OTR : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. అసలు కారణం ఇదే

Tandur

Tandur

ఆ ఎమ్మెల్యేని ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్‌ అంత సీరియస్‌ కామెంట్స్‌ ఎందుకు చేశారు? ఎక్కడ తేడా కొట్టింది? నవ్వుతూనే వేసిన పంచ్‌ తగలాల్సిన వ్యక్తికి తగలాల్సిన చోట తగిలిందా? లేక ముఖ్యమంత్రి చెబితే ఏంది…? మరొకరు అంటే నాకేంది…? నాదారి నాదేన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారా? ఎవరా శాసనసభ్యుడు? స్వయంగా సీఎం ఎందుకు సీరియస్‌ అవ్వాల్సి వచ్చింది? వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఉద్దేశించి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కాక రేపుతున్నాయి. ఎకరాలు కొని.. గజాల లెక్కన బకరాలకు అమ్మే వ్యాపారాన్ని కొద్ది రోజులు పక్కన పెట్టాల్సిందేనంటూ ఎమ్మెల్యేకి బహిరంగంగానే చురకలు అంటించారు సీఎం. ​అసలు ముఖ్యమంత్రి ఎందుకలా అన్నారు? అది సరదాగా చేసిన కామెంటా? లేక ఎమ్మెల్యేకి ఇచ్చిన స్వీట్ వార్నింగా? అన్న చర్చలు హాట్‌ హాట్‌గా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే నిజంగానే ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో బిజీగా ఉన్నారా? అంటూ జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా డిస్కషన్స్‌ నడుస్తన్నాయి. సాధారణంగా పొలిటికల్‌ ప్రసంగాల్లో ఎవరి స్టైల్ వారిది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మార్క్‌ పంచ్‌లతో అవతలివాళ్ళకు చురకలు అంటిస్తుంటారు. ఓవైపు నవ్వులు పూయిస్తూనే… చెమటలు పట్టాల్సిన వాళ్ళకు పట్టిస్తుంటారాయన. తాజాగా పబ్లిక్ మీటింగ్‌లో మనోహర్ రెడ్డి విషయంలో కూడా అలాగే వ్యవహరించినట్టు విశ్లేషిస్తున్నారు. పబ్లిక్‌ మీటింగ్‌లో నవ్వుతూనే…. ఎమ్మెల్యే గాలి తీసేసినట్టు చెప్పుకుంటున్నారు. ఆ దెబ్బకు ఎమ్మెల్యే నోటి మాట రాలేదట. సీఎం కామెంట్ చేయగానే.. వేదికపై ఉన్న నాయకులు, సభలో ఉన్న కార్యకర్తలు పెద్దగా నవ్వేశారు.

రియలెస్టేట్‌ బిజినెస్‌లో బిజీగా ఉండే ఎమ్మెల్యే గారి వైఖరిని సీఎం రేవంత్… సరదా వ్యాఖ్యలతోనే సీరియస్‌గా చెప్పినట్టు విశ్లేషిస్తున్నారు. ఆయన అలా అనడానికి కూడా లెక్కలున్నాయని, అసలు మేటర్‌ వేరే అని అంటున్నారు కొందరు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ…. రియల్ ఎస్టేట్ లెక్కలు చూసుకుంటే కుదరదు.. జనం లెక్కలు చూడాల్సిందేనని తేల్చి చెప్పేశారని అంటున్నారు. ఎమ్మెల్యేకి ప్రజా సమస్యలు, పార్టీ బాధ్యతలు గుర్తుచేస్తూనే.. ఇన్ డైరెక్ట్ గా బిజినెస్ మోడ్ నుంచి ఎలక్షన్ మోడ్‌లోకి రావాలని గట్టి వార్నింగే ఇచ్చారన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. మరోవైపు సమగ్ర ఓటర్ల సవరణ ఎస్‌ఐఆర్‌ విషయంలో కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా ఉంది. ముఖ్యమంత్రి నుంచి మొదలు కింది స్థాయి వరకు ప్రతీ ఒక్కరు సర్ పై పూర్తి స్థాయిలో పని చేయాలన్న ఆదేశాలున్నాయి. కానీ… తాండూరు నియోజకవర్గంలో మాత్రం ఇప్పటి వరకు 73 శాతం మాత్రమే ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ పూర్తి అయ్యింది. నియోజకవర్గంలో 2 లక్షల 52 వేలకు పైగా ఓటర్లు ఉంటే… లక్షా 84 వేల ఓట్ల డిజిటలైజేషన్ మాత్రమే అయింది.

 

మరోవైపు 2వేల15 డబుల్ ఎంట్రీలు ఉండగా… 1,763 షిఫ్టెడ్, చనిపోయిన ఓట్లు ఉన్నాయి. వోవరాల్గా చూసుకుంటే… తాండూరులో 27 శాతం ఓటర్ల నమోదు పెండింగులో ఉంది. బీఎల్ఏలు ప్రతీ ఓటర్‌ను కలిసి ఎన్యుమరేషన్ ఫామ్స్ నింపి తిరిగి బిఎల్ఓకు ఇచ్చేలా చొరవ చూపాలని కాంగ్రెస్ అధిష్టానం నాయకులకు స్పష్టం చేసింది. కానీ… ఎమ్మెల్యే మాత్రం పార్టీ చెప్పిన పని పక్కన పెట్టి అమెరికా పర్యటనకు వెళ్ళడం విమర్శలకు దారి తీస్తోంది. కాగా సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే సీఎం ఈ రేంజ్ కామెంట్స్ చేయడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది కేవలం స్నేహపూర్వక హాస్యమా? లేక గజాల వ్యాపారంలో పడి నియోజకవర్గాన్ని, పార్టీ పనులను పక్కన పెడుతున్నారని ఇచ్చిన హెచ్చరికనా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నారు ఎక్కువ మంది. ​ఏది ఏమైనా.. రేవంత్ రెడ్డి టైమింగ్, ఆ పంచ్ డైలాగులు మాత్రం తాండూర్ కాంగ్రెస్ లో వేడి పుట్టించాయి. రేవంత్ మాటలకు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇకపై రియల్ ఎస్టేట్ బ్రేక్ ఇచ్చి.. రియల్ పొలిటికల్ ఫీల్డ్‌లోకి దిగుతారో లేదో చూడాలి.