తెలంగాణలోని ఆ మంత్రులిద్దరికీ మనసులు కలవడం లేదా? జోడెడ్లలా ఒకే జిల్లాను నడపాల్సిన వాళ్లు కనీసం కలిసి ఒకే వేదిక పంచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదా? ప్రభుత్వ, పార్టీ ప్రోగ్రామ్స్లో ఒకరు పాల్గొంటే మరొకరు ముఖం చాటేస్తున్నారా? ఎవరా ఇద్దరు..? ముఖ ముఖాలు చూసుకోలేనంత దారుణమైన పరిస్థితులు ఏమున్నాయి? దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి…. ఇద్దరూ తెలంగాణ మంత్రులు. బలమైన నేతలే. రాజనర్సింహ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి కాగా…. వివేక్ ఇదే జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు గతంలో ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ పని చేశారు. అప్పుడు ఇద్దరూ కలిసే సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ ఆ తర్వాత జరిగిన మార్పుల్లో… ఏడాది క్రితం కొండా ప్లేస్లో వివేక్ నియమితులయ్యారు. అప్పుడు కూడా… సంగారెడ్డిలో ప్రజాపాలన కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు కలిసి హాజరయ్యారు. కానీ… వాళ్ళు కలిసి పాల్గొన్న మొదటి, చివరి కార్యక్రమం అదే. ఆ తర్వాత ఏ కార్యక్రమమైనా వేదిక పంచుకున్న దాఖలాలు లేవు. ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వచ్చాడని తెలిస్తే… జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ ఆ ప్రోగ్రాంకు డుమ్మా కొడతారట. అలాగే… దామోదర ఉన్న కార్యక్రమానికి వివేక్ అటెండ్ అవడం లేదు. అందుకే సంగారెడ్డి కంటే మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువగా పర్యటిస్తున్నారట వివేక్.
ఏప్రిల్లో పటాన్ చెరు మార్కెట్ యార్డు పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. దానికి మొదటగా జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ వచ్చారు. కార్యక్రమం అయిపోయే టైంలో ఎంటరయ్యారు ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి.
అప్పటికే వేదిక దిగిన దామోదర…. వివేక్తో కరచాలనం చేస్తూ వెళ్లిపోయారు. అయితే… అప్పటికే కార్యక్రమం ఆలస్యం కావడం, దామోదరకి ఆందోల్ నియోజకవర్గంలో వేరే ప్రోగ్రామ్స్ ఉండటంతో వెళ్లిపోయారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పీఏసీ సమావేశానికి అటెండ్ అయ్యారు దామోదర. కానీ… ఇన్ఛార్జ్ వివేక్ రాలేదు. మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లా తొగర్పల్లిలో ఓ పరిశ్రమకు భూమి పూజ జరిగింది. అందులో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మరో మినిస్టర్ వివేక్ మాత్రం వెళ్లలేదు. ఇక తాజాగా… పటాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీల్లో 84 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. వీటిలో జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ పాల్గొన్నారు. దామోదర రాజనర్సింహ వస్తారని అందరూ అనుకున్నా ఆయన మాత్రం రాలేదు. దీంతో… ఇద్దరు మంత్రుల మధ్య ఎక్కడో చెడిందని, ఏదో జరిగిపోతోందన్న చర్చ అటు క్యాడర్ లోనూ..ఇటు పబ్లిక్ లోనూ మొదలైంది. విభేదాల కారణంగానే… ఒకే వేదికను పంచుకోవడానికి ఇద్దరూ ఇష్టపడటం లేదన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. తేడా కొట్టడం వల్లే… ఎవరికి వారు మాటల్లేవ్…. మాట్లాడుకోవడాల్లేవ్ అన్నట్టుగా ఉంటున్నారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి జోడెడ్లలా కలిసి పనిచేయాల్ని నేతలు పంతాలకు పోయి ఇలా వ్యవహరించడమేంటని కాంగ్రెస్ కేడర్ కూడా నారాజ్గా ఉందట.
ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో…పటాన్చెరు నియోజకవర్గంలోని ఓ ఒక్క మున్సిపాలిటీని గెల్చుకోలేకపోయింది కాంగ్రెస్. అందుకు మంత్రుల తీరే కారణమన్న వాదన ఉంది. అప్పట్లో ఎన్నికల ప్రచారానికి మంత్రి దామోదర వెళ్లనే లేదు. ఇంచార్జ్ మంత్రి వివేక్ సుడిగాలి పర్యటనలు చేసినా ఫలితం శూన్యం. ఇద్దరూ కలిసి వ్యూహలు రూపొందించి ఉంటే… ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల్లో ఫలితాలు మరోలా ఉండేవని లోకల్ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటోంది. ఈ పరిస్థితుల్లో త్వరలో గ్రేటర్ కార్పొరేషన్ల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో కొన్ని ప్రాంతాలు పటాన్చెరు పరిధిలో ఉన్నాయి. వాటి కోసం ఇప్పటి నుంచే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అనుచరులతో కలిసి డివిజన్స్లో పర్యటిస్తున్నారు. కానీ… కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రోటోకాల్ సమస్యలతో వెళ్ళడం లేదట. దానికి తోడు ఇద్దరు మంత్రుల మధ్య గ్యాప్ ఇలానే ఉంటే గత మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే జీహెచ్ఎంసీలో కూడా రిపీట్ అవుతాయేమోనన్నది కేడర్ డౌట్. అందుకే… ఇప్పటికైనా పంతాలు, పట్టింపులు పక్కన పెట్టి కలిసి పని చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళలో మార్పు రాకుంటే అంతిమంగా నష్టపోయేది పార్టీయేనన్న సంగతిని ఇద్దరూ గుర్తుంచుకోవాలని అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.
