సంబంధించిన ఫిర్యాదుల పెట్టేతో ఏకంగా హైదరాబాద్ దారి పట్టారు. బోథ్ మండల పార్టీ కన్వీనర్ గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థులకు సపోర్టు చేశారని బాహాటంగానే ఆరోపిస్తోంది కేడర్.
అలాంటి వ్యక్తికి పార్టీ పదవులు ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు మరో వర్గం నాయకులు. పార్టీకి ద్రోహం చేసిన వారికి, లేదా స్వార్థంతో రాజకీయ పార్టీలు మారివచ్చిన వారికి పదవులు ఇచ్చారంటూ గుర్రుగా ఉన్నారట కాంగ్రెస్ సీనియర్స్. ఇక బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం రెండు వర్గాల మధ్య పిడివాదం కొనసాగుతోందట. ఓ వర్గానికి చెంది నాయకుడికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసే సమయంలో మరో వర్గం అడ్డుపుల్ల వేసినట్టు తెలిసింది. ఇక కొమురం భీం జిల్లాలో సైతం ఇలాంటి పరిస్థితే ఉందట. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ అధ్యక్షులు విశ్వప్రసాద్, నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ…. ఇలా ఏ వర్గాని ఆ వర్గం తమవారికే పదవులు ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నాయి. దీంతో… పాత నేతలంతా…. ఎన్నికల సమయంలో పార్టీలు మారిన వచ్చిన వారికి పదవులు ఇస్తే ఎలా అంటూ నిట్టూర్చుతున్నారట. పనిచేయడం కంటే… పార్టీలు మారివచ్చి పలుకుబడి ఉపయోగిస్తే సరిపోద్దా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ రకంగా ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో అంతర్గత కుమ్మలాటలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మారిపోయింది పార్టీ పరిస్థితి. ఎవరికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, కట్టడి చేసేవాళ్ళు లేరన్నట్టుగా వ్యవహారం మారిపోయిందని అంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే… క్షేత్ర స్థాయిలో క్యాడర్ దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు పెరుగుతున్నాయి. ఓ మార్కెట్ కమిటీ పదవి ఎవ్వరికో ఇచ్చారని రచ్చకెక్కడం, మరో చోట మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యవహార శైలి నచ్చక డైరెక్టర్ పదవికి రాజీనామా చేయడం లాంటివి తెరపైకి వస్తున్నా… స్పందించి చర్యలు తీసుకునే వాళ్ళు కరవయ్యారు. పదవి రాలేదంటే ఏదోఒక తీవ్ర ఆరోపణతో సొంత నేతలనే చులకన చేసేలా మాట్లాడ్డం పక్కపార్టీలకు ఆయుధం ఇచ్చినట్టవుతుందనేది ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్లో పెరుగుతున్న ఆవేదన.
