OTR : పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో అక్రమ మైనింగ్

Mafi

Mafi

కొత్తగా ఏర్పడిన ఆ జిల్లాలో మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతోందట. గిరిజనులకు రక్షణ కల్పించాల్సిన చట్టాలు కూడా అక్కడ క్వారీ యజమానులకు చుట్టాలుగా మారిపోయాయట. అధికార, ప్రతిపక్షాలు కూడా మైనింగ్‌ మాఫియాకే వత్తాసు పలుకుతున్నాయట. అధికారులు కూడా అటే కాపు కాస్తున్నారట. గ్రామ సభ కూడా డ్రామా సభగా మారిపోయిందట. ఇంతకీ ఇదంతా జరుగుతున్నదెక్కడ..? చూద్దాం. పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని గంగవరం మండలం జగ్గంపాలెం గ్రామం మైనింగ్ మాఫియాకు అడ్డాగా మారిపోయిందట. ఏజెన్సీ ప్రాంతానికి కొండంత అండగా ఉండాల్సిన పీసా చట్టం ఇప్పుడు క్వారీ మాఫియా చేతుల్లో బంది అయిపోయిందనే ఆవేదన అక్కడి జనంలో వ్యక్తమవుతోందట. కొత్త జిల్లా ఏర్పాటును అలుసుగా తీసుకున్న మైనింగ్ రాబందులు కొందరు… ప్రజాప్రతినిధుల అండదండలతో ఉన్నతాధికారులను సైతం తమవైపు తిప్పుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామసభ ఆమోదంతోనే పనులు జరగాలన్న నిబంధన ఉండగా… దానిని అడ్డదారిలో పొందడానికి క్వారీ యాజమాన్యాలు వేసిన స్కెచ్ ఇప్పుడు ఏజెన్సీలో నిప్పులు వర్షం కురిపిస్తోందట. గిరిజనుల ఓట్లతో, వారి ఆమోదంతో సాగాల్సిన గ్రామసభ రణరంగంలా మారడానికి క్వారీ మాఫియానే కారణమట. దశాబ్దాలుగా అన్నదమ్ముల్లా కలిసి బతికిన జగ్గంపాలెం, ఓజుబంద గ్రామాల ప్రజలను మైనింగ్‌ మాఫియా బద్ధశత్రువులుగా విడగొట్టిందని సమాచారం. దాంతో గ్రామసభ ప్రారంభం కావడమే ఆలస్యం ఒకరిపై ఒకరు దాడి చేసుకునేదాకా వెళ్లిందట. క్వారీల యాజమాన్యాల కొందరికి డబ్బులు ఇచ్చాయనే ఆరోపణలు రగులుతున్న అగ్నికి ఆజ్యం పోశాయట. ఈ గొడవలో మానవత్వం కూడా మసైపోయింది. గ్రామంలో ఓ చిన్నారి మృతి చెందడంతో గ్రామసభను వాయిదా వేయాలని ఒక వర్గం కోరిందట. ఎలాగైనా మైనింగ్‌కు ఆమోదం సాధించుకోవాలనుకున్న మరో వర్గం సమావేశాన్ని కొనసాగించాలంటూ గొడవకు దిగిందట. కొండలను పిండి చేస్తున్న క్వారీ బాంబుల ధాటికి గిరిజనుల ఇళ్లు బీటలు వారుతున్నాయి. బాంబు పేలుళ్లతో రాళ్లు ఎగిరి పొలాల్లో పడుతుంటే… లేస్తున్న దుమ్ము జీడిమామిడి తోటలను తుడిచి పెట్టేస్తోంది.

క్వారీ లారీల కారణంగా ముసిరిమిల్లి కాలువ గట్టు కల్వర్టు కుంగిపోయి తాగునీరు విషతుల్యం అవుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో నరకం చూస్తున్నారు. రాత్రి వేళల్లో క్వారీల్లో బ్లాస్టింగ్ ఎక్కువగా జరుగుతోంది. ఇది చాలదన్నట్లు సర్వే నెంబర్లు లేకుండానే యథేచ్ఛగా సాగుతున్న మైనింగ్‌కు తోడు కొత్తగా మరో మూడు క్వారీలకు అనుమతి ఇచ్చారనే సమాచారం గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఇటీవల జరిగిన గ్రామసభలో ఓ గిరిజనుడు అధికారుల కాళ్లపై పడి మా భూములు, మా అడవులు కాపాడండి లేదంటే మమ్మల్ని చంపేయండంటూ కన్నీటి పర్వతమైన దృశ్యం ప్రతీ ఒక్కరిని కలచివేసింది. మైనింగ్ మాఫియా ఒకవైపు, జీవనాధారమైన అడవిని కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించిన గిరిజనులు మరోవైపు. ఇప్పుడు రంపచోడవరం ఏజెన్సీ బాంబులకు అడ్డాగా మారిపోయిందట. రంపచోడవరం నియోజకవర్గంలోని జగ్గంపాలెం, పోజుగూడెం, నేలదోనెలపాలెం, రాజవరం, ఎర్రంపాలెం, నెల్లిపూడి గ్రామాల్లో అక్రమ క్వారీల నిర్వహణ కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్వారీలకు అనుమతుల కోసం టీడీపీ, వైసీపీ నాయకులు కలిసి పనిచేస్తున్నారని, పీసా గ్రామసభలను నామమాత్రంగా నిర్వహించి గిరిజనుల పూర్తి ఆమోదం లేకుండానే అనుమతులు పొందుతున్నారట. ఇప్పటికే ఈ ప్రాంతంలో నడుస్తున్న నాలుగు క్వారీల వల్ల గిరిజనుల ఆరోగ్యం, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నా, అక్రమ క్వారీల విషయంలో మాత్రం ఇరు పార్టీల నాయకులు కుమ్మక్కయ్యారనే మాటలు అక్కడ గట్టిగానే వినిపిస్తున్నాయట. అధికారులు వెంటనే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ క్వారీలపై సమగ్ర దర్యాప్తు చేసి గిరిజనులను కాపాడతారా..? లేదంటే ఏజెన్సీ మొత్తాన్ని క్వారీ మాఫియాకు బలిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారట.