పార్టీతో పాటు సొంత కులంలో కూడా…. ఆ మంత్రి ఒంటరి అయ్యారా? అయినోళ్ళే ఆయన్ని కాదు పొమ్మంటున్నారా? సామాజికవర్గ కార్యక్రమానికి కావాలనే ఆయన్ని పిలవకుండా తమ మనసులోని అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారా? అదే సమయంలో ఆయనకు కాలేలా….. అదే కులం కాకున్నా, బీసీ కోటాలో మరో మంత్రిని ఎంకరేజ్ చేస్తున్నారా? అంతలా ఒంటరి అవుతున్న ఆ ఏపీ మినిస్టర్ ఎవరు? అందుకు కారణాలేంటి? శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగా… ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ… ప్రత్యేకంగా ప్రోగ్రామ్ పెట్టారు. కానీ… ఆ కార్యక్రమంలో ఎక్కడా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఊసే లేకపోవడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర మంత్రివర్గంలో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వన్ అండ్ వోన్లీ మినిస్టర్ సుభాష్. కానీ… మీటింగ్లో ఎక్కడా ఆయన కనిపించక, వినిపించకపోవడంతో కుల పెద్దలు కామ్గా ఆయన్ని పక్కన పెట్టేస్తున్నారా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. శెట్టిబలిజలకు తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు కొంతకాలంగా ప్రమోట్ చేసుకుంటున్న మంత్రికి ఇది షాకింగేనంటున్నారు పరిశీలకులు. స్వయంగా మంత్రి అయి ఉండి, ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగస్వామ్యం ఇవ్వలేదంటే….సొంత కులంలో ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టే కదా…. అన్నది ఎక్కువ మంది అనుమానం. అటు క్యాబినెట్లో కూడా మోస్ట్ జూనియర్ వాసంశెట్టి సుభాష్.
కానీ… తాను మంత్రి అయ్యాక ఆయన వైఖరి మారిపోయిందని, జిల్లాలోని సీనియర్స్ని పూర్తిగా పక్కన పెట్టేశారని, అందుకే అంతా ఏకమైనట్టు చెప్పుకుంటున్నారు. సరే… ఎంతైనా మనోడు, మంత్రి హోదాలో ఉన్నాడు, పోనీలే అని ఏదైనా ప్రోగ్రామ్కి పిలిస్తే…. సొంత డబ్బా కొట్టుకోవడం బాగా పెరిగిపోయిందట. పైగా అంతా నావల్లేనంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే.. ఆ గప్పాలు వినలేంరా… బాబూ… అంటూ ఇటు కులంలోను, అటు టీడీపీలోనూ సీనియర్స్ మొత్తం వాసంశెట్టిని పట్టించుకోవడం మానేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక విజయవాడలో ఆ ధన్యవాద కార్యక్రమం జరిగిన రోజున మంత్రి సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో ఖాళీగానే ఉన్నారు. ఇతరత్రా ఎలాంటి బిజీ లేకుండా కూడా మైలేజ్ వచ్చే ప్రోగ్రామ్కి వెళ్ళలేదంటేనే…పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. అలాగే… ఆ మధ్య శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా రాజమండ్రిలో సమావేశమయ్యారు. పార్టీలతో సంబంధం లేకుండా సొంత కులానికి చెందిన టీడీపీ, వైసీపీ నేతలంతా ఆ కార్యక్రమానికి అటెండ్ అయినా… సుభాష్ మాత్రం కనిపించలేదు. అంతా కలిసి ఆయన్ని సైడ్ చేసేశారంటూ అప్పుడే చర్చ జరిగింది. గతంలో ఎప్పుడైనా కులానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగితే… ఐకమత్యంగా కనిపించేవని, సుభాష్ వచ్చాక సెల్ఫ్ ప్రమోషన్ మాత్రమే చేసుకుంటున్నారని ఆ మీటింగ్కు అటెండ్ అయిన వాళ్ళు అభిప్రాయపడ్డారట.
మరోవైపు ఆ సమావేశంపై మంత్రి అనుచరులు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. ఎన్నికలకు ముందు వరకు రామచంద్రపురం టిడిపి కోఆర్డినేటర్గా రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు.. ఆఖరి నిమిషంలో ఆయన్ని పక్కనపెట్టి కొత్తగా పార్టీలో చేరిన సుభాష్కు టిక్కెట్ ఇచ్చారు. గెలవగానే… క్యాస్ట్ ఈక్వేషన్స్లో మంత్రిగా అవకాశం దక్కింది. దాంతో…. రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా… సుభాష్పై కౌంటర్స్ వేస్తున్నారట. ఇక అటు విజయవాడలో జరిగిన కార్యక్రమానికి మరో బీసీ మంత్రి కొల్లు రవీంద్రను ఆహ్వానించారు నిర్వాహకులు. ఆయనది సొంత సామాజిక వర్గం కానప్పటికీ… బీసీ కోటాలో అవకాశం ఇచ్చారట. దాంతో… కొల్లు కూడా శెట్టిబలిజ సామాజికవర్గంలో సుభాష్ కి వ్యతిరేకంగా ఉన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే ఛాన్స్ అన్నట్టు… తాను మొదటి నుంచి టీడీపీలో ఉన్నానని, తనతో పాటు పార్టీలో ఉన్న బీసీ నేతల కోసం ఆలోచిస్తానంటూ కొల్లు అడ్వాన్స్ అవుతున్నట్టు తెలుస్తోంది.
శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారన్నది సామాజికవర్గంలో ఉన్న అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో…. ఎవరైనా దొమ్మేటి వెంకట రెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాలేదని మంత్రిని అడిగితే సమాధానం చెప్పలేక సతమతమవుతున్నట్టు తెలిసింది. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి థాంక్స్ చెప్తూ చేసిన కార్యక్రమంలో మంత్రి మెరవలేదు. ఆయనకు నచ్చని వాళ్ళు ఉన్నారు కాబట్టే సుభాష్ రాలేదని అనుచరులు కవర్ చేసుకుంటుండగా… తామే ప్రయారిటీ ఇవ్వలేదంటూ అవతలి నుంచి రెస్పాన్స్ వస్తోంది. కులం మీద ఆయనకు అంతగా అభిమానం ఉండే… రావచ్చు కదా… ఎవరు అడ్డుపడ్డారన్నది అపోజిషన్ రియాక్షన్. ఓవరాల్గా ఈ ఎపిసోడ్ను చూస్తుంటే… వాసం శెట్టి మీద వ్యతిరేకత బీసీ కోటాలో కొల్లుకు బాగా కలిసొస్తోందన్నది టీడీపీ టాక్.
