Off The Record : మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల కాంగ్రెస్‌లో నిరాశ!

  • నామినేటెడ్‌ పదవుల కోసం మెదక్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతల ఎదురుచూపులు
  • పార్టీ నాయకత్వంపై గుర్రుగా ద్వితీయ శ్రేణి
  • మెదక్‌, నర్సాపూర్‌ నియోజకవర్గాల కాంగ్రెస్‌లో నిరాశ
  • ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయానికి ఏటా 20 లక్షల మంది భక్తులు
Medak

Medak

ఆ జిల్లాలో నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వాళ్ళకు మిగిలేది గుండు సున్నాయేనా? పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదేళ్లు నానా కష్టాలు పడ్డా… చివరికి మిగిలేది అదేనా అన్న నైరాశ్యం పెరిగిపోతోందా? తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పదవుల భర్తీ జరుగుతున్నా… ప్రత్యేకంగా అక్కడ మాత్రమే ఎందుకు ఆగిపోయాయి…? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాక….2023లో అధికారంలోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చాలామంది నామినేటేడ్ పోస్టులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మిగతా చోట్ల ఎలాఉన్నా… మెదక్ జిల్లా నాయకులు మాత్రం ఆ ఆశలు అస్సలు నెరవేరక లోకల్ లీడర్‌తో పాటు పార్టీ అధినాయకత్వం మీద కూడా గుర్రుగా ఉన్నారట. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతున్నా ఇప్పటివరకు జిల్లాలో నామినేటేడ్ పోస్టులు భర్తీ కాకపోవడంతో ప్రోటోకాల్ పవర్ కోసం పాట్లు పడుతున్నారట. ప్రధానంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. మెదక్ నియోజకవర్గంలో… తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం ఉంది.

అలాగే…మెదక్, పాపన్నపేట, రామాయంపేట మార్కెట్ కమిటీల ఛైర్మన్‌ పోస్టులను కూడాని భర్తీ చేయాల్సి ఉంది. 30 నెలలవుతున్నా… వీటిలో ఏ ఒక్క పదవీ భర్తీ చేయకపోవడంతో కాంగ్రెస్ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉందట. ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి తెలంగాణ, ఏపీతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఏటా 20 లక్షల మంది వరకు భక్తులు వస్తారు. అమ్మవారి ఆలయ ఆదాయం ఏడాదికి 15 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్నా… రెండేళ్ళ నుంచి పాలకమండలి లేదు. ఆలయ కమిటీ చైర్మన్‌తో పాటు 14 మంది డైరెక్టర్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది క్రితమే పాలకమండలి ఖరారైనట్టు ప్రచారం జరిగినా… ఇప్పటి దాకా… ఎవరినీ నియమించలేదు. దీంతో… టెంపుల్‌ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందన్న ఆవేదన వ్యక్తమవుతోంది భక్తుల్లో. ఇక మెదక్, పాపన్నపేట, రామాయంపేట మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు అయినా…. పాలకమండళ్లు ఏర్పాటు చేయలేదు.

పక్క నియోజకవర్గాల్లో నామినేటెడ్‌ పదవులు భర్తీ అవుతుండటం..మెదక్‌లో మాత్రం నీలి నీడలు కమ్ముకుంటుండటంతో… తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరాశగా ఉన్నారు ఆశావహులు. మార్కెట్ కమిటీ పదవీకాలం రెండేళ్లు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లోనే నియమించి ఉంటే…ఈ పాటికి ఒక ధఫా ముగిసి… ఇప్పుడు మరొకరికి అవకాశం వచ్చి ఉండేది. పార్టీ కోసం కష్టపడ్డవారికి పదవులు దక్కేవని అంటున్నారు. కానీ… మైనంపల్లి రోహిత్‌రావు గెలుపు కోసం కష్టపడ్డా… గుర్తింపు దక్కడం లేదని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ద్వితీయ శ్రేణి నాయకులు. పార్టీ అధికారంలో ఉన్నా… పదవుల కోసం తమకు ఎదురుచూపులు తప్పడం లేదన్నది వాళ్ళ బాధ. ఇక నర్సాపూర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఉండగా… కాంగ్రెస్‌ ఇన్ఛార్జ్‌గా ఆవుల రాజిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ పరిధిలో నర్సాపూర్ మార్కెట్ కమిటీ, నర్సాపూర్ ఆది లక్ష్మీ నారాయణ స్వామి, చాకరి మెట్ల సహకార ఆంజనేయ స్వామి, తునికి నల్ల పోచమ్మ, సికింద్లాపూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాల పాలక మండళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ పదవుల భర్తీ కోసం కాంగ్రెస్ నాయకులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

ఇలా రెండు నియోజకవర్గాల్లో రెండున్నరేళ్లుగా పదవులు పెండింగ్ లో పెట్టడానికి ఓ లెక్క ఉందన్నది కొందరి వాదన. ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో… ఒకరికి ఇస్తే పార్టీలో వర్గ విబేధాలు, అసమ్మతి సెగలు రేగే అవకాశం వుందని, అందుకే వాయిదా పర్వం నడుస్తోందని చెప్పుకుంటున్నారు. కానీ… అదే నిజమైతే…సర్ది చెప్పి పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇవ్వాలిగానీ…..అసలు పదవులే ఇవ్వకుండా జాప్యం చేస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏమై పోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నష్టపోతారని…ఇదే జరిగితే ఫైనల్ గా పార్టీకే నష్టమంటూ టీపీసీసీ పెద్దల చెవిన వేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయమై జోక్యం చేసుకుని పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు న్యాయం చేయాలని కోరుతున్నారు.