OTR : ఆదాయం రూ.14 కోట్లు.. అప్పు రూ.300 కోట్లు..! కొత్తగూడెంలో ఇదేం లెక్క..?

Kothagudem

Kothagudem

ఆదాయం లేకుండా అప్పు ఎలా తీరుస్తాం? అప్పు ఇచ్చేవాళ్ళు ఇస్తామన్నా… కనీసం వడ్డీ కట్టడానికైనా డబ్బులుండాలి కదా…? ప్రస్తుతం తెలంగాణలోని ఆ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఇలాంటి ప్రశ్నలు చాలానే వస్తున్నాయి. వాటి చుట్టూ రాజకీయ రచ్చ సైతం కావాల్సినంత జరుగుతోంది. వడ్డీ కూడా కట్టలేనంత అప్పు చేయాలనుకుంటున్న ఆ కార్పొరేషన్‌ ఏది? తెచ్చే నిధుల్ని దేని కోసం వాడాలనుకుంటున్నారు? భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మొదట్లో మున్సిపాలిటీగా ఉండేది. తర్వాత చుట్టూ ఉన్న పలు గ్రామాలు, పాల్వంచను కలుపుకుంటూ కార్పొరేషన్‌గా చేశారు. అందుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గట్టి కృషి చేశారు. అయితే… సింగరేణి హెడ్ క్వార్టర్‌గా, జిల్లా కేంద్రంగా ఉన్న కార్పొరేషన్‌ను అదనపు నిధులతో అభివృద్ధి చేయాలనుకున్నారు. గత మున్సిపల్‌ ఎన్నికలలో ఇక్కడ సీపీఐ, కాంగ్రెస్‌కు సమానంగా సీట్లు రావడంతో… మేయర్‌ పీఠాన్ని చెరో రెండున్నరేళ్ళు పంచుకున్నారు. ముందుగా సీపీఐ సీట్లో కూర్చోగా కాంగ్రెస్‌ అభ్యర్థి డిప్యూటీ మేయర్‌ అయ్యారు. అంతవరకు ఎలాంటి వివాదం లేకున్నా…నగర అభివృద్ధి కోసం పాలకవర్గం తాజాగా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. దాని ప్రకారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల అభివృద్ధి కోసం 600 కోట్ల రూపాయలతో వివిధ పనులు చేపట్టాల్సి ఉంది. దీని కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చెరో 150 కోట్ల రూపాయలు సమకూర్చాల్సి ఉంది. మిగిలిన 300 కోట్ల రూపాయలను జర్మనీ బ్యాంక్‌ నుంచి వడ్డీకి తీసుకు రావాలన్నది ప్లాన్‌ అట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ సిద్ధమవుతోంది. ట్రాన్సిట్ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్‌ 2026 క్రింద ఈ నిధులు రావాల్సి ఉంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడిందంట.

ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్ వార్షిక ఆదాయం దాదాపు 14 కోట్లు. అవుతున్న ఖర్చు అంతకు మించే ఉంటోంది. దాన్ని సర్దుబాటు చేయడానికే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో… కొత్తగా జర్మనీ నుంచి తీసుకువచ్చే అప్పుకు వడ్డీ ఎలా కట్టాలన్నది బిగ్‌ క్వశ్చన్‌. ఇప్పటికే కిన్నెరసాని మంచినీటి పధకం కోసం తెచ్చిన అప్పు ఉంది. అది కాకుండా ఇప్పుడు అభివృద్ది పనులకు తెచ్చే మొత్తానికి ఏడాదికి 30 కోట్ల దాకా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మరి అంత వడ్డీ ఎలా కడుతారు ఎక్కడ నుంచి తెట్టి కడతారంటూ ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. అభివృద్ధి పనులకు నిధులు అవసరమేగానీ…. అవి గ్రాంట్స్‌ రూపంలో ఉంటే కార్పొరేషన్‌కు ప్రయోజనం అన్నది బీఆర్‌ఎస్‌, బీజేపీ వాదన. అసలు ఇక్కడ తెచ్చేది విదేశీ రుణం కావడంతో…. ఆ వడ్డీ ఎలా చెల్లిస్తారంటూ నిలదీస్తున్నారు విపక్ష నేతలు. ఇటు అధికారంలో ఉన్న మిత్ర పక్షం కూడా… బయటపడటం లేదుగానీ… లోలోపల రుసరుస లాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. సాధారణంగా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్స్‌కు నిధులు తెచ్చినప్పుడు ఎక్కువగా గ్రాట్స్‌ రూపంలోనే ఉంటాయి. కానీ… ఇక్కడ ఆ పరిస్థితి లేకపోవడమే అసలు సమస్య అంటున్నాయి ప్రతిపక్షాలు. అదే సమయంలో ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తోంది కాబట్టి ఇబ్బంది ఉండబోదని చెబుతోంది నగర పాలక వర్గం. ఇక్కడ ఇంకో వివాదం కూడా ఉంది. కొత్తగా తెచ్చే నిధులతో కొత్తగూడెంలో రోడ్లు, బస్టాండ్స్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటున్నారు. కానీ రోడ్లను ఆర్ అండ్ బి శాఖ, బస్‌స్టాండ్ సంగతి ఆర్టీసీ చూసుకుంటుంది కదా… అలాంటి వాటికి కార్పొరేషన్‌ ఎందుకు ఖర్చు పెట్టాలన్న ప్రశ్న వస్తోంది. మొత్తం మీద నిధులైతే రాలేదుగానీ…. వాటి పేరుతో రాజకీయ రచ్చ మాత్రం గట్టిగా నడుస్తోంది.